త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dasoju Sravan vs Revanth Reddy | అప్పు పుట్టనిదే పూట గడవని దయనీయ స్థితిలో తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం చెప్పే రెవెన్యూ మిగులు అబద్ధమని కాగ్ (CAG) నివేదికతో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. 4 నెలల్లోనే భారీగా అప్పులు చేశారని మండిపడ్డారు.

J

Telangana | Published On Aug 28, 2026, 2.53 pm IST

Dasoju Sravan vs Revanth Reddy | అప్పు పుట్టనిదే పూట గడవని దయనీయ స్థితిలో తెలంగాణ
Advertisement
  • బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ సర్కార్ ఆర్థిక విధానాలపై తీవ్ర విమర్శలు
  • జూలై 2026 నాటి కాగ్ (CAG) లెక్కల ప్రకారం రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపణ
  • బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు అని చెప్పి, కేవలం 120 రోజుల్లోనే రూ. 19,266 కోట్ల లోటుకు చేర్చారని ఫైర్
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణమే అసెంబ్లీలో శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని డిమాండ్

Dasoju Sravan vs Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నాలుగు నెలల్లోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని జూలై 2026 నాటి అధికారిక కాగ్ (CAG) నివేదిక ఆధారంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రైజింగ్, 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ప్రభుత్వం చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని, వాస్తవానికి రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి చేరుకుందని ఆయన మండిపడ్డారు.

అసెంబ్లీ వేదికగా రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసమని శ్రవణ్ ఆరోపించారు. బడ్జెట్‌లో రూ.6,857 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని గొప్పలు చెప్పారని, కానీ తీరా చూస్తే కేవలం 120 రోజుల్లోనే రాష్ట్రం రూ. 19,266 కోట్ల రెవెన్యూ లోటులో (Revenue Deficit) పడిపోయిందని ఫైర్ అయ్యారు. రోజువారీ పాలన కోసమే నెలకు దాదాపు రూ. 4,816 కోట్లు ఖజానా నుంచి ఆవిరవుతున్నాయని, ప్రైమరీ డెఫిసిట్ రూ. 23,197 కోట్లకు చేరి అప్పు పుట్టనిదే పూట గడవని దయనీయ స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని విమర్శించారు.

ఈ నాలుగు నెలల కాలంలోనే రేవంత్ ప్రభుత్వం అప్పుల రికార్డు సృష్టించిందని గణాంకాలతో వివరించారు. ఏడాదికి ఉన్న నికర అప్పుల పరిమితి రూ. 58,458 కోట్లు కాగా, అందులో జూలై నాటికే 58 శాతం (రూ. 33,730 కోట్లు) వాడేశారని మండిపడ్డారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే ఏకంగా రూ. 10,532 కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఆస్తులు సృష్టించే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ (Capital Expenditure) మాత్రం కేవలం 19.62 శాతానికే పరిమితమై కునారిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆదాయాలకు భారీ గండి

ప్రభుత్వ ఆదాయాలకు భారీ గండి పడుతోందని, పన్నేతర (Non-Tax) ఆదాయం, కేంద్ర గ్రాంట్లు, మద్యం, రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన నిధుల్లో భారీగా అవినీతి జరుగుతోందని శ్రవణ్ ఆరోపించారు. ఆదాయ లీకేజీల వల్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం 31.45 శాతానికి, జీఎస్టీ వసూళ్లు 31.03 శాతానికి పడిపోయాయన్నారు. ఒకపక్క ఖజానా ఖాళీ చేసి రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 10 వేల కోట్లకు చేరి ఆసుపత్రులు, కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు.

ప్రజల దృష్టి మరల్చే పీఆర్ (PR) ప్రచారాలు ఆపి, వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, లీకేజీలపై అసెంబ్లీలో శ్వేతపత్రం (White paper) విడుదల చేయాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు స్పష్టమైన ఫైనాన్షియల్ రోడ్‌మ్యాప్‌ను ప్రజల ముందు ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement