త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం బ్రేక్ వేసింది. లండన్ నుంచి ఆయన నేరుగా హైదరాబాద్ రానున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణమేంటి?

G

Telangana | Published On Aug 21, 2026, 11.06 am IST

Revanth Reddy US Tour | రేవంత్ రెడ్డికి కేంద్రం షాక్.. యూఎస్ పర్యటన రద్దు

సంక్షిప్త సారాంశం

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఆయన లండన్ పర్యటన ముగించుకుని ఆగస్టు 23న తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. తన బదులుగా అమెరికా వెళ్లి హార్వర్డ్, ఎంఐటీ (MIT) తదితర సంస్థలతో ఒప్పందాలు (MoUs) చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాజకీయాల కంటే యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు.

Advertisement
  • సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం బ్రేక్
  • అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ కారణమిదే

Revanth Reddy US Tour | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. 'పొలిటికల్ యాంగిల్' (Political angle) కారణాలు చూపుతూ ఆయన అమెరికా (USA) పర్యటనకు వెళ్లకుండా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో సీఎం తన యూఎస్ టూర్‌ను రద్దు చేసుకుని లండన్ నుంచే వెనుదిరగనున్నారు.

ప్రోటోకాల్ ప్రకారం.. యూకే (UK), యూఎస్ఏ పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి కోరింది. అయితే, కేంద్రం కేవలం యూకే పర్యటనకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం నేతృత్వంలోని అధికారిక బృందం లండన్ చేరుకున్న తర్వాత.. అమెరికా పర్యటనకు అనుమతి లేదని కేంద్రం సమాచారం అందించడం గమనార్హం.

రాజకీయాల కంటే యువత భవిష్యత్తే ముఖ్యం

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. "కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం (New Education Policy) స్ఫూర్తితో.. ప్రపంచంలోని బెస్ట్ ఎడ్యుకేషన్ సంస్థలను ఇండియాకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు తీసుకురావడమే నా ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. మన యువతకు గ్లోబల్ స్థాయిలో స్కిల్స్, ట్రైనింగ్ అందించాలనేదే నా కల" అని ఆయన అన్నారు.

"దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయానికి వస్తే రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎప్పుడూ నమ్ముతాను" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వికసిత్ భారత్, 'తెలంగాణ రైజింగ్' (Telangana Rising) లక్ష్యంగా పెట్టుకున్న ఈ పర్యటనకు రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అయినప్పటికీ, కేంద్రం నిర్ణయాన్ని గౌరవిస్తూ లండన్ నుంచి బోస్టన్ వెళ్లకుండా, తిరిగి ఆగస్టు 23న హైదరాబాద్‌కు పయనమవుతున్నట్లు తెలిపారు.

అమెరికా వెళ్లాలని అధికారులకు సీఎం ఆదేశం

తాను వెళ్లకపోయినా.. అమెరికా పర్యటనను కొనసాగించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం హార్వర్డ్ (Harvard), మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), నార్త్-ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో అగ్రిమెంట్లు, ఎంఓయూలు (MoUs) కుదుర్చుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మారుస్తాం

"ఉస్మానియా, హెచ్‌సీయూ, జేఎన్టీయూ వంటి యూనివర్సిటీలు హైదరాబాద్‌ను బెస్ట్ హ్యూమన్ రిసోర్స్ హబ్‌గా మార్చాయి. ఒకే ఒక్క హైదరాబాద్ పబ్లిక్ స్కూల్.. ప్రపంచ స్థాయి టెక్ లీడర్లను ఎలా తయారు చేయవచ్చో నిరూపించింది. ఐఐటీ, ఐఎస్‌బీలు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలను ఆకర్షించాయి. ఇప్పుడు, ప్రపంచంలోనే అత్యుత్తమ ఎడ్యుకేషన్, స్కిల్స్ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మారుస్తాం" అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

లండన్‌లో బిజీ బిజీ..

లండన్ పర్యటనలో భాగంగా రాబోయే రెండు రోజుల పాటు ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ (Oxbridge), లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE), లండన్ బిజినెస్ స్కూల్ (LBS) తదితర టాప్ యూనివర్సిటీల ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. అలాగే, బ్రిటన్‌లోని టాప్ స్పోర్ట్స్ సంస్థలతోనూ తెలంగాణ కోసం భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

"చాలా మంది నాయకులు తమ పిల్లలను చదువుల కోసం విదేశాలకు పంపాలనుకుంటారు. కానీ, నేను ప్రపంచంలోని బెస్ట్ ఎడ్యుకేషన్‌ను మన ఇండియాకే తీసుకురావాలనుకుంటున్నాను. సామాన్య భారతీయుడు కూడా హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ స్థాయి ఎడ్యుకేషన్ పొందాలన్నదే నా లక్ష్యం" అని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు.

Advertisement
Advertisement