త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?

అయోధ్య రామమందిరానికి తాను విరాళంగా ఇచ్చిన రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్‌ను అక్కడి నుంచి తరలించారని మాజీ ఐఏఎస్ అధికారి ఆరోపించడం కలకలం రేపుతోంది.

J

National | Published On Jul 5, 2026, 9.00 pm IST

Gold Ramcharitmanas Missing | అయోధ్య రామమందిరంలో రూ.5 కోట్ల విలువైన బంగారు రామచరితమానస్ ఏమైంది?
Advertisement
  • అయోధ్య రామాలయంలో తాను సమర్పించిన రూ.5 కోట్ల బంగారు రామచరితమానస్‌ను అక్కడి నుంచి మార్చేశారని మాజీ IAS ఎస్. లక్ష్మీనారాయణన్ ఆరోపణ
  • గుడిలో భక్తులు ఇచ్చే అన్ని కానుకలనూ ప్రదర్శనకు పెట్టలేమని స్పష్టం చేసిన ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్
  • విరాళాల లెక్కింపులో అవకతవకలపై సిట్ (SIT) విచారణ, ఇప్పటికే ఎనిమిది మంది అరెస్ట్
  • దొంగతనాలను అరికట్టేందుకు లెక్కింపు సిబ్బందికి జేబులు లేని బ్లూ యూనిఫాం, డబుల్ సెక్యూరిటీ చెకింగ్ తప్పనిసరి చేసిన టెంపుల్ ట్రస్ట్

Gold Ramcharitmanas Missing | త్రినేత్ర.న్యూస్ : అయోధ్య రామమందిరంలో (Ram Temple) సమర్పించిన కానుకల చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. తాను రామాలయానికి విరాళంగా ఇచ్చిన సుమారు రూ.5 కోట్ల విలువైన బంగారు పూత పూసిన 'రామచరితమానస్' (Ramcharitmanas) గ్రంథాన్ని అక్కడి నుంచి మార్చేశారని మాజీ ఐఏఎస్ అధికారి ఎస్. లక్ష్మీనారాయణన్ బాహాటంగా ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే..

లక్ష్మీనారాయణన్ కుటుంబం ఏప్రిల్ 2024లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు ఈ బంగారు రామచరితమానస్‌ను విరాళంగా అందించింది. అయితే, ఆ పవిత్ర గ్రంథాన్ని ఆలయ ప్రాంగణం నుంచి వేరే చోటికి తరలించారని ఆయన ఆరోపిస్తున్నారు. దీనిపై ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌ను (Champat Rai) ప్రశ్నిస్తే.. భక్తులు సమర్పించే ప్రతీ కానుకనూ గుడిలో ప్రదర్శనకు పెట్టడం సాధ్యం కాదని ఆయన బదులిచ్చినట్లు లక్ష్మీనారాయణన్ వెల్లడించారు.

గతంలోనూ వెండి ఇటుకల వివాదం

రామమందిరంలో భారీ ఎత్తున వెండి ఇటుకలు మాయమయ్యాయంటూ గతంలో విపక్షాలు, ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) కూడా ప్రశ్నలు లేవనెత్తాయి. టెంపుల్ నిర్మాణ సమయంలో శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే ఇచ్చిన 4 కిలోల వెండి ఇటుక కూడా ఇందులో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, సుమారు 200 కిలోల వెండి దొంగిలించబడిందనే ఊహాగానాలను విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) కొట్టిపారేసింది.

ఆభరణాలు కరిగించి బిస్కెట్లుగా మార్చారా?

గుడి విరాళాల దుర్వినియోగం వ్యవహారం జూన్ 7న వెలుగులోకి రాగా.. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (SIT) ప్రాథమిక నివేదిక ఆధారంగా జూన్ 25న ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. గుడి నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలను కరిగించి బిస్కెట్లుగా మార్చారా అనే కోణంలోనూ సిట్ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విరాళాల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న ఎనిమిది మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

ట్రస్ట్ కఠిన నిబంధనలు

విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. లెక్కింపు ప్రక్రియలో భారీ మార్పులు చేసింది. సెక్యూరిటీని, పారదర్శకతను పెంచింది. ఇకపై విరాళాలు లెక్కించే సిబ్బంది కౌంటింగ్ హాల్‌లోకి వెళ్లే ముందు రెండు అంచెల (two-tier) కఠినమైన సెక్యూరిటీ స్క్రీనింగ్ దాటాల్సి ఉంటుంది. నగదు లేదా విలువైన వస్తువులను దాచుకునే అవకాశం లేకుండా, సిబ్బంది అంతా తప్పనిసరిగా జేబులు లేని డార్క్ బ్లూ యూనిఫాం (dark blue uniforms without pockets) వేసుకోవాలని కొత్త డ్రెస్ కోడ్ రూల్ తీసుకొచ్చారు.

Advertisement
Advertisement