త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLC Dasoju Sravan | గురుకులాల కిరాణా టెండ‌ర్ల‌లో రూ. 500 కోట్ల కుంభ‌కోణం..!

MLC Dasoju Sravan | రాష్ట్రంలోని గురుకులాల కిరాణా టెండ‌ర్ల‌లో రూ. 500 కోట్ల భారీ కుంభ‌కోణానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర చేసిన‌ట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ తుగ్ల‌క్ నిర్ణ‌యంపై ఆయ‌న నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On May 23, 2026, 6.44 pm IST

MLC Dasoju Sravan | గురుకులాల కిరాణా టెండ‌ర్ల‌లో రూ. 500 కోట్ల కుంభ‌కోణం..!
Advertisement

MLC Dasoju Sravan | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని గురుకులాల కిరాణా టెండ‌ర్ల‌లో రూ. 500 కోట్ల భారీ కుంభ‌కోణానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర చేసిన‌ట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ తుగ్ల‌క్ నిర్ణ‌యంపై ఆయ‌న నిప్పులు చెరిగారు. రూ. 100 కోట్ల కేంద్రీకృత క‌మీష‌న్ల కోస‌మే జిల్లా క‌లెక్ట‌ర్ల అధికారాల‌కు క‌త్తెర విధించారు. తెలంగాణ బ్రాండ్ తాండూరు కందిప‌ప్పుకు మంగ‌ళం పాడి, గురుకుల విద్యార్థుల‌కు ఆఫ్రికా వ్య‌ర్థాల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారని మండిప‌డ్డారు. రూ. 165 కోట్ల అడ్డ‌గోలు ట‌ర్నోవ‌ర్ నిబంధ‌న‌ల‌తో స్థానిక చిన్న‌వ్యాపారులు, మ‌హిళా సంఘాల గొంతు నొక్క‌డ‌మే అని దుయ్య‌బ‌ట్టారు. పేద విద్యార్థుల కడుపు కొడుతున్న ప్రభుత్వ పెద్దలు, అధికారులకు రాబోయే కేసీఆర్ ప్రభుత్వంలో ‘న్యాయ విచారణ’ తప్పదు అని దాసోజు శ్ర‌వ‌ణ్ హెచ్చ‌రించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దాసోజు శ్ర‌వ‌ణ్‌ సుదీర్ఘ బహిరంగ లేఖ రాశారు.

బ‌హిరంగ లేఖ సారాంశం ఇదే..

ఐఏఎస్ అధికారుల సామర్థ్యంపై నమ్మకం లేదా?

వందల కోట్ల బడ్జెట్‌తో కూడిన భూసేకరణలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ప్రజా పంపిణీ వ్యవస్థ, అత్యంత క్లిష్టమైన ఎన్నికలను విజయవంతంగా నిర్వహించగల జిల్లా కలెక్టర్లకు.. తమ జిల్లాలోని హాస్టళ్లకు నాణ్యమైన పప్పు, నూనె కొనే సామర్థ్యం లేదా? అని డాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. కలెక్టర్లకు సామర్థ్యం లేక కాదు, జిల్లా స్థాయిలో టెండర్లు జరిగితే హైదరాబాద్‌లోని ప్రభుత్వ పెద్దలకు వందల కోట్ల ‘కిక్‌బ్యాక్స్’ దక్కవు అనే ఏకైక కారణంతోనే కలెక్టర్ల నేతృత్వంలోని DPC వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

తాండూరు కందిపప్పుకు అన్యాయం – ఆఫ్రికా ఫుడ్ మాఫియాతో కుమ్మక్కు:

అంతర్జాతీయంగా భౌగోళిక గుర్తింపు (GI Tag) పొంది, అత్యంత పోషక విలువలున్న మన తెలంగాణ సొంత బ్రాండ్ తాండూరు కందిపప్పును మన గురుకుల విద్యార్థులకు దూరం చేయాలని చూస్తున్నారు. కార్పొరేట్ కాంట్రాక్టర్ల స్వలాభం కోసం అంతర్జాతీయ మార్కెట్ నుండి అత్యంత చౌకగా లభించే, పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉండే నాసిరకం ఆఫ్రికా దేశాల (మలావి, మొజాంబిక్) నిల్వ పప్పులను తెచ్చి పేద విద్యార్థుల పొట్టకొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని దుయ్యబట్టారు.

మూడు నెలల 'తాజా' విధానానికి ఎందుకు మంగళం పాడారు?

తెలంగాణ స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ (TSFC) నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి (Quarterly) టెండర్లు పిలిస్తే విద్యార్థులకు తాజా సరుకులు అందుతాయి, మార్కెట్ ధరలు తగ్గినప్పుడు ఖజానాకు లాభం చేకూరుతుంది. కానీ నిత్యం ధరలు మారే కిరాణా మార్కెట్‌లో ఏకంగా ఏడాది కాలపరిమితితో టెండర్లు ఫిక్స్ చేయడం వెనుక.. ఒకే విడతలో వందల కోట్ల రూపాయల కమీషన్లను ‘అడ్వాన్స్’గా దండుకోవాలనే దురాశ స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

మార్క్‌ఫెడ్ (MARKFED), మహిళా సంఘాలను (SHGs) ఎందుకు పక్కనబెట్టారు?

ఒకవేళ కేంద్రీకృత విధానమే మేలైతే, రూ. 165 కోట్ల అడ్డగోలు టర్నోవర్ నిబంధనలతో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఎందుకు దోచిపెడుతున్నారు? ప్రభుత్వ రంగ సంస్థ అయిన MARKFED ద్వారా మన రైతుల నుండి మద్దతు ధర (MSP) ఇచ్చి నేరుగా సరుకులు సేకరించి, జిల్లాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) ద్వారా సరఫరా చేయవచ్చు కదా అని ప్రొఫెసర్ శ్రవణ్ సూచించారు. దీనివల్ల రైతులకు, మహిళలకు లబ్ధి చేకూరడమే కాకుండా కమీషన్ల లూటీ ఆగిపోయి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతుందన్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (PMU) ద్వారా జరిగిన బంకర్ బెడ్లు, విద్యార్థుల యూనిఫారాల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. అయినా సరే మళ్లీ అదే వివాదాస్పద PMU చేతుల్లోకి కిరాణా సరఫరాను నెట్టడం వెనుక ఉన్న అంతర్గత మర్మమేమిటో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తీవ్ర హెచ్చరిక:

"పేద విద్యార్థుల నోటి కూడును కొల్లగొడుతూ, రూ. 100 కోట్ల కమీషన్ల కోసం ఈ విచ్చలవిడి అవినీతికి తెరలేపిన ప్రభుత్వ పెద్దలు, వారికి స్వార్థంతో వత్తాసు పలుకుతున్న సంబంధిత ఉన్నత అధికారులు అందరూ రాబోయే కేసీఆర్ ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయ విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. చట్ట ఉల్లంఘనలకు పాల్పడి, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అని ఎమ్మెల్సీ డాసోజు శ్రవణ్ తీవ్రంగా హెచ్చరించారు. తక్షణమే ఈ వివాదాస్పద కేంద్రీకృత కిరాణా టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే జిల్లా స్థాయి కమిటీల (DPC) ద్వారా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement