త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | రేవంత్ జీ మేరే సే హీ జోడో.. సీఎంకు ప్ర‌ధాని మోదీ పిలుపు

PM Modi | రేవంత్ జీ మేరే సే హీ జోడో అంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి రాజ‌కీయాలు మాట్లాడ‌ను అని అన్నారు.. నేను కూడా రాజకీయాలు మాట్లాడ‌బోను అంటూనే మోదీ సున్నితంగా చ‌మ‌త్కారాలు విసిరారు.

S

Telangana | Published On May 10, 2026, 5.33 pm IST

PM Modi | రేవంత్ జీ మేరే సే హీ జోడో.. సీఎంకు ప్ర‌ధాని మోదీ పిలుపు
Advertisement

గుజ‌రాత్‌కు ఇచ్చినంత మీకు ఇస్తే..
తెలంగాణ‌కు సగం కూడా నిధులు రావు
రాష్ట్రాభివృద్ధికి మాతో క‌లిసి రండి..
రేవంత్‌కు మోదీ పిలుపు
అభివృద్ధిపై సున్నిత చ‌మ‌త్క‌రాలు
రేవంత్, బండి సంజ‌య్, కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి న‌వ్వులు
హెచ్ఐసీసీ వేదిక‌గా.. రూ. 9,400 కోట్ల ప‌నుల‌కు
ప్ర‌ధాని ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : రేవంత్ జీ మేరే సే హీ జోడో అంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డి రాజ‌కీయాలు మాట్లాడ‌ను అని అన్నారు.. నేను కూడా రాజకీయాలు మాట్లాడ‌బోను అంటూనే మోదీ సున్నితంగా చ‌మ‌త్కారాలు విసిరారు. గుజ‌రాత్‌కు చేసిన కేటాయింపుల కంటే రెట్టింపు తెలంగాణ‌కు ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాం.. అందుకే మాతోనే క‌లిసి రండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

 

గుజ‌రాత్‌కు నాడు ప్ర‌ధానిగా మ‌న్మోహ‌న్ సింగ్ స‌హ‌క‌రించిన‌ట్టే ఇప్పుడు మోదీ తెలంగాణ‌కు స‌హ‌క‌రించాల‌ని రేవంత్ కోరారు. గుజ‌రాత్‌కు ఆ రోజు ఎంత ఇచ్చారో ఇప్పుడు తెలంగాణ‌కు అంత ఇస్తే.. మేం ఇవ్వాల‌నుకున్న దానిలో స‌గ‌మే వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మోదీ చ‌మ‌త్క‌రించారు. దాంతో అభివృద్ధిలో మీరు ఎక్క‌డికి చేరాల‌నుకుంటున్నారో అక్క‌డికి చేర‌లేరు.. ఆ రోజు గుజ‌రాత్‌కు చేసిన కేటాయింపుల‌కు రెట్టింపు తెలంగాణ‌కు ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు ప్ర‌ధాని తెలిపారు. అందుకే మాతో క‌లిసి రండి అంటూ రేవంత్ రెడ్డికి న‌వ్వుతూనే మోదీ స‌ల‌హా ఇచ్చారు. దీంతో రేవంత్ కూడా మోదీకి అభివాదం చేస్తూ న‌వ్వుకున్నారు. రేవంత్ ప‌క్క‌నే కూర్చున్న బండి సంజ‌య్, కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి కూడా న‌వ్వుకున్నారు.

సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని హెచ్ఐసీసీ వేదిక‌గా రూ. 9,400 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు మోదీ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేసిన సంద‌ర్భంగా మోదీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్, రాష్ట్ర మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి పాల్గొన్నారు.

దేశాభివృద్ధిలో సైబ‌రాబాద్ కీల‌క‌పాత్ర‌

సైబరాబాద్‌ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. అనేక పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ ప్రాణం పోసుకుంటున్నాయి. సైబరాబాద్‌ అతి పెద్ద ఉపాధి కేంద్రంగా మారింది. సైబర్‌ టెక్నాలజీ, విద్యుత్‌, ఈవీ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. వరంగల్‌ పీఎం మిత్ర టెక్స్‌టైల్‌ పార్కును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. టెక్స్‌టైల్‌ రంగంలో వరంగల్‌ పీఎం మిత్ర పార్కు కీలక పాత్ర పోషించనుంది. వరంగల్‌ పీఎం మిత్ర పార్క్‌తో ఉద్యోగావకాశాలు భారీగా వస్తాయి. హైవేలపై కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. హైవేల అభివృద్ధి ద్వారా తెలంగాణ కూడా లాభపడుతోంది అని మోదీ తెలిపారు.

6 అమృత్ భార‌త్.. 5 వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌లు..

ఇప్ప‌టికే తెలంగాణ‌కు 6 అమృత్ భార‌త్ ఎక్స్‌ప్రెస్‌లు, 5 వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌లు ఇచ్చాం. ఉమ్మడి ఏపీకి రైల్వే బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కూడా దక్కేవి కావు. ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.ఐదున్నర వేల కోట్లు కేటాయించాం. సీఎం రేవంత్‌రెడ్డి గారూ ఇది వింటున్నారా?. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భరోసా ఇస్తుంది. తెలంగాణ వికసిస్తే దేశం కూడా వికసిస్తుంది అని ప్ర‌ధాని మోదీ పేర్కొంటూ త‌న ప్రసంగాన్ని ముగించారు.

Advertisement
Advertisement