త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E20 Petrol | E20 పెట్రోల్‌పై భయాలు అవసరం లేదు.. ఆటోమొబైల్ నిపుణుడి కీలక వ్యాఖ్యలు..

E20 Petrol | E20 పెట్రోల్‌పై పెరుగుతున్న ఆందోళనలను చెన్నైకి చెందిన ఆటోమోటివ్ ఇంజినీర్, రేస్ కార్ ట్యూనర్ అశ్విన్ దురై ఖండించారు. ఇంజిన్‌లు పెద్ద ఎత్తున దెబ్బతింటాయనే ప్రచారం సాంకేతిక ఆధారాల కంటే సోషల్ మీడియా ఊహాగానాల వల్లే ఎక్కువగా వ్యాపించిందని ఆయన పేర్కొన్నారు.

S

Automobiles | Published On Jul 7, 2026, 4.55 pm IST

E20 Petrol | E20 పెట్రోల్‌పై భయాలు అవసరం లేదు.. ఆటోమొబైల్ నిపుణుడి కీలక వ్యాఖ్యలు..
Advertisement

E20 Petrol | E20 పెట్రోల్‌పై పెరుగుతున్న ఆందోళనలను చెన్నైకి చెందిన ఆటోమోటివ్ ఇంజినీర్, రేస్ కార్ ట్యూనర్ అశ్విన్ దురై ఖండించారు. ఇంజిన్‌లు పెద్ద ఎత్తున దెబ్బతింటాయనే ప్రచారం సాంకేతిక ఆధారాల కంటే సోషల్ మీడియా ఊహాగానాల వల్లే ఎక్కువగా వ్యాపించిందని ఆయన పేర్కొన్నారు. ఐసీడీ ట్యూనింగ్ వ్యవస్థాపకుడు అశ్విన్ దురై తన బ్లాగ్‌లో ఈ అంశంపై విస్తృతంగా వివరించారు. 10 ఏళ్లకు పైగా అనుభవంతో 6వేల‌కు పైగా వాహనాలకు సర్వీసింగ్ చేయడం, 1వేయికి పైగా కార్లకు ట్యూనింగ్ చేయడం, అనేక రేస్ కార్లను నిర్మించడం ద్వారా తాను పొందిన ప్రత్యక్ష అనుభవం ఆధారంగానే ఈ అభిప్రాయాలను వెల్లడిస్తున్నానని చెప్పారు. తమ వర్క్‌షాప్‌లో పనితీరు ఆధారిత వాహనాల్లో చాలా కాలంగా ఇథనాల్ మిశ్రమ ఇంధనాలను ఉపయోగిస్తున్నామని, దీంతో అధిక ఇథనాల్ మిశ్రమాల పనితీరుపై తమకు విస్తృతమైన అనుభవం ఉందని వివరించారు.

E20 పెట్రోల్‌తో రిస్క్ అంత ఎక్కువ ఉండ‌దు..

ఇథనాల్‌కు అధిక ఆక్టేన్ రేటింగ్ ఉండటం వల్ల దహన ప్రక్రియ మెరుగుపడుతుందని, ఇంజిన్ నాకింగ్‌ను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని అశ్విన్ దురై తెలిపారు. E20 పెట్రోల్ వాడటం వల్ల తప్పనిసరిగా ఇంజిన్ నాకింగ్ వస్తుందనే వాదన సరైనది కాదని స్పష్టం చేశారు. బీఎస్4, ఆ తర్వాత వచ్చిన చాలా పెట్రోల్ వాహనాల్లో ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ఈసీయూ), ఆక్సిజన్ సెన్సర్లు, ఫ్యూయల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు ఉంటాయని చెప్పారు. ఇవి E20 ఇంధనానికి అవసరమైన గాలి-ఇంధన నిష్పత్తిని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తాయ‌ని వివరించారు. ఇథనాల్‌లో పెట్రోల్‌తో పోలిస్తే శక్తి సాంద్రత కొంత తక్కువగా ఉంటుందని అంగీకరించినప్పటికీ, మైలేజ్‌లో తగ్గుదల సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నంత ఎక్కువగా కాకుండా స్వల్పంగానే ఉంటుందని ఆయన చెప్పారు.

పాత వాహ‌నాలు అయితే..

ఆధునిక బీఎస్4 వాహనాల్లో ఇథనాల్‌ను తట్టుకునే ఫ్యూయల్ సిస్టమ్ భాగాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. అయితే పాత బీఎస్3 లేదా కార్బ్యూరేటర్ ఉన్న వాహనాల యజమానులు అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనం ఉపయోగించే ముందు ఫ్యూయల్ హోసులు, సీల్స్, ఫ్యూయల్ పంపులను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ఇథనాల్ నీటిని ఎక్కువగా ఆకర్షించడం వల్ల ఫ్యూయల్ సిస్టమ్ దెబ్బతింటుందనే ఆందోళనలపై కూడా ఆయన స్పందించారు. ఎక్కువకాలం ఉపయోగించకుండా నిలిపివేసిన లేదా సరిగా నిర్వహణ చేయని వాహనాల్లోనే ఇటువంటి సమస్యలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుందని, క్రమం తప్పకుండా ఉపయోగించే, సక్రమంగా నిర్వహించే వాహనాల్లో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుందని చెప్పారు. E20 పెట్రోల్ కారణంగా జరిగిందని భావిస్తున్న అనేక లోపాలకు అసలు కారణం పాతబడిన వాహన భాగాలు లేదా నిర్లక్ష్యంగా వదిలేసిన నిర్వహణ అని ఆయన అభిప్రాయపడ్డారు.

వాహన యజమానులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులను నమ్మకుండా, తమ వాహన తయారీ సంస్థ సూచనలను పాటించాలని అశ్విన్ దురై సూచించారు. అవసరమైతే అర్హత కలిగిన ఆటోమోటివ్ నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవాలని, తప్పుడు ప్రచారాలకు లోనుకావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement