త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Imran Khan | ఎట్ట‌కేల‌కు జైలు నుంచి ద‌వాఖాన‌కు పాక్‌ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌..

Imran Khan | అవినీతి కేసుల్లో గ‌త మూడేండ్లుగా జైలులో మ‌గ్గుతున్న పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను ఎట్ట‌కేల‌కు ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై గ‌త కొంత‌కాలంగా వ‌దంతులు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

G

International | Published On Aug 21, 2026, 7.26 am IST

Imran Khan | ఎట్ట‌కేల‌కు జైలు నుంచి ద‌వాఖాన‌కు పాక్‌ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌..
Advertisement

Imran Khan | త్రినేత్ర‌.న్యూస్‌: అవినీతి కేసుల్లో గ‌త మూడేండ్లుగా జైలులో మ‌గ్గుతున్న పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను ఎట్ట‌కేల‌కు ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై గ‌త కొంత‌కాలంగా వ‌దంతులు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పాక్ సుప్రీంకోర్టు (Supreme Court) గ‌త మంగ‌ళ‌వారం ఇమ్రాన్‌ను మెరుగైన వైద్యం కోసం 48 గంట‌ల్లోగా ప్రైవేటు ద‌వాఖాన‌కు త‌ర‌లించాల‌ని తీర్పునిచ్చింది. దీంతో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున‌ అడియాలా జైలు (Adiala Jail) అధికారులు ఆయ‌న‌ను ఇస్లామాబాద్‌లోని 'షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్' కు (Shifa International Hospital) త‌ర‌లించారు. ఈమేర‌కు పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (PTI) పార్టీ వెల్ల‌డించింది. కోర్టు తీర్పు మేర‌కు ఆయన సెప్టెంబర్ 16 వరకు అక్కడే ఉంటారు. ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించేందుకు ఒక మెడికల్ బోర్డును (Medical Board) కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఆయన వ్యక్తిగత వైద్యుడితో పాటు సోదరి డాక్టర్ అలీమా ఖాన్ కూడా సభ్యులుగా ఉంటారు.

కాగా, ఇమ్రాన్ ఖాన్ జైలులోనే మృతిచెందారంటూ ఆ దేశానికి చెందిన ఓ జ‌ర్న‌లిస్టు వ్యాఖ్యానించారు. దీంతో దేశ‌వ్యాప్తంగా పీటీఐ పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేప‌ట్టింది. ఈ నేప‌థ్యంలోజైలు అధికారులు ఇక‌పై వారానికి ఒక‌సారి కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసేందుకు, కుమారుల‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని సుప్రీంకోర్టు ఇటీవ‌ల ఆదేశాలు జారీచేసింది.

ఇమ్రాన్ హెల్త్ రిపోర్ట్ ఏం చెబుతోంది?

కోర్టుకు సమర్పించిన మెడికల్ రికార్డులు (Medical records) మాత్రం ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బీపీ (BP) హెచ్చుతగ్గులు, గుండె దడ, తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇమ్రాన్ తాజా బ్లడ్ ప్రెషర్ 140/80 గా, పల్స్ రేట్ 54 bpm గా నమోదైంది. గత ఫిబ్రవరిలో ఆయన బీపీ 120/80 (నార్మల్) గా ఉండేదని రికార్డుల్లో ఉంది.

'డెత్ సెల్'లో..

గత ఎనిమిది నెలలుగా ఇమ్రాన్‌ను జైలులో ఒంటరిగా ఉంచారని, కనీసం కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వలేదని పీటీఐ ఆరోపిస్తోంది. తీవ్ర నిరసనల తర్వాత గత ఏడాది డిసెంబర్ 2న ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ జైలులో కలిశారు. ఇమ్రాన్‌ను దారుణమైన పరిస్థితుల్లో ఉంచారని, అది 'మానసిక హింస' (Mental torture) అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రస్తుత దుస్థితికి పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కారణమని ఇమ్రాన్ భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

అంతేకాకుండా.. మురుగునీరు వల్ల, హెపటైటిస్‌తో చనిపోతున్న ఖైదీల మధ్య తమ తండ్రిని ఒక 'డెత్ సెల్' లో (Death cell) బంధించారని ఆయన కుమారులు కాసిం, సులైమాన్ గతంలో ఆరోపించారు.

ఎందుకు అరెస్టయ్యారు?

ఇమ్రాన్ జైలుకెళ్లి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రావల్పిండి, లాహోర్, మియాన్‌వాలీ వంటి నగరాల్లో పీటీఐ కార్యకర్తలు భారీ ఆందోళనలు చేపట్టారు. రావల్పిండిలో ఈ నిరసనలు ఉద్రిక్తంగా మారి భద్రతా బలగాలతో ఘర్షణకు దారితీశాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ (Amnesty International) వంటి మానవ హక్కుల సంస్థలు సైతం ఇమ్రాన్‌కు కుటుంబ సభ్యులను, లాయర్లను, వైద్యులను కలిసే అవకాశం కల్పించాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కోరాయి.

2018లో ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్.. నాలుగేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయారు. ఆ తర్వాత 2023 ఆగస్టు 5న తోషఖానా (Toshakhana - ప్రభుత్వ బహుమతుల విక్రయం) తదితర అవినీతి కేసుల్లో ఆయనను అరెస్టు చేశారు. 2024 ఎన్నికల్లో పీటీఐ పార్టీ పోటీ చేయకుండా తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంది. తాజా సుప్రీం తీర్పుతో.. తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 16 వరకు ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలోనే ఉండనున్నారు. మూడేండ్ల‌ జైలు జీవితం తర్వాత ఇమ్రాన్ ఖాన్ భౌతికంగా జైలు బయట గడపనున్న అత్యంత సుదీర్ఘ కాలం ఇదే కావడం గమనార్హం. దీని ద్వారా ఆయన వాస్తవ ఆరోగ్య పరిస్థితి పాకిస్తాన్‌కు, ప్రపంచానికి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.

Advertisement
Advertisement