త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vinayak Damodar Savarkar |ఆవు కూడా..గుర్రం, కుక్క‌, గాడిద‌ వంటిదే: సావర్కర్

Vinayak Damodar Savarkar | త్రినేత్ర‌.న్యూస్ : వినాయ‌క దామోద‌ర్ సావ‌ర్క‌ర్ (Vinayak Damodar Savarkar) ఆవు (Cow)ను కేవ‌లం జంతువుగానే చూశార‌ని ఆయ‌న మునిమ‌న‌వ‌డు స‌త్య‌కి సావ‌ర్క‌ర్ (Satyaki Savarkar) తెలిపారు.

D

National | Published On Aug 5, 2026, 5.46 pm IST

Vinayak Damodar Savarkar |ఆవు కూడా..గుర్రం, కుక్క‌, గాడిద‌ వంటిదే: సావర్కర్
Advertisement
  • సావర్కర్ ఆవును కేవ‌లం జంతువుగానే చూశారు..
  • గోపూజ అశాస్త్రీయం
  • ఆవులు కూడా గుర్రాలు, కుక్క‌లు, గాడిద‌ల్లాంటివే
  • ఆవును ఉపయోగకరమైన జంతువుగానే చూడండి

Vinayak Damodar Savarkar | త్రినేత్ర‌.న్యూస్ : వినాయ‌క దామోద‌ర్ సావ‌ర్క‌ర్ (Vinayak Damodar Savarkar) ఆవు (Cow)ను కేవ‌లం జంతువుగానే చూశార‌ని ఆయ‌న మునిమ‌న‌వ‌డు స‌త్య‌కి సావ‌ర్క‌ర్ (Satyaki Savarkar) తెలిపారు. గోవును దైవంగా పూజించ‌డాన్ని ఎప్పుడూ స‌మ‌ర్థించ‌లేద‌ని చెప్పారు. ఈ మేర‌కు ప్ర‌తిప‌క్ష నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై జరుగుతున్న క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి పూణెలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టుకు స‌త్య‌కి కీలక వాంగ్మూలం అందించారు.

ఈ వాంగ్మూలంలో కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. ముఖ్యంగా త‌న తాత సావ‌ర్క‌ర్ రాసిన 'విజ్ఞాన-నిష్ఠ నిబంధ్' పుస్తకాన్ని కోర్టు ముందు ఉంచారు. ఈ పుస్త‌కాన్ని సావ‌ర్క‌రే స్వ‌యంగా రాశార‌ని స‌త్య‌కి అంగీక‌రించారు. ఆవును దేవతగా 'పూజించే' భావనను సావర్కర్ విమర్శించారని చెప్పారు. త‌న తాత ఆవును ఆర్థికంగా, సామాజికంగా ఉప‌యోగ‌ప‌డే జంతువుగానే చూశార‌ని.. గోమాతగా పూజించే ఆచారాన్ని విమర్శించినట్లు తెలిపారు.

ఆవులు దేవ‌త‌లు కాదు..

"ఆవులు దేవతలు కాదు. అవి ఉపయోగకరమైన జంతువులు. ఆవు సమాజానికి ఎంతో ప్రయోజనకరమైనది. కాబ‌ట్టి దానిని ర‌క్షించాలి. అంతేకానీ, పూజించ‌కూడ‌దు. గుర్రాలు, కుక్క‌లు, గాడిద‌లు వంటి ఇత‌ర పెంపుడు జంతువుల్లానే ఆవు కూడా. అవి మాన‌వుల‌కు ఏవిధంగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయో ఆవు కూడా అంతే. కేవ‌లం దాని ఉప‌యోగాన్ని బ‌ట్టే సంర‌క్షించాలి. దేవ‌త‌లా కొల‌వ‌కూడ‌దు" అని సావ‌ర్క‌ర్ త‌న పుస్త‌కంలో పేర్కొన్న‌ట్లు స‌త్య‌కి వివ‌రించారు.

అలా చేయ‌డం మూఢ‌న‌మ్మ‌క‌మే..

ఇక ఆవు పేడ‌, మూత్రాల‌ను ప‌విత్రంగా భావించి సేవించ‌డాన్ని సావ‌ర్క‌ర్ త‌ప్పుబ‌ట్టిన‌ట్లు స‌త్య‌కి తెలిపారు. జంతు వ్యర్థాలను శరీరంలోకి తీసుకోవడం పుణ్యకార్యం కాదని, అది మానవ మేధస్సును దుర్వినియోగం చేయడమేనని చెప్పారు. వాటిని మందుల త‌యారీకి, వ్య‌వ‌సాయ అవ‌స‌రాల‌కు మాత్ర‌మే ఉప‌యోగించుకోవ‌డానికి త‌న‌ తాత ప్రోత్స‌హించిన‌ట్లు స‌త్య‌కి పేర్కొన్నారు.

అలా అన‌డం అవ‌మాన‌క‌రం

అదేవిధంగా ఆవు శరీరంలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారనే నమ్మకాన్ని సావర్కర్ తప్పుపట్టారు. ఇది హిందూ సంస్కృతిని అపహాస్యం చేస్తుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆవును గోమాత అనడాన్ని కేవ‌లం సాంకేతిక భావ‌న‌గా మాత్ర‌మే తీసుకోవ‌చ్చ‌ని.. దాన్ని అక్ష‌రాల దైవంగా భావించ‌డం స‌రికాద‌ని సావ‌ర్క‌ర్ పేర్కొన్నారు. ఇవి మతపరమైన ఆచారాలు కాదని, కేవలం మూఢనమ్మకాలేనని తేల్చిచెప్పారు. ఆవును దైవంగా భావించ‌డం మాన‌వాలికే కాకుండా దైవ‌త్వ‌పు భావ‌న‌కే ఒక అవ‌మాన‌క‌రం అని అన్నారు.

ఆవు మెడలో కుక్క‌లాగా గంట కట్టండి..

ఆవు పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, అది చాలా ఉపయోగకరమైన జంతువు కాబట్టి రక్షించాలని సావ‌ర్క‌ర్ పేర్కొన్నారు. హిందూ ధర్మానికి ఆవు చిహ్నం కాదని వాదించారు. గోవును పూజించ‌డానికి బ‌దులు సంర‌క్ష‌కులు, పెంప‌క‌దారులుగా మారాల‌ని సావ‌ర్క‌ర్ ప్ర‌జ‌ల‌కు త‌న పుస్త‌కం ద్వారా సూచించారు. "పశువులను రక్షించండి. దేశ పశుసంపదను పెంచండి. కానీ ఒక జంతువును దేవుడిగా మార్చి పూజించకండి. మీరు గోవును గౌరవించాలనుకుంటే.. దాని మెడలో గంట కట్టండి. దేవుని మెడలో పూలదండ వేసే భావంతో కాకుండా.. ఒక నమ్మకమైన కుక్క మెడలో బెల్ట్ వేసిన‌ట్లు ఆవు మెడ‌లో గంట క‌ట్టండి" అని త‌న వ్యాసంలో రాసుకొచ్చారు.

గోవ‌ధ‌ను ఆపేందుకు దేశాన్నే బ‌లి చేశారు..

ముస్లిం/మొఘల్ దండయాత్రల సమయంలో హిందూ సైన్యాలతో ఘర్షణ జరిగినప్పుడల్లా శ‌త్రువులు ఆవుల‌ను అడ్డుగా వాడుకున్నార‌ని సావ‌ర్క‌ర్ త‌న పుస‌క్త‌కంలో రాసుకొచ్చారు. ఆవుల‌ను చంప‌కుండా ఉండేందుకు హిందూ సైన్యాలు యుద్ధ‌భూమి నుంచి వెనుదిరిగాయ‌ని చెప్పారు. దీనివ‌ల్ల దేశానికి చాలా న‌ష్టం వాటిల్లిన‌ట్లు వాదించారు. ఆవుల ర‌క్ష‌ణ కోసం దేశాన్నే బ‌లి చేశార‌ని పేర్కొన్నారు. గోవ‌ధ‌ను నివారించేందుకు దేశ విధ్వంసం జ‌ర‌గ‌డానికి అనుమ‌తించార‌ని పేర్కొన్నారు. దేశం కంటే ఆ జంతువే ఎక్కువ విలువైన‌దిగా భావించార‌ని వ్యాఖ్యానించారు.

"దేశం లేదా ధర్మం ప్రమాదంలో ఉన్నప్పుడు మొదటి ప్రాధాన్యం సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడమే. చిన్న అంశాల కోసం పెద్ద లక్ష్యాన్ని, స్వాతంత్య్రాన్ని త్యాగం చేయడం వినాశకరం. గతంలో ఒక్క ఆవునో, ఒక్క దేవాలయాన్నో, పుణ్య‌క్షేత్రాన్నో కాపాడటానికి లొంగిపోయిన ప్రతి యుద్ధం .. చివ‌రికి హిందూ రాజ్యాల పతనానికి దారితీశాయి. ఆ భూభాగంపై వరుసగా ముస్లిం సామ్రాజ్యాల స్థాపనకు దారితీసింది" అని సావర్కర్ త‌న పుస్త‌కంలో రాసుకొచ్చారు.

అమెరిక‌న్లు గోవుల‌ను జంతువులుగానే చూస్తారు

"నిజంగా చెప్పాలంటే.. భాగవతంలో వర్ణించిన గోకులం నేడు భూమిపై ఎక్కడైనా ఉందంటే అది అమెరికాలోనే. అక్కడ ప్రజలు గోవును కేవలం ఒక ఉపయోగకరమైన జంతువుగా మాత్ర‌మే చూస్తారు. ఆవులను అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో, కేవలం ఉపయోగకరమైన జంతువులుగా భావిస్తూ పశుసంపదను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. కానీ భారత్‌లో మాత్రం ఆవును కేవలం పూజనీయ వస్తువుగా చూస్తూ, ఆచరణలో మాత్రం గోశాలలు, కసాయిఖానాలకే పరిమితం చేస్తున్నారు. నేను చెప్పేది ఒక్క‌టే ఈ జంతువు నుంచి మానవాళి అత్యధిక ప్రయోజనాన్ని ఏ విధంగా పొందవచ్చో కొనుగొనేందుకు శాస్త్రీయ ప‌ద్ద‌తుల‌ను ఉప‌యోగించండి. అమెరికా త‌ర‌హాలోనే ప‌శువుల జాతిని అభివృద్ధి చేయండి. పాల ఉత్ప‌త్తిని పెంచండి. వాటి ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చండి. ప‌శువుల‌ను ర‌క్షించండి. దేశ పశుసంపదను పెంచండి" అని సావర్కర్ త‌న పుస్త‌కంలో రాసిన‌ట్లు స‌త్య‌కి వివ‌రించారు.

కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ 2023 లండన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వినాయ‌క దామోద‌ర్ సావ‌ర్క‌ర్‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై స‌త్య‌కి సావ‌ర్క‌ర్ కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేశారు. దీనిపై ప్ర‌స్తుతం విచార‌ణ జ‌రుగుతోంది. ఈ విచార‌ణ సంద‌ర్భంగానే కీల‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆవును గోమాత‌గా పూజిస్తూ.. వ‌ధించ‌డంపై వ‌స్తున్న వ్య‌తిరేక‌త వేళ సావ‌ర్క‌ర్ పుస్త‌కంలోని వివ‌రాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.

Also Read..

'తెలంగాణ రైజింగ్-2026' సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి.. సీఎస్ సంజ‌య్ జాజు ఆదేశాలు..

ఎంఎస్ఎంఈలకు గుడ్‌న్యూస్.. ఆలస్య చెల్లింపులపై కొత్త చట్టం, వివాదాలకు త్వరిత పరిష్కారం..

గగన్‌యాన్ నుండి సొంత అంతరిక్ష స్టేషన్ దాక.. విశ్వాన్ని జయించేందుకు సిద్ధమైన భారత్!

Advertisement
Advertisement