త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy Letter to ECI | 73.39 లక్షల మంది ఓటర్లను తప్పుల జాబితాలో పెట్టడం ఏంటి? సీఈసీకి రేవంత్ లేఖ

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అర్హులైన ఓటర్లు జాబితాలో ఉండేలా గడువు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

J

Telangana | Published On Aug 29, 2026, 4.17 pm IST

CM Revanth Reddy Letter to ECI | 73.39 లక్షల మంది ఓటర్లను తప్పుల జాబితాలో పెట్టడం ఏంటి? సీఈసీకి రేవంత్ లేఖ
Advertisement
  • ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గడువును మరో 4 వారాలు పొడిగించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ
  • ఏకంగా 73.39 లక్షల మంది ఓటర్లను (21.7%) ASDD (గైర్హాజరు, షిఫ్టెడ్, చనిపోయినవారు, డూప్లికేట్) జాబితాలో చేర్చడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన సీఎం
  • తాత్కాలికంగా వేరే ఊరు వెళ్లిన వారిని కూడా శాశ్వతంగా తరలివెళ్లినట్లుగా (permanently shifted) పరిగణిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లిన రేవంత్
  • అర్హులైన ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కు గల్లంతు కాకుండా ఉండేలా.. ఓటర్లకు నోటీసుల గడువును పెంచాలని, బూత్ స్థాయిలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని వినతి

CM Revanth Reddy Letter to ECI | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్ల పేర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉండటంతో, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు ఆయన ఒక సుదీర్ఘ లేఖ రాశారు. అర్హులైన ఓటర్లెవరికీ అన్యాయం జరగకుండా అభ్యంతరాల స్వీకరణ గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

73 లక్షల మంది ఎంట్రీలపై ఎఫెక్ట్

3.38 కోట్ల మంది ఓటర్లున్న తెలంగాణలో ఏకంగా 73.39 లక్షల (21.7 శాతం) ఎంట్రీలను బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) తప్పుల జాబితా కింద ఉంచారని సీఎం పేర్కొన్నారు. వీరిని ASDD (Absent, Shifted, Dead, and Duplicate) కేటగిరీలో పెట్టడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఇందులో దాదాపు 62 శాతం మందిని (45.19 లక్షలు) "శాశ్వతంగా తరలివెళ్లినట్లు" (permanently shifted) నమోదు చేయడం అత్యంత ఆందోళనకరమని లేఖలో వివరించారు.

క్షేత్రస్థాయిలో జరుగుతున్న తప్పులు ఇవే..

ప్రస్తుతం జరుగుతున్న వెరిఫికేషన్ ప్రక్రియలో ఉన్న లోపాలను సీఎం ఎత్తిచూపారు. బీఎల్‌ఓలు (BLO) సర్వేకి వచ్చినప్పుడు ఓటరు ఏదైనా పని మీద బయటకు వెళ్లినా, ప్రయాణాల్లో ఉన్నా సరే.. వారిని ఇల్లు ఖాళీ చేసి శాశ్వతంగా వెళ్లిపోయినట్లుగా పరిగణిస్తున్నారని రేవంత్ రెడ్డి ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కేవలం ఇల్లు మారినంత మాత్రాన వారికి కొత్త అడ్రస్‌లో ఓటు నమోదు చేసుకునే అవకాశం ఇవ్వకుండా పాత అడ్రస్‌లో నేరుగా ఓటు తొలగించడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఈ తరహా నోటీసులు ఎక్కువగా ఇస్తున్నారని తెలిపారు.

సీఎం రేవంత్ చేసిన ప్రధాన విన్నపాలు

గడువు పెంపు: సెప్టెంబర్ 16తో ముగుస్తున్న క్లెయిమ్స్, అభ్యంతరాల గడువును కనీసం మరో నాలుగు వారాల పాటు పొడిగించాలి. సమీప భవిష్యత్తులో తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేనందున ఈ వెసులుబాటు కల్పించాలి.

నోటీసులకు సమయం: ఓటర్లు నోటీసులకు స్పందించడానికి, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడానికి ప్రస్తుతం ఇస్తున్న ఒక వారం సమయం సరిపోదు, ఆ గడువును 3-4 వారాలకు పెంచాలి.

హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు: నోటీసులు అందుకున్న ఓటర్లకు సాయం చేసేందుకు బూత్ స్థాయిలో హెల్ప్ డెస్క్‌లు (Helpdesks) ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించాలి.

పబ్లిక్ రీడింగ్: గ్రామ సభలు, పట్టణాల్లోని వార్డు కమిటీ సమావేశాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను (Draft rolls) బహిరంగంగా చదివి వినిపించాలి.

డాక్యుమెంట్ల సడలింపు: ఈసీ ఇటీవల తిరస్కరించిన 'ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్' స్థానంలో, స్థానికంగా మండలాఫీసుల్లో తక్కువ సమయంలో సులభంగా దొరికే ఇతర ప్రత్యామ్నాయ ధృవీకరణ పత్రాలను అనుమతించాలి.

అదనపు సిబ్బంది: హైదరాబాద్ జిల్లాలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి దాదాపు 78,000 పైగా నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయి. విచారణలు వేగవంతం చేసేందుకు అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను (ERO) నియమించాలి.

అర్హుడైన ఏ ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కు కోల్పోకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ భారీ కసరత్తులో కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం తరపున గ్రామ సభల ఏర్పాటు, ప్రచారం లాంటి అన్ని రకాల నిర్వహణకు సంబంధించిన మద్దతును అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఈసీకి హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement