త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana paddy procurement | వడ్లు కొనేది మేమే.. మీకు కమిషన్ కూడా ఇస్తున్నాం కదా! రాష్ట్ర సర్కార్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

వడ్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. వంద శాతం నిధులు కేంద్రమే ఇస్తున్నా కొనడం ఎందుకు చేతకావడం లేదన్నారు.

J

Telangana | Published On May 26, 2026, 9.38 pm IST

Telangana paddy procurement | వడ్లు కొనేది మేమే.. మీకు కమిషన్ కూడా ఇస్తున్నాం కదా! రాష్ట్ర సర్కార్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Advertisement
  • ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక మధ్యవర్తి మాత్రమేనని స్పష్టం చేసిన బండి సంజయ్
  • సుతిలీ తాడు నుంచి రవాణా ఖర్చుల వరకు ప్రతి పైసా కేంద్రమే భరిస్తోందని, మధ్యవర్తిత్వానికి కమిషన్ కూడా ఇస్తోందని వెల్లడి
  • కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకే బీజేపీ ఆధ్వర్యంలో 'రైతు గోస - బీజేపీ భరోసా' యాత్ర
  • కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి

Telangana paddy procurement | త్రినేత్ర.న్యూస్ : వడ్ల కొనుగోళ్ల (Paddy Procurement) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కోసం ప్రతి పైసా కేంద్రమే ఇస్తున్నప్పటికీ.. రైతుల నుంచి వడ్లు కొనడంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయిందని ఆయన మండిపడ్డారు.

మధ్యవర్తిత్వం.. కమిషన్

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక మధ్యవర్తి (Mediator) మాత్రమేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. సుతిలీ తాడు మొదలుకొని రవాణా (Transport) ఖర్చుల వరకు ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని, ఆఖరికి ఈ మధ్యవర్తిత్వం చేసినందుకు రాష్ట్రానికి ప్రత్యేకంగా కమిషన్ (Commission) కూడా ఇస్తున్నామని అసలు విషయం బయటపెట్టారు. అన్నీ కేంద్రమే ఇస్తున్నప్పుడు, పైసలన్నీ మేమే భరిస్తున్నప్పుడు.. ధాన్యం కొనడం రాష్ట్రానికి ఎందుకు చేతకావడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

బేషజాలు వదిలిపెట్టండి

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బేషజాలకు పోకుండా, యుద్ధ ప్రాతిపదికన ప్రతి గింజను కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పొరపాట్లను సరిదిద్దుకుని వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. అలాగే, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని రకాల వడ్లకు బోనస్ (Bonus) ఇవ్వాలన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో (Procurement centers) రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో 'రైతు గోస - బీజేపీ భరోసా' యాత్రను చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

కరీంనగర్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

అంతకుముందు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) భవనంలో రూ. 1.39 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రెండో అంతస్తు పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. కార్మిక ఆరోగ్య సంక్షేమ భవన పునరుద్ధరణ, షెడ్ల మరమ్మతు పనులను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement