త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kadiyam Srihari | మాజీ విద్యాశాఖ మంత్రిగా కోరుతున్నా.. జీవో 97ను ర‌ద్దు చేయండి

Kadiyam Srihari | పాలిటెక్నిక్ విద్యార్థుల్లో అనేక భ‌యాందోళ‌న‌లు ఉన్నాయ‌ని.. వెంట‌నే జీవో 97ను ర‌ద్దు చేయాల‌ని ఫిరాయింపు ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి కోరారు. మాజీ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు చెప్పారు.

S

Telangana | Published On Aug 29, 2026, 4.10 pm IST

Kadiyam Srihari | మాజీ విద్యాశాఖ మంత్రిగా కోరుతున్నా.. జీవో 97ను ర‌ద్దు చేయండి
Advertisement
  • పాలిటెక్నిక్‌ను ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌తో కలిపే ఉంచాలి
  • అలా చేస్తే ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు భ‌రోసా ఇచ్చిన‌ట్ల‌వుతుంది
  • స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Kadiyam Srihari | త్రినేత్ర‌.న్యూస్: పాలిటెక్నిక్ విద్యార్థుల్లో అనేక భ‌యాందోళ‌న‌లు ఉన్నాయ‌ని.. వెంట‌నే జీవో 97ను ర‌ద్దు చేయాల‌ని ఫిరాయింపు ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి కోరారు. మాజీ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞ‌ప్తి చేస్తున్న‌ట్లు చెప్పారు. పాలిటెక్నిక్‌ను ఇంజినీరింగ్ ఎడ్యుకేష‌న్‌తోనే కొన‌సాగించాల‌న్నారు. ప్ర‌భుత్వం చేసిన ఆలోచ‌న మంచిదేన‌ని.. కానీ విద్యార్థులు అపోహ‌ల‌కు గుర‌వుతున్న సంద‌ర్భంలో ప్ర‌భుత్వం ఆలోచించాల‌న్నారు. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో శ‌నివారం నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు.

ఒక మాజీ విద్యా శాఖ మంత్రిగా జీవో 97ను ర‌ద్దు చేయాల‌ని కోరుతున్నా. పాలిటెక్నిక్ విద్య‌ను ఇంజినీరింగ్ ఎడ్యుకేష‌న్‌తోనే ఉంచాలి. దాన్ని లేబ‌ర్ ఎంప్లాయ్‌మెంట్ కింద‌కు తీసుకురావొద్దు. విద్యార్థుల్లో లేని అపోహ‌లు ఉన్న‌య్‌. ఇంజినీరింగ్ చ‌దివేటోళ్లం లేబ‌ర్ ఎంప్లాయ్‌మెంట్ వైపు పోతామా అనేటువంటి అపోహ‌లు వాళ్ల మ‌న‌సుల‌ళ్ల‌ ఉన్న‌య్.

ప్ర‌భుత్వ ఆలోచ‌న మంచిదే. స్కిల్ యూనిర్సిటీకి దీన్ని అనుసంధానం చేసి పాలిటెక్నిక్ విద్యతోపాటే కొన్ని స్కిల్స్ కూడా నేర్పితే వెంట‌నే వాళ్ల‌కు ఉద్యోగాలు వ‌స్త‌యనే ఒక‌ ఆలోచ‌న‌ను ప్ర‌భుత్వం చేసింది. కానీ విద్యార్థులంద‌రూ కూడా లేబ‌ర్ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్లం.. రేపు చ‌దువు కంప్లిట్ అయితే ఇంజినీరింగ్ చేయాల్సినోళ్లం, వైట్ కాల‌ర్ జాబ్‌లు చేయాల్సినోళ్లం.. కిందికు పోము అనే ఒక ఆలోచ‌న‌తోని విద్యార్థులు ఉన్న‌రు.

కాబ‌ట్టి ప్ర‌త్యేకంగా ముఖ్య‌మంత్రి గారిని కోరుతున్నా. పాలిటెక్నిక్ విద్యార్థుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి ఒక క‌మిటీ కూడా వేశారు. ఆ క‌మిటీ అన్నింటిని అధ్య‌య‌నం చేస్తున్న‌ది. వారికి నేను ఒక‌టే సూచ‌న చేస్తున్నా. పాలిటెక్నిక్ విద్యార్థుల‌ను టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్‌లోనే కొన‌సాగించాలి. పాలిటెక్నిక్ పూర్త‌యిన త‌ర్వాత వాళ్ల‌కు ఇంజినీరింగ్ వెళ్ల‌డానికి లేట‌ర‌ల్‌ ఎంట్రీని ఉంచండి.

తెలంగాణ‌లో కూడా అదే ప‌ద్ధ‌తిలో ఉండాలి..

దేశ‌వ్యాప్తంగా పాలిటెక్నిక్స్ ఏ రకంగా ఉన్నాయో అవ‌న్నీ ఏఐసీటీఈ కింద ఉన్న‌య్. మ‌న రాష్ట్రంలో కూడా అదే ప‌ద్ధ‌తిలో కొన‌సాగితే బాగుంట‌ది. విద్యార్థుల భయాందోళ‌న‌ల‌ను నివృత్తి చేయాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. వాళ్ల‌కు భ‌రోసా క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం పెద్ద మ‌న‌సు చేసుకొని జీవో 97ను ర‌ద్దు చేయాల‌ని కోరుతున్నా. అలా చేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదనే భరోసాను ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుంది అని క‌డియం పేర్కొన్నారు.

Advertisement
Advertisement