త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Basara Temple | బాలాల‌యంలో కొలువుదీర‌నున్న చ‌దువుల త‌ల్లి.. రేప‌టి నుంచి గ‌ర్భ‌గుడిలో అమ్మ‌వారి ద‌ర్శ‌నాలు బంద్‌

Basara Temple | చదువుల తల్లి కొలువై ఉన్న బాస‌ర‌ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి (Basara Temple) ఆలయ పునఃనిర్మాణ ప‌నులు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆల‌య ప్రాగ‌ణంలోని రూ.150 అక్ష‌రాభ్యాస మండ‌పంలో బాలాల‌యం (Gnana Saraswati) ఏర్పాటు చేశారు.

G

Telangana | Published On Jul 4, 2026, 11.54 am IST

Basara Temple | బాలాల‌యంలో కొలువుదీర‌నున్న చ‌దువుల త‌ల్లి.. రేప‌టి నుంచి గ‌ర్భ‌గుడిలో అమ్మ‌వారి ద‌ర్శ‌నాలు బంద్‌
Advertisement

Basara Temple | త్రినేత్ర‌.న్యూస్‌: చదువుల తల్లి కొలువై ఉన్న బాస‌ర‌ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి (Basara Temple) ఆలయ పునఃనిర్మాణ ప‌నులు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆల‌య ప్రాగ‌ణంలోని రూ.150 అక్ష‌రాభ్యాస మండ‌పంలో బాలాల‌యం (Gnana Saraswati) ఏర్పాటు చేశారు. ఈ నెల 5న అమ్మ‌వారిని బాలాల‌యంలో ప్ర‌తిష్ఠించ‌నున్నారు. దీంతో ఆల‌య అధికారులు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇక‌పై గ‌ర్భ‌గుడిలోకి భ‌క్తుల‌ను అనుమ‌తించ‌బోమ‌ని ప్ర‌క‌టించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే గర్భాలయంలో ప్రత్యక్ష దర్శనాలను నిలిపివేయ‌నున్నారు. భక్తుల కోసం బాలాలయంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అందులోనే రూ.1000ల ప్ర‌త్యేక అక్ష‌రాభ్యాసాలు చేయించ‌డానికి ఏర్పాటు చేశారు. అదేవిధంగా రూ.150 అక్ష‌రాభ్యాసాల‌ను పాత ఈఓ కార్యాల‌యంలో చేయించ‌నున్నారు.

9 అంత‌స్తుల రాజ‌గోపురం..

బాస‌ర స‌ర‌స్వ‌తి అమ్మ‌వారి (Saraswati Temple) ఆలయ పునర్నిర్మాణానికి (Temple Reconstruction) ప్ర‌భుత్వం రూ.354 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల‌తో ప్ర‌ధాన గ‌ర్భాల‌యం, అనివేటి మండ‌పం, మ‌హంకాళి ఆల‌యం, ప్రాకార మండ‌పాలు, నాలుగు వ‌రుస‌ల రోడ్లు, అక్ష‌రాభ్యాస మండ‌పాలు, క్యూలైన్లు, ప్ర‌సాదాల కౌంట‌ర్లు త‌దిత‌ర ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. రోజురోజుకు భ‌క్తుల సంఖ్య పెరుగుతుండ‌టం, భ‌విష్యత్ అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 2 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో ఉన్న గ‌ర్భాల‌యం, అర్ధ మండ‌పాన్ని ఏకంగా 5 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌కు పెంచ‌నున్నారు. ఉత్తరం వైపున 9 అంత‌స్తుల రాజ‌గోపురం.. మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు.. 33 అడుగుల వెడ‌ల్పుతో 4 దిక్కుల్లో మాడ వీధులు.. ఉత్తర ద్వారాన్ని నిర్మించ‌నున్నారు. మొత్తంగా ఇప్పుడు ఉన్న 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల బాసర ఆల‌య విస్తీర్ణాన్ని.. 62 వేల చ‌ద‌ర‌పు అడుగుల‌కు పెంచుతున్నారు. దీంతో గతం కంటే 3 రెట్లు విశాలంగా ఆలయం కనిపించనుంది.

ఆల‌య చ‌రిత్ర‌..

జ్ఞాన సరస్వతీ ఆల‌యం మనశ్శాంతి ప్రసాదించే ప్రాంతంగా గుర్తింపు పొందింది. భరతయుద్ధాన్ని చూసి చలించిన వ్యాస మహర్షి తపస్సు చేయడానికి ఇక్కడికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. వాటి ప్ర‌కారం.. బ్రహ్మాండ పురాణాన్ని రచిస్తున్నప్పుడు ప్రకృతి ఖండంలోని శక్తిని వర్ణించాల్సిన అవసరం వ్యాసుడికి ఏర్పడింది. శక్తిని వర్ణించాలంటే తపోశక్తితోపాటు ఎలాంటి అంతరాయంలేని మహిమ గల ప్రశాంత వాతావరణంకావాలని ఆయన బాసర (జాహ్నావి తీరం) చేరుకున్నాడు. గోదావరి తీరంలో ధ్యానముద్రలో ఉన్నఆయనకు శక్తి రూపం నీడలా కనిపించి వెనువెంటనే మాయమైంది. దివ్యదృష్టితో చూడగా జ్ఞాన సరస్వతీ అమ్మవారు కనిపించింది. పాప కార్యాల వల్ల తన పూర్తి రూపాన్ని చూపెట్ట లేకపోతున్నానని, ప్రతీరోజు గోదావరిలో ధ్యానం చేసి పిడికెడు ఇసుకను నచ్చిన స్థానంలో వేయాలని, అలా వేసిన ఇసుకతో తన పూర్తిరూపం తయారవుతుందని అమ్మవారు తెలిపింది.

దీంతో వ్యాసుడు కుమారచర పర్వతంలోని ఒక గుహలో తపస్సు ప్రారంభించాడు. అమ్మవారు చెప్పినట్లు ఇసుకను ప్రస్తుతం బాసరలో ఉన్న కోనేరు ఎదురుగా వేయడం ప్రారంభించాడు. ఇలా కొన్నేళ్లు గడిచిన అనంతరం అమ్మవారి రూపం పూర్తి కావడంతో పాటు ఆమె జ్ఞాన సరస్వతీగా ఆవిర్భవించిందని పురాణాల్లో ఉంది. విగ్రహానికి జీవం పోయడం కోసం తగిన శక్తి కలిగేందుకు సరస్వతీ దేవి ఆయనకు జ్ఞాన బీజాన్ని ఉపదేశించింది. జ్ఞానానికి పుట్టుక బాసరలో జరిగినందున జ్ఞాన సరస్వతీ దేవిగా పిలుస్తున్నట్లు పెద్దలు చెబుతుంటారు.

చోళరాజుల కాలంలో.. 

బాసర సరస్వతీ దేవి ఆలయం, ఇతర ఆలయాలను చోళరాజులు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. చోళరాజుల కాలంలో బాసర ఒక మండలం. వీరు వ్యాసుడు ప్రతిష్టించిన సరస్వతీ దేవి విగ్రహానికి 16 స్తంభాల గుడి కట్టించారు. కోనేరుకు శాశ్వత నిర్మాణం చేపట్టారు. అయితే ముస్లింల దండయాత్రలో కొన్ని విగ్రహాలు దెబ్బతిన్నాయి. దీంతో బాసర సమీపంలోని రేణుకాపూర్‌ (ప్రస్తుతం ఈ గ్రామం నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలో ఉంది) గ్రామానికి చెందిన మక్కాజి పటేల్ ఆలయాన్ని పునరుద్ధరించారు. సరస్వతీ దేవి, మహాలక్ష్మీ, మహంకాళిలను వ్యాసుడు ప్రతిష్టించిన చోటు నుంచి పూర్వాభిముఖంగా తిరిగి ప్రతిష్టించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి పూజలు అలాగే కొన‌సాగుతున్నాయి.

Advertisement
Advertisement