త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyber Frauds | వృద్ధులే సైబర్‌ కేటుగాళ్ల టార్గెట్‌!

Cyber Frauds | వృద్ధాప్యంలో ద‌న్నుగా ఉంటుంద‌ని జీవిత‌కాలం చేసిన పొదుపు చేస్తూ కూడ‌బెట్టిన సొత్తును కేటుగాళ్లు గ‌ద్ద‌ల్లా త‌న్నుకుపోతున్నారు. మీరు ఈ నేరానికి పాల్ప‌డ్డారంటూ బెదిరింపుల‌కు దిగుతూ.. లేకుంటే అధిక లాభాలు వ‌స్తాయని ఎర‌వేస్తూ మాయ‌మాట‌లు చెప్పి సీనియర్‌ సిటిజన్ల ఖాతాలను లూటీ చేస్తున్నారు.

P

Telangana | Published On Aug 9, 2026, 5.03 pm IST

Cyber Frauds | వృద్ధులే సైబర్‌ కేటుగాళ్ల టార్గెట్‌!
Advertisement
  • 19 నెలల్లో రూ.102 కోట్లు స్వాహా..
  • ట్రేడింగ్‌, డిజిటల్‌ అరెస్టుల పేరుతో భారీ మోసాలు
  • అప్రమత్తతే రక్షణ అంటున్న పోలీసులు
  • 1930 నంబ‌ర్‌లో ఫిర్యాదు చేయాల‌ని సూచ‌న‌
  • హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌ర్ వీసీ స‌జ్జ‌నార్‌

Cyber Frauds | వృద్ధాప్యంలో ద‌న్నుగా ఉంటుంద‌ని జీవిత‌కాలం చేసిన పొదుపు చేస్తూ కూడ‌బెట్టిన సొత్తును కేటుగాళ్లు గ‌ద్ద‌ల్లా త‌న్నుకుపోతున్నారు. మీరు ఈ నేరానికి పాల్ప‌డ్డారంటూ బెదిరింపుల‌కు దిగుతూ.. లేకుంటే అధిక లాభాలు వ‌స్తాయని ఎర‌వేస్తూ మాయ‌మాట‌లు చెప్పి సీనియర్‌ సిటిజన్ల ఖాతాలను లూటీ చేస్తున్నారు. హైదరాబాద్‌లో గత 19 నెలల్లో 60 ఏళ్లు పైబడిన వారిపై నమోదైన 403 సైబర్‌ నేరాల్లో బాధితులు కోల్పోయిన మొత్తం ఏకంగా రూ.102.02 కోట్లు. ఒక్కో కేసులో లక్షల నుంచి కోట్ల వరకు సొమ్ము పోగొట్టుకుంటున్న వృద్ధుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరిట‌..

జూబ్లీహిల్స్‌కు చెందిన 75 ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగికి వాట్సాప్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం పేరిట పరిచయం ఏర్పరచుకున్న కేటుగాళ్లు.. తొలుత చిన్నచిన్న టాస్కులు ఇచ్చి డబ్బులు చెల్లించారు. ఆ తర్వాత టెలిగ్రామ్‌ గ్రూపులో చేర్చి ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించారు. నకిలీ లాభాలను తెరపై చూపిస్తూ విత్‌డ్రా, ప్రాసెసింగ్‌ ఛార్జీల పేరుతో విడతలవారీగా రూ.96 లక్షలు కాజేశారు. మరో ఘటనలో 70 ఏళ్ల విశ్రాంత గెజిటెడ్‌ అధికారి పోలీసుల పేరుతో జరిగిన మోసానికి బలయ్యారు. ముంబ‌యి పోలీసు అధికారి అనూప్‌కుమార్‌ శర్మగా పరిచయం చేసుకున్న వ్యక్తి.. తనపై మనీలాండరింగ్‌ కేసు నమోదైందని, అరెస్టు చేస్తామని బెదిరించాడు. నకిలీ పత్రాలతో భయపెట్టి బ్యాంకు ఖాతాల తనిఖీ పేరిట ఒకే ఆర్టీజీఎస్‌ లావాదేవీలో రూ.85 లక్షలు బదిలీ చేయించుకున్నాడు.

ట్రేడింగ్‌ మోసాలే పెద్ద దెబ్బ

వృద్ధులను దెబ్బతీస్తున్న మోసాల్లో ట్రేడింగ్‌ ఫ్రాడ్ ఎక్కువ‌గా ఉన్నాయి. 19 నెలల్లో నమోదైన 113 కేసుల్లో రూ.55.88 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. షేర్‌ మార్కెట్‌, ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయంటూ నకిలీ యాప్‌లు, వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపులతో వల వేస్తున్నారు. డిజిటల్‌ అరెస్టుల పేరుతో 69 కేసుల్లో రూ.31.93 కోట్లు పోయాయి. సీబీఐ, ఈడీ, పోలీసులు, నార్కోటిక్స్‌, కస్టమ్స్‌ అధికారులమంటూ వీడియో కాల్స్‌ చేసి బెదిరిస్తున్నారు. ఓటీపీ మోసాల్లో 115 కేసులు నమోదై రూ.4.94 కోట్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌లో 22 కేసులకు సంబంధించి రూ.2.79 కోట్లు నష్టపోయారు. వృద్ధుల ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని డేటింగ్‌ ఫ్రాడ్స్‌, హనీట్రాప్స్‌కూ పాల్పడుతున్నారు. గత 19 నెలల్లో నమోదైన ఏడు కేసుల్లో రూ.70.11 లక్షలకు పైగా మోసం జరిగింది. సోషల్‌ మీడియా, డేటింగ్‌ యాప్‌లలో పరిచయం పెంచుకుని.. అత్యవసర ఖర్చులు, గిఫ్ట్‌ల కస్టమ్స్‌ డ్యూటీ పేరుతో డబ్బులు దండుకుంటున్నారు.

తగ్గుతున్న కేసులు.. అప్రమత్తత పెంచాలి

పోలీసుల అవగాహన కార్యక్రమాలతో వృద్ధులపై నమోదవుతున్న సైబర్‌ నేరాలు కొంతమేర తగ్గాయి. 2025లో 285 కేసుల్లో రూ.71.81 కోట్ల నష్టం జరగగా.. 2026 జనవరి నుంచి జులై 31 వరకు 118 కేసులు నమోదై రూ.30.20 కోట్ల నష్టం వాటిల్లింది. నెలకు సగటు కేసుల సంఖ్య 24 నుంచి 17కు తగ్గింది. ఫిర్యాదు అందిన వెంటనే బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయడం, నగదు రికవరీకి చర్యలు తీసుకోవడం కూడా నష్టాన్ని తగ్గించడంలో కీలకంగా మారింది. అయితే, కుటుంబ సభ్యుల పర్యవేక్షణ లోపం కూడా వృద్ధులను మోసగాళ్లకు సులభమైన లక్ష్యంగా మారుస్తోందని దర్యాప్తులో తేలింది. తల్లిదండ్రులు ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు? ఎవరితో బ్యాంకు లావాదేవీలు జరుపుతున్నారు? అనుమానాస్పదంగా లేదా భయాందోళనలో ఎందుకు ఉన్నారు? అనే విషయాలను పిల్లలు ఎప్పటికప్పుడు గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు.

బ్యాంకర్ల అప్రమత్తతతో అడ్డుకట్ట

వృద్ధులు అకస్మాత్తుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రద్దు చేయడం, అపరిచిత ఖాతాలకు పెద్ద మొత్తాల్లో ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌ చేయడం వంటి సందర్భాల్లో బ్యాంకు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. లావాదేవీ ఉద్దేశాన్ని తెలుసుకుని కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించడం ద్వారా పలు మోసాలను అడ్డుకున్న ఘటనలు ఉన్నాయి. సీనియర్‌ సిటిజన్లు పెద్ద మొత్తాల లావాదేవీలకు పరిమితులు విధించుకోవడం, అనుమానాస్పద లావాదేవీలపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం మంచి పరిణామమని పోలీసులు చెబుతున్నారు.

డిజిటల్‌ అరెస్ట్‌ అనేది లేదు..

దేశ చట్టాల్లో ‘డిజిటల్‌ అరెస్ట్‌’ అనే విధానమే లేదని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనర్‌ స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వ దర్యాప్తు సంస్థా ఫోన్‌ లేదా వీడియో కాల్‌ ద్వారా బెదిరించి డబ్బులు అడగదని తెలిపారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌లో వచ్చే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, అధిక లాభాల ట్రేడింగ్‌ ఆఫర్లను నమ్మవద్దని సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంస్థ సెబీ వద్ద నమోదైందో లేదో పరిశీలించాలని, విత్‌డ్రా పేరుతో అదనపు పన్నులు, రుసుములు చెల్లించవద్దని హెచ్చరించారు. బ్యాంకు వివరాలు, ఓటీపీ, ఆధార్‌, పాన్‌ వివరాలను ఎవరికీ చెప్పొద్దన్నారు. అనుమానాస్ప‌ద కాల్స్, బెదిరింపులు వ‌చ్చినా భ‌య‌ప‌డ‌కుండా వెంట‌నే 1930 నేష‌న‌ల్ సైబర్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని, cybercrime.gov.in, cybercrime.gov.in/?utm_source=chatgpt.com)లోనూ ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే ‘గోల్డెన్‌ అవర్‌’లో నగదును ఫ్రీజ్‌ చేసి తిరిగి రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సీపీ వివ‌రించారు.

Advertisement
Advertisement