త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | రెండేండ్లు స‌మ‌య‌మివ్వండి.. టీచ‌ర్ల‌కు సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి

Revanth Reddy | త‌న‌కు రెండేండ్లు స‌మ‌యం ఇస్తే స‌మ‌స్య‌ల‌న్నింటినీ ప‌రిష్క‌రిస్తాన‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy ) ఉపాధ్యాయుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రెండు సంవ‌త్స‌రాలు అంకిత‌భావంతో ప‌నిచేయాల‌ని సూచించారు.

G

Telangana | Published On Sep 5, 2026, 12.35 pm IST

Revanth Reddy | రెండేండ్లు స‌మ‌య‌మివ్వండి.. టీచ‌ర్ల‌కు సీఎం రేవంత్ విజ్ఞ‌ప్తి
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: త‌న‌కు రెండేండ్లు స‌మ‌యం ఇస్తే స‌మ‌స్య‌ల‌న్నింటినీ ప‌రిష్క‌రిస్తాన‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy ) ఉపాధ్యాయుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రెండు సంవ‌త్స‌రాలు అంకిత‌భావంతో ప‌నిచేయాల‌ని సూచించారు. ల‌క్ష‌లాది విద్యార్థుల భ‌విష్య‌త్తు టీచ‌ర్ల చేతిలో ఉంద‌ని చెప్పారు. మ‌రో రెండేండ్ల త‌ర్వాత తాను కూడా ఎగ్జామ్ రాస్తాన‌ని, అప్పుడు ఫ‌లితం ఉపాధ్యాయుల చేతిలో ఉంటుంద‌న్నారు. ఆ ప‌రీక్ష‌లో 100 మార్కులు వేస్తారో, గుండు సున్నా పెడ‌తారో ఉపాధ్యాయులే నిర్ణ‌యిస్తార‌ని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సం సంద‌ర్భంగా కొడంగ‌ల్ ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఇటీవ‌ల ఇందిరాపార్క్‌ వద్ద ఉపాధ్యాయులు (Teachers) ధర్నా చేస్తే త‌న‌కు బాధ కలిగిందన్నారు. చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను తాను అధికారంలోకి రాగానే పూర్తి చేశాన‌ని తెలిపారు. టీచర్ల బదిలీల విషయంలో కూడా చాలా జాగ్రత్తులు తీసుకున్నామ‌ని, 315 జీవో ద్వారా చాలా సమస్యలు పరిష్కరించామని తెలిపారు. ప్రతినెల ఒకటో తేదీనే జీతాలు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే పీఆర్సీ సమస్య కూడా పరిష్కరించామని గుర్తు చేశారు. ఉన్నతస్థానాల్లో ఉన్నవారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారే ఉన్నారని గుర్తుచేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని చెప్పారు.

విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకువస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఉపాధ్యాయులపై నమ్మకంతోనే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి అందరికి సంపూర్ణమైన అవగాహన ఉందని, తల్లిదండ్రులతోపాటు సమానంగా పిల్లల భవిష్యత్తుకు పునాది వేసేది ఉపాధ్యాయులేనని తెలిపారు. పిల్లల భవిష్యత్తు తరగతి గదిలోని ఉపాధ్యాయులు చేతిలోనే ఉంటుందన్నారు. తెలంగాణలో 88 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని తెలిపారు. విద్యాశాఖ జాతీయ సగటులో తెలంగాణ 17వ స్థానానికి చేరుకుందన్న సీఎం, తెలంగాణలో 88 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులపై నమ్మకంతోనే ఇది సాధ్యమైందన్నారు.

తెలంగాణలో ఒక్క కుటుంబమే రూ.7.50 లక్షల కోట్లు అప్పు చేసిందన్న సీఎం, 90 రోజుల్లోనే రూ.6 వేల కోట్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ అందించామన్నారు. విదేశాల్లో ఉన్న విద్యా విధానాన్ని పరిశీలించాలని టీచర్లను విదేశాలకు పంపామని, ఉపాధ్యాయుల సేవలను తక్కువ చేసి చూడాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న సీఎం, ఉపాధ్యాయులు 2 ఏళ్లు తనకు సమయం ఇస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement