త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Vivek | లేబర్‌ కోడ్‌లపై తొందరపాటు నిర్ణయాలు ఉండవ్ : మంత్రి వివేక్‌ వెంకటస్వామి

Minister Vivek | కార్మికుల సంక్షేమాన్ని కాపాడుతూ పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన సమతుల్య విధానాన్ని అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. పరిశ్రమలు బలంగా, స్థిరంగా కొనసాగితేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అదే సమయంలో కార్మికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

P

Telangana | Published On Jul 7, 2026, 6.55 pm IST

Minister Vivek | లేబర్‌ కోడ్‌లపై తొందరపాటు నిర్ణయాలు ఉండవ్ : మంత్రి వివేక్‌ వెంకటస్వామి
Advertisement

Minister Vivek | కార్మికుల సంక్షేమాన్ని కాపాడుతూ పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన సమతుల్య విధానాన్ని అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. పరిశ్రమలు బలంగా, స్థిరంగా కొనసాగితేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అదే సమయంలో కార్మికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. లేబర్ కోడ్స్‌పై మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన భాగస్వామ్య పక్షాల సంప్రదింపుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక చట్టాలు, కార్మిక న్యాయస్థానాల పనితీరు, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలు, కేంద్రానికి పంపాల్సిన సిఫార్సులు, కొత్త నిబంధనల రూపకల్పన వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. యాజమాన్యాలు, కార్మికులు పరస్పరం చర్చించుకుని ఆమోదయోగ్యమైన నిర్ణ‌యానికి వ‌స్తేనే పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని మంత్రి వివేక్ తెలిపారు.

పరిశ్రమలు అభివృద్ధి చెందితే దాని ప్రయోజనం కార్మికులకు కూడా అందుతుందని, పారిశ్రామిక విస్తరణతో పాటు ఉద్యోగ అవకాశాలు, మెరుగైన సౌకర్యాలు పెరుగుతాయని తెలిపారు. లేబర్ కోడ్ల‌పై పారిశ్రామిక సంఘాలు, కార్మిక సంఘాలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించాలని మంత్రి కోరారు. అయితే, ఏ నిర్ణయం తీసుకున్నా కార్మికుల ప్రయోజనాలు కేంద్రంగా ఉండాలని స్పష్టం చేశారు. కార్మికులు, పరిశ్రమలు రెండింటికీ మేలు చేసే విధానమే ప్రభుత్వ విధానమని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా పారిశ్రామిక అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివేక్ పేర్కొన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలతో కూడిన మానవ వనరులను సిద్ధం చేసేందుకు ఇండ‌స్ట్రియ‌ల్ అసోసియేష‌న్స్‌తో నిరంతర చర్చలు జరుపుతున్నామని చెప్పారు.

ఏ రంగానికి ఎలాంటి నైపుణ్యాలు అవసరమో గుర్తించి, యువతకు అందుకు తగ్గ శిక్షణ అందించే కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కనీస వేతనాల అంశంలోనూ ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరించిందని వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. పారిశ్రామిక సంఘాలు, ఇతర భాగస్వాములతో సుదీర్ఘ చర్చల అనంతరమే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గత పదేళ్లుగా కనీస వేతనాల పెంపు లేకపోవడంతో కార్మికుల నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయని, వారి అవసరాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు పరిశ్రమల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమతుల్య ప్రతిపాదన రూపొందించామని వివరించారు. ప్రభుత్వ ప్రతిపాదనకు సహకరించిన పారిశ్రామిక సంఘాలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

లేబర్‌ కోడ్‌ల అమలుపై ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి అంశంపై లోతైన చర్చ అవసరమని, నిర్దిష్ట అంశాలపై సూచనలు ఉంటే లిఖితపూర్వకంగా అందించాలని కోరారు. వచ్చిన సూచనలను పరిశీలించి, మరోసారి చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు అందించిన పారిశ్రామిక సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులకు మంత్రి వివేక్ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement