త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chirumarthy Lingaiah | కాంగ్రెస్‌ను డస్ట్ బిన్‌లో వేసేందుకు ప్రజలు రెడీగా ఉన్నరు

తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ నేతలు చిరుమర్తి లింగయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్.. హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లపై విమర్శలను తిప్పికొట్టారు.

J

Telangana | Published On Aug 5, 2026, 6.25 pm IST

Chirumarthy Lingaiah | కాంగ్రెస్‌ను డస్ట్ బిన్‌లో వేసేందుకు ప్రజలు రెడీగా ఉన్నరు

సంక్షిప్త సారాంశం

కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే క్షుద్ర పూజల పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, హరీష్ రావు ప్రజాదరణను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, సంపత్ కుమార్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో గ్రామర్ లేదు, గ్లామర్ లేదు అని, మూఢనమ్మకాల పేరుతో కాంగ్రెస్ కాలక్షేపం చేస్తోందని ఎర్రోళ్ల శ్రీనివాస్ దుయ్యబట్టారు. నల్గొండ జిల్లాలో సాగు, తాగునీరు లేక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.

Advertisement
  • ప్రవీణ్ కుమార్, హరీష్ రావులపై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఫైర్

Chirumarthy Lingaiah | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని, పాలనా వైఫల్యాలను ఎండగడుతున్నారనే కక్షతోనే బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లపై కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

'హరీష్ రావు పేరు వింటేనే కాంగ్రెస్‌కు భయం'

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే హరీష్ రావు ప్రజాదరణను చూసి కాంగ్రెస్ నేతలకు నిద్రపట్టడం లేదని చిరుమర్తి లింగయ్య ఎద్దేవా చేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఏ పదవి ఇచ్చినా దానికి వన్నె తెచ్చిన నాయకుడు హరీష్ రావు అని కొనియాడారు.

"తమిళనాడు సీఎం విజయ్ గుడికి వెళ్తే లేని క్షుద్రపూజల గోల.. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? అలా అయితే పూజలు చేసి రాహుల్ గాంధీని ప్రధాని చేయొచ్చు కదా? నల్గొండ జిల్లాలో తాగునీరు లేక, పంటలు ఎండిపోతుంటే పట్టించుకోకుండా క్షుద్రపూజల పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో గొడవలు రేపుతున్నారు." అని చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు.

BRS Leaders Chirumarthy Lingaiah and Errolla Srinivas Fire on Congress Leaders

మాజీ ఐపీఎస్ అధికారిగా, బహుజన బిడ్డగా వేలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను విమర్శించే స్థాయి సంపత్ కుమార్‌కు లేదని, రేవంత్ రెడ్డి స్వయంగా దగ్గరుండి సంపత్‌ను ఓడించారని ఆయన ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి పాలనలో గ్లామర్ లేదు.. ఆయన భాషలో గ్రామర్ లేదు

కాంగ్రెస్ నాయకుల మైండ్ దొబ్బిందని, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. బీఆర్ఎస్ స్ట్రెయిట్ ఫైట్ చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం స్ట్రీట్ ఫైట్ చేస్తోందన్నారు.

దళిత నేతల మౌనం: గురుకులాల్లో జరుగుతున్న అవినీతి, ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్ అమలపై కాంగ్రెస్‌లోని దళిత ఎమ్మెల్యేలు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు.

పక్షపాతం: అధికారులపై ఏసీబీ దాడుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అధికారులు దొరికితే జైలుకు పంపిస్తూ.. అగ్రకుల అధికారులను వదిలేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబుపై మౌనం: చంద్రబాబు నాయుడు గోదావరి నీళ్లను తరలించుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని నేతలే ఇప్పుడు కాంగ్రెస్‌లో ఎక్కువ గొంతు చించుకుంటున్నారని, నోరు అదుపులో పెట్టుకుని పాలన సాగించకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రాంబల్ నాయక్, తుంగబాలు, శరత్, యాదయ్య గౌడ్, నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement