త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan | తెలంగాణ సాంకేతిక విద్యను లాగేసుకుంటున్నారా? ఆనంద్ మహీంద్రాను నిలదీసిన దాసోజు శ్రవణ్

తెలంగాణలో సాంకేతిక విద్యను వైఐఎస్‌యూ (YISU)కి అప్పగించే జీవో 97పై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై ఆనంద్ మహీంద్రాకు బహిరంగ లేఖ రాశారు.

J

Telangana | Published On Aug 28, 2026, 4.26 pm IST

Dasoju Sravan | తెలంగాణ సాంకేతిక విద్యను లాగేసుకుంటున్నారా? ఆనంద్ మహీంద్రాను నిలదీసిన దాసోజు శ్రవణ్
Advertisement
  • జీవో 97 ద్వారా తెలంగాణ సాంకేతిక విద్యను YISUకు బదలాయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్
  • ఈ ఏకపక్ష నిర్ణయంపై YISU బోర్డు చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు బహిరంగ లేఖ రాసిన వైనం
  • లక్షకు పైగా విద్యార్థులున్న వ్యవస్థను కేవలం వెయ్యి మంది సామర్థ్యం ఉన్న వర్సిటీకి ఎలా అప్పగిస్తారని సూటి ప్రశ్న
  • మహబూబాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్‌ను తీవ్రంగా ఖండించిన దాసోజు శ్రవణ్

Dasoju Sravan | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను (Technical Education) పూర్తిగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 97 (GO 97) ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు YISU బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు (Anand Mahindra) ఆయన ఒక సంచలన బహిరంగ లేఖ రాశారు.

రాష్ట్రంలోని లక్షకు పైగా సాంకేతిక విద్యా సీట్లను ఒక్క రాత్రిలోనే ప్రైవేటీకరణ (Privatisation) దిశగా వైఐఎస్‌యూకి బదలాయించడం తుగ్లక్ చర్య అని శ్రవణ్ విమర్శించారు. కనీసం బోర్డు ఆమోదం లేకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారో చెప్పాలని ఆనంద్ మహీంద్రాను నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 115 పాలిటెక్నిక్ కళాశాలలు, 64 ఏటీసీలు (ATCs), 301 ఐటీఐలను.. కేవలం 1,000 మంది సామర్థ్యంతో, తాత్కాలిక క్యాంపస్‌లో నడుస్తున్న ఒక యూనివర్సిటీకి ఎలా అప్పగిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఎలాంటి డ్యూ డిలిజెన్స్ (Due Diligence), మౌలిక సదుపాయాల ఆడిట్‌లు లేకుండా ఇంత భారీ విలీనానికి ఎలా ఒప్పుకుంటుందని శ్రవణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రూ.3,000 కోట్లతో ఐఐటీ-హైదరాబాద్ (IIT-H) సహకారంతో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధునీకరణకు గతంలో రూపొందించిన ప్రణాళికలను పక్కనపెట్టి, ఎలాంటి అనుభవం లేని వర్సిటీకి ఈ వ్యవస్థను అప్పగించడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఈసెట్ (ECET), బీటెక్ లేటరల్ ఎంట్రీ, ఫీజుల నిర్మాణం, రిజర్వేషన్లపై తీవ్ర అనిశ్చితి నెలకొందని గుర్తుచేశారు.

తమ హక్కుల సాధన కోసం మహబూబాబాద్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. ఈ అన్యాయంపై ఆనంద్ మహీంద్రా మౌనం వీడాలని కోరారు. ఈ విలీనానికి సంబంధించి బోర్డు సమావేశ తీర్మానాలు, డ్యూ డిలిజెన్స్ రిపోర్టులు, విద్యార్థుల రిజర్వేషన్లు, ఫీజుల పరిరక్షణకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని తక్షణమే పబ్లిక్ డొమైన్‌లో (Public Domain) ఉంచాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement