త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indiramma Towers | పేదల ఆత్మగౌరవానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’

Indiramma Towers | నగరంలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ‘ఇందిరమ్మ టవర్స్‌’లో ఫ్లాట్ల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను లక్కీడ్రా ద్వారా చేపడుతోంది. అర్హతనే ప్రామాణికంగా తీసుకుని కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎంపిక జరుగుతోందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

P

Telangana | Published On Aug 28, 2026, 2.34 pm IST

Indiramma Towers | పేదల ఆత్మగౌరవానికి ‘ఇందిరమ్మ టవర్స్‌’
Advertisement
  • 16 నియోజకవర్గాల్లో 8వేల ఫ్లాట్లకు లక్కీడ్రా..
  • పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
  • మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి

Indiramma Towers | నగరంలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ‘ఇందిరమ్మ టవర్స్‌’లో ఫ్లాట్ల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను లక్కీడ్రా ద్వారా చేపడుతోంది. అర్హతనే ప్రామాణికంగా తీసుకుని కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఎంపిక జరుగుతోందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లక్కీడ్రాను లబ్ధిదారులు, మీడియా సమక్షంలో నిర్వహిస్తూ.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు చెప్పారు. నాంపల్లి, కుత్బుల్లాపూర్‌, సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో లక్కీడ్రా నిర్వహించారు. నాంపల్లి రెడ్‌హిల్స్‌, రాజేంద్రనగర్‌ మైలార్‌దేవుపల్లి పరిధిలో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని డ్రా తీశారు. ఈ నెల 31 వరకు 16 నియోజకవర్గాల్లో సుమారు 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.

480 ఫ్లాట్లకు 600 మంది ఎంపిక

ప్రతి నియోజకవర్గంలో 480 ఫ్లాట్ల కేటాయింపునకు 600 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేస్తామని మంత్రి తెలిపారు. అనంతరం క్షేత్రస్థాయిలో అధికారులు తుది పరిశీలన చేస్తారని చెప్పారు. ఎంపికైన వారిలో ఎవరైనా అనర్హులుగా తేలితే.. మిగిలిన 120 మందిలో అర్హులకు అవకాశం కల్పిస్తామని వివరించారు. లక్కీడ్రాలో ఎంపికైన ప్రతి లబ్ధిదారుడికి సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్‌ నిర్మించి ఇస్తామని పొంగులేటి తెలిపారు. ఒక్కో ఇంటికి 17 నుంచి 20 గజాల అన్‌డివైడెడ్‌ షేర్‌ భూమి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం గుర్తించిన స్థలాలను బట్టి 10 అంతస్తుల వరకు టవర్లు నిర్మించి.. లిఫ్ట్‌లు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని మంత్రి తెలిపారు. రిజిస్ట్రేషన్‌ అనంతరం పదేళ్ల తర్వాత అవసరాన్ని బట్టి ఇంటిని విక్రయించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అంతకుముందు అత్యవసర పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్‌ పత్రాలను బ్యాంకులో కుదువ పెట్టి రుణం పొందవచ్చని వివరించారు. లక్కీడ్రా తర్వాత అధికారుల పరిశీలన పూర్తిచేసి ధ్రువపత్రాలు అందజేస్తామని.. ఆ తర్వాత మూడు, నాలుగు రోజుల్లోనే టవర్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

50 శాతం రిజర్వేషన్లు

ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపులో సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. ఎస్సీలకు 14 శాతం, ఎస్టీలకు 5, బీసీలకు 16, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పారిశుధ్య కార్మికులు, నాలుగో తరగతి, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 10 శాతం చొప్పున కేటాయింపులు ఉంటాయని వివరించారు. మొత్తం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా.. మహిళలకు 30 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. నాంపల్లి లక్కీడ్రాలో ఎస్సీ కోటాలోని 67 ఫ్లాట్ల కోసం 288 మంది పేర్లతో డ్రా నిర్వహించారు. మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే మాజిద్‌ హుస్సేన్‌, హౌసింగ్‌ ఎండీ వి.పి. గౌతమ్‌, కలెక్టర్‌ ప్రియాంక తదితరుల సమక్షంలో లబ్ధిదారులతోనే డ్రా తీయించారు. తొలి ఫ్లాట్‌ మరకాల కృష్ణవేణికి దక్కగా.. టి.అనిత, మంగనూరి అనసూయ, ఎం.కుమారి, శైలజాకుమారి తదితరులు ఎంపికయ్యారు.

తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లు

రాష్ట్రంలో తొలి విడతగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున నాలుగు విడతల్లో ఆర్థిక సాయం అందిస్తున్నామని.. చివరి విడత బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని వెల్లడించారు. రెండో విడతలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. మరో పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. క్యూర్‌ పరిధిలో తొలి విడతగా లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని.. మరో నాలుగు నియోజకవర్గాల్లో స్థలాల గుర్తింపు పూర్తయిందని చెప్పారు. ఆయా నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం సెప్టెంబర్‌ 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు. పేద కుటుంబాలు నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లోనూ గౌరవంగా జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి తెలిపారు. డబ్బు కూడబెట్టుకోవడం కంటే పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా సొంతింటిని అందించడమే ముఖ్యమని పేర్కొన్నారు.

Advertisement
Advertisement