త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Vivek | మియోషి మేయర్‌తో మంత్రి వివేక్‌ భేటీ

Minister Vivek | తెలంగాణ–జపాన్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి కీలక ప్రతిపాదనలు చేశారు. జపాన్‌ పర్యటనలో భాగంగా మియోషి నగర మేయర్‌ ఫుకుయోకా సతోషితో మంత్రి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశమైంది.

P

Telangana | Published On Aug 28, 2026, 2.50 pm IST

Minister Vivek | మియోషి మేయర్‌తో మంత్రి వివేక్‌ భేటీ
Advertisement
  • తెలంగాణ–జపాన్‌ సహకారంపై చర్చలు..
  • నైపుణ్యాలు, విద్య, సాంకేతికత, స్మార్ట్‌ వ్యవసాయంపై భాగస్వామ్యానికి ప్రతిపాదన

Minister Vivek | తెలంగాణ–జపాన్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి కీలక ప్రతిపాదనలు చేశారు. జపాన్‌ పర్యటనలో భాగంగా మియోషి నగర మేయర్‌ ఫుకుయోకా సతోషితో మంత్రి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశమైంది. హైదరాబాద్‌–మియోషి మధ్య రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను నైపుణ్యాభివృద్ధి, విద్య, సాంకేతికత, స్మార్ట్‌ వ్యవసాయం, యువత మార్పిడి, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాల వరకు విస్తరించడంపై చర్చించారు.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ..

తెలంగాణ యువతకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ (YISU), అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ATCs), ఐటీఐల ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివేక్‌ వివరించారు. మియోషిలోని సాంకేతిక విద్యా సంస్థలను తెలంగాణలోని ఈ సంస్థలతో అనుసంధానించి.. విద్యార్థులు, శిక్షకుల మార్పిడి, సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపు, జపాన్‌ తయారీ విధానాలు, పరిశ్రమ ఆధారిత శిక్షణలో ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించారు.

జపాన్‌ ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ

జపాన్‌లో ఉద్యోగాలు పొందే తెలంగాణ యువతకు సాంకేతిక నైపుణ్యాలతో పాటు జపనీస్‌ భాష, పని ప్రదేశ క్రమశిక్షణ, సామాజిక విలువలు, సంస్కృతిపై శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. జపాన్‌ పరిశ్రమల మానవ వనరుల అవసరాలను తెలంగాణ నైపుణ్య యువతతో అనుసంధానించేందుకు TOMCOM ద్వారా దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.

స్మార్ట్‌ వ్యవసాయంలోనూ..

వ్యవసాయ రంగంలోనూ తెలంగాణ–జపాన్‌ మధ్య సహకారానికి విస్తృత అవకాశాలున్నాయని వివేక్‌ పేర్కొన్నారు. జపాన్‌లోని వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతిక ఆధారిత సాగు, ఉత్పాదకత పెంపు, సుస్థిర వ్యవసాయ విధానాలపై పరస్పర అవగాహన, సాంకేతిక సహకారం పెంచుకోవాలని ప్రతిపాదించారు. హైదరాబాద్‌లో డిసెంబరులో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2026కు మియోషి మేయర్‌, ప్రతినిధి బృందాన్ని మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల మధ్య నిర్దిష్ట భాగస్వామ్యాలను ఖరారు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఉద్యోగ రంగంలో స‌హ‌కారం..

హైదరాబాద్‌–మియోషి మధ్య ఉన్న స్నేహ సంబంధాలను ఇకపై స్పష్టమైన ఫలితాలిచ్చే భాగస్వామ్యాలుగా మార్చడమే లక్ష్యమని వివేక్‌ అన్నారు. నైపుణ్యాలు, సాంకేతికత, వ్యవసాయం, విద్యార్థుల మార్పిడి, అంతర్జాతీయ ఉద్యోగాల రంగాల్లో సహకారాన్ని పెంచుతూ భారత్‌–జపాన్‌ సంబంధాలకు కొత్త నమూనాను రూపొందించాలని పేర్కొన్నారు. సమావేశంలో మియోషి మేయర్‌ ఫుకుయోకా సతోషితో పాటు డిప్యూటీ మేయర్లు సైమి తకేషి, యమజాకి తేరు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement