త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao BRS | ఏపీకి నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లా? రేవంత్‌పై హరీశ్ ఫైర్

కేంద్రం కోటా వరకే ధాన్యం కొంటామన్న క్యాబినెట్ నిర్ణయంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రైతులను నట్టేట ముంచేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

J

Telangana | Published On Jun 18, 2026, 8.37 pm IST

Harish Rao BRS | ఏపీకి నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లా? రేవంత్‌పై హరీశ్ ఫైర్
Advertisement
  • కాంగ్రెస్ 'డిజిటల్ క్యాబినెట్' రైతుల పాలిట శాపమా? 
  • కేంద్రం కోటా మేరకే ధాన్యం కొనుగోలు చేస్తామనడం రైతులను దారుణంగా మోసం చేయడమేనని ఆగ్రహం
  • కేవలం 7 రకాల సన్న వడ్లకు మాత్రమే బోనస్ అనడం, ప్రాజెక్టుల్లో నీళ్లు లేవంటూనే ఏపీకి నీళ్లివ్వడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపణ
  • పెండింగ్‌లో ఉన్న రూ.16,545 కోట్ల 'రైతు భరోసా' నిధులను ఈ నెల 30న వెంటనే విడుదల చేయాలి
  • కాంగ్రెస్ క్యాబినెట్ వ్యవసాయ నిర్ణయాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర విమర్శలు

Harish Rao BRS | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ (Telangana Cabinet) తాజాగా తీసుకున్న నిర్ణయాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిజిటల్ క్యాబినెట్ పేరుతో ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని, రోజుకో వింత నిర్ణయంతో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోందని మండిపడ్డారు. కేంద్రం నిర్దేశించిన కోటా మేరకే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుంటోందని ఆయన ఫైర్ అయ్యారు.

కొనుగోళ్లలో చేతులెత్తేశారు!

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంద శాతం పంటలు ఎందుకు కొనట్లేదని ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఇప్పుడు కేంద్రాన్ని సాకుగా చూపి రైతుల గొంతు కోస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం ధాన్యం కొనకపోతే రైతులు పండించిన పంటను ఏం చేసుకోవాలి? ఇంట్లో దాచుకోవాలా? అంటూ నిలదీశారు. కేవలం 7 రకాల సన్నాలకు (Fine rice) మాత్రమే బోనస్ ఇస్తామనడం రైతులపై ఆంక్షలు విధించడమేనని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులు కనీస మద్దతు ధర (MSP) దక్కక.. మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

నీళ్లు ఏపీకి ఇచ్చి.. ఎల్‌నినో సాకు చెబుతారా?

ప్రాజెక్టుల్లో తెలంగాణకు రావాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వదిలేసి, ఇప్పుడు 'నీళ్లు లేవు.. చూసుకుని పంటలు వేయండి' అని రైతులకు చెప్పడం ప్రభుత్వ ఘోర వైఫల్యమని ఆయన విమర్శించారు. కృష్ణా జలాలపై (Krishna waters) ముందే హెచ్చరించినా మరో 10 టీఎంసీల నీటిని ఏపీకి ఎందుకు వదిలారని సూటిగా ప్రశ్నించారు. సొంత రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి ఏపీకి మేలు చేస్తూ.. ఎల్ నినో (El Nino) పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు.

రైతు భరోసా బకాయిలన్నీ చెల్లించాలి

కేసీఆర్ పాలనలో రైతులు రాజుల్లా బతికితే, ఇప్పుడు దివాలా తీస్తున్నారని హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. రైతు భరోసా (Rythu Bharosa) పంపిణీకి బహిరంగ సభలు పెట్టి షో చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న మూడు విడతల బకాయిలతో పాటు, ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన నిధులు కలుపుకుని మొత్తం రూ.16,545 కోట్లను ఈ నెల 30న మధిరలో జరిగే సభ వేదికగా రైతుల అకౌంట్లలో (Accounts) నేరుగా జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట కొనుగోళ్లపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement
Advertisement