త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Har Ghar Tiranga | హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనండి.. దేశ‌ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ పిలుపు

Har Ghar Tiranga | దేశ ప్రజలంతా హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని, వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలన్న సంకల్పాన్ని మరోసారి చాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశ గర్వానికి ప్రతీక మాత్రమే కాకుండా.. దేశం కోసం అత్యుత్తమంగా పనిచేయాలనే స్ఫూర్తిని నిరంతరం అందిస్తుందని పేర్కొన్నారు.

P

National | Published On Aug 9, 2026, 6.42 pm IST

Har Ghar Tiranga | హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనండి.. దేశ‌ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ పిలుపు
Advertisement

Har Ghar Tiranga | దేశ ప్రజలంతా హర్‌ ఘర్‌ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని, వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలన్న సంకల్పాన్ని మరోసారి చాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశ గర్వానికి ప్రతీక మాత్రమే కాకుండా.. దేశం కోసం అత్యుత్తమంగా పనిచేయాలనే స్ఫూర్తిని నిరంతరం అందిస్తుందని పేర్కొన్నారు. సంస్కృతి మంత్రిత్వ శాఖ ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టును మోదీ ఆదివారం రీ పోస్ట్ చేస్తూ స్పందించారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా భాగస్వాములు కావాలని కోరారు. దేశ నిర్మాణంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించేందుకు సమష్టిగా మరోసారి సంకల్పం తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని ‘వందే మాతరం’కు అంకితం చేయడం ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం జరుగుతున్న సందర్భంలో ఈ కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడిందన్నారు.

దేశవ్యాప్తంగా కార్యక్రమాలు..

హర్‌ ఘర్‌ తిరంగా ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు, తిరంగా ర్యాలీలు, తిరంగా కచేరీలు నిర్వహించనున్నట్లు సంస్కృతి మంత్రిత్వ శాఖ తెలిపింది. వందే మాతరం సామూహిక గానంతో దేశభక్తి భావనను ప్రజల్లో మరింతగా చాటేలా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ గీతాన్ని ప్రత్యేకంగా స్మరించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా వీధులు, ఇళ్లు దేశభక్తి స్ఫూర్తితో నిండేలా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపింది.

సూర్యపథ్‌ తిరంగా..

ఈ ఏడాది వేడుకల్లో ‘సూర్యపథ్‌ తిరంగా’ కీలక కార్యక్రమంగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను త్రివర్ణ పతాకం కింద ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి, హర్‌ ఘర్‌ తిరంగా వెబ్‌సైట్‌లో సెల్ఫీలను అప్‌లోడ్‌ చేయాలని సంస్కృతి మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే కార్యక్రమంగా హర్‌ ఘర్‌ తిరంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈసారి త్రివర్ణ పతాక ప్రదర్శనతో పాటు వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని కలిపి నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా దేశభక్తి స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడం, ప్రజల సమష్టి భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ‌మ‌ని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Advertisement
Advertisement