త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | బీఆర్ఎస్ ‘బ్లాక్ మెయిల్’ పార్టీ.. బీజేపీతో ఫెవికాల్ బంధం..!

భూపాలపల్లి గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగ్రరూపం దాల్చారు. బీఆర్ఎస్ పార్టీని "బ్లాక్ మెయిల్ రాజ‌కీయ స‌మితి"గా అభివర్ణిస్తూ, ఫోన్ ట్యాపింగ్, అవినీతి అక్రమాలపై నిప్పులు చెరిగారు. జిల్లాలు రద్దు చేస్తారన్న ప్రచారాన్ని కొట్టిపారేస్తూనే, సింగరేణి కార్మికులకు, పేదలకు ఇందిరమ్మ ఇండ్ల వరాలు ప్రకటించారు.

J

Telangana | Published On Feb 8, 2026, 6.41 pm IST

Revanth Reddy | బీఆర్ఎస్ ‘బ్లాక్ మెయిల్’ పార్టీ.. బీజేపీతో ఫెవికాల్ బంధం..!
Advertisement

Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ప్రజా పాలన - ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా భాగంగా భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం జిల్లాలోని చెల్పూరులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ఉద్యమకర్త ప్రొఫెసర్ జయశంకర్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వంటి మహానుభావులను కన్న ఈ గడ్డపై, అభివృద్ధి ముసుగులో గత పాలకులు చేసిన దోపిడీని ఆయన ఎండగట్టారు.

బీఆర్ఎస్ - 'బ్లాక్ మెయిల్ రాజ‌కీయ స‌మితి'

  • గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "ఫోన్ ట్యాపింగ్‌తో భార్యాభర్తల సంభాషణలను కూడా వదలకుండా విన్న పాపాత్ములు వారు. వ్యాపారులను బెదిరించి ఆస్తులు రాయించుకున్నారు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ అంటే 'బ్లాక్ మెయిల్ రాజ‌కీయ స‌మితి'గా మారింది" అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్ల వ్యాపారాలు, ఫామ్ హౌస్ లు కట్టుకుంటే, పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు రాలేదని మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి కనీసం భూపాలపల్లికి బైపాస్ రోడ్డు కూడా తీసుకురాలేని అసమర్థులు అని ఎద్దేవా చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య 'ఫెవికాల్ బంధం'

  • బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని, అవి 'బిల్లా-రంగా'ల్లా కలిసి పనిచేస్తున్నాయని సీఎం విమర్శించారు. "కిషన్ రెడ్డి ఇప్పుడు 'కల్వ‌కుంట్ల కిష‌న్ రావు'గా మారి కేసీఆర్ కుటుంబానికి కంచె వేసి కాపాడుతున్నారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరపకుండా అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డే. ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను కాపాడుతున్నది మీరు కాదా?" అని ప్రశ్నించారు. మోదీ ఎన్నడూ భూపాలపల్లి వైపు చూడలేదని, ఎన్నికల సమయంలో బొమ్మలు చూపి ఓట్లు అడగడానికి మాత్రమే వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ హయాంలోనే సంక్షేమం - సింగరేణి కార్మికులకు వరం

  • కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల కోసం మెడికల్ అన్-ఫిట్ బోర్డును రద్దు చేస్తామని, వారసత్వ ఉద్యోగాలపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. 217 మంది డిస్మిస్ కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. "ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నాం. వచ్చే బడ్జెట్‌లో రెండో విడత ఇళ్లను మంజూరు చేస్తాం. ఆడబిడ్డలకు ప్రతి ఏటా 'ఇందిరమ్మ చీర'ను సారెగా ఇస్తాం" అని ప్రకటించారు.

భూపాలపల్లి జిల్లా ఎక్కడికీ పోదు

  • జిల్లాల పునర్విభజనపై వస్తున్న వార్తలను రేవంత్ రెడ్డి ఖండించారు. ఏ జిల్లాను తొలగించడం కానీ, కొత్తవి ఏర్పాటు చేయడం కానీ ప్రభుత్వం ముందు లేవని స్పష్టం చేశారు. అసెంబ్లీలో చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం ఉంటుందని, రాజకీయం కోసం జిల్లా రద్దు చేస్తారని విష ప్రచారం చేసేవారిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement