త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nandini Sidhareddy-TAUK | తెలంగాణ సాహిత్యంలో ‘టాక్’ సేవ‌లు అభినంద‌నీయం

Nandini Sidhareddy-TAUK | తెలంగాణ సంస్కృతి, సాహిత్యాన్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌డంలో ‘టాక్’ (TAUK) విశేష కృషి చేస్తోంద‌ని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, క‌వి, ర‌చ‌యిత‌ నందిని సిధారెడ్డి ప్ర‌శంసించారు. దీంతో పాటు వివిధ సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ స్ఫూర్తిదాయ‌కంగా నిల‌వ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.

S

Telangana | Published On Aug 29, 2026, 3.38 pm IST

Nandini Sidhareddy-TAUK | తెలంగాణ సాహిత్యంలో ‘టాక్’ సేవ‌లు అభినంద‌నీయం
Advertisement
  • రాష్ట్ర సంస్కృతి, సంప్ర‌దాయాల‌పై కృషి చేయ‌డం స్ఫూర్తిదాయ‌కం
  • కేంద్ర సాహిత్య అకాడ‌మీ పుర‌స్కార గ్రహీత నందిని సిధారెడ్డి

Nandini Sidhareddy-TAUK | త్రినేత్ర‌.న్యూస్: తెలంగాణ సంస్కృతి, సాహిత్యాన్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌డంలో ‘టాక్’ (TAUK) విశేష కృషి చేస్తోంద‌ని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, క‌వి, ర‌చ‌యిత‌ నందిని సిధారెడ్డి ప్ర‌శంసించారు. దీంతో పాటు వివిధ సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ స్ఫూర్తిదాయ‌కంగా నిల‌వ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, పూర్వ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు రత్నాకర్ కడుదులతో పాటు కార్యవర్గ సభ్యుల కృషిని ఆయ‌న‌ ప్రత్యేకంగా అభినందించారు. ఈమేర‌కు శ‌నివారం హైద‌రాబాద్‌లోని నివాసంలో సిధారెడ్డిని టాక్ నేత‌లు క‌లిసి స‌న్మానించిన సంద‌ర్భంగా మాట్లాడారు.

లండన్‌లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) సంస్థ ఆవిర్భావ కార్యక్రమానికి హాజరైనప్పటి నుంచి సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను నిశితంగా గమనిస్తున్నామని సిధారెడ్డి తెలిపారు. సంస్థలను ఏర్పాటు చేయడం మాత్రమే గొప్ప విషయం కాదని, వాటిని స్థిరంగా కొనసాగిస్తూ దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా టాక్ సంస్థ తన లక్ష్యాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న తీరు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా సిధారెడ్డి తాను రచించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ‘అనిమేష’ కవితా సంపుటితో పాటు ఇతర పుస్తకాలను టాక్ సభ్యులకు బహూకరించారు. కాగా టాక్ సంస్థకు చీఫ్ అడ్వైజర్లుగా నందిని సిధారెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

అనంత‌రం తెలంగాణ ఎఫ్డీసీ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య పురస్కారం లభించడం యావత్ తెలంగాణకు గర్వకారణమన్నారు. తమకు గురువులా మార్గనిర్దేశం చేస్తూ, ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్న సిధారెడ్డికి ఇంతటి ప్రతిష్ఠాత్మక పురస్కారం రావడం తమకు మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు. టాక్ నాయకులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మా పట్ల సిధారెడ్డికి ఉన్న ప్రేమ, అభిమానం ఎప్పటికీ అలాగే కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో ఆయన మరిన్ని ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవడంతో పాటు సాహిత్య రంగానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

టాక్ కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్‌పర్సన్ గణేష్ కుప్పాల, అడ్వైజరీ బోర్డు సభ్యురాలు జాహ్నవి దూసరి మాట్లాడుతూ.. నందిని సిధారెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో కూడా టాక్ సంస్థకు ఎప్పటికప్పుడు విలువైన సలహాలు, సూచనలు అందిస్తూ సంస్థను మరింత ముందుకు నడిపించాలని కోరారు. తమకు విలువైన సమయం కేటాయించి ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అనిల్ కూర్మాచలం, టాక్ కమ్యూనిటీ అఫైర్స్ ఛైర్‌పర్సన్ గణేష్ కుప్పాల, అడ్వైజరీ బోర్డు సభ్యురాలు జాహ్నవి దూసరి, నవ్య కుప్పాల, స్థానిక నాయకులు తిరుమందాస్ నరేష్ గౌడ్, వినయ్ కుమార్ గౌడ్ బత్తిని తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement