త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple Products | భార‌త గ్రే మార్కెట్‌ల‌లోకి యాపిల్ ఉత్ప‌త్తులు.. ధ‌ర‌ల పెంపు ఎఫెక్ట్‌..?

Apple Products | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ రాత్రికి రాత్రే త‌న మ్యాక్‌బుక్‌, ఐప్యాడ్‌, యాపిల్ టీవీ, హోమ్ పాడ్ ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను భారీగా పెంచిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏఐ డేటా సెంట‌ర్ల నిర్మాణం కార‌ణంగా చిప్ కొర‌త ఏర్ప‌డ‌డంతో ఇప్ప‌టికే అనేక టెక్ కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను భారీగా పెంచాయి.

S

Business | Published On Jun 29, 2026, 11.53 am IST

Apple Products | భార‌త గ్రే మార్కెట్‌ల‌లోకి యాపిల్ ఉత్ప‌త్తులు.. ధ‌ర‌ల పెంపు ఎఫెక్ట్‌..?
Advertisement

Apple Products | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ రాత్రికి రాత్రే త‌న మ్యాక్‌బుక్‌, ఐప్యాడ్‌, యాపిల్ టీవీ, హోమ్ పాడ్ ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను భారీగా పెంచిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏఐ డేటా సెంట‌ర్ల నిర్మాణం కార‌ణంగా చిప్ కొర‌త ఏర్ప‌డ‌డంతో ఇప్ప‌టికే అనేక టెక్ కంపెనీలు త‌మ ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను భారీగా పెంచాయి. ఈ కోవ‌లోనే యాపిల్ కూడా ఆయా ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను భారీగా పెంచింది. అయితే దీని వ‌ల్ల ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల క‌న్నా భార‌త్‌పైనే ఎక్కువ‌గా ప్ర‌భావం ప‌డుతోంది. వివిధ మోడల్స్‌ను బ‌ట్టి భార‌త మార్కెట్‌ల‌లో ధ‌ర‌లు 14 నుంచి ఏకంగా 70 శాతం పెరిగాయి. విదేశీ ఉత్ప‌త్తుల‌పై భారీగా దిగుమతి సుంకాలు ఉండ‌డంతోపాటు రూపాయి విలువ ప‌డిపోతున్న కార‌ణంగా యాపిల్ ధ‌ర‌ల పెంపు భార‌త మార్కెట్‌ల‌పై మ‌రింత ప్ర‌భావం చూపిస్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. దీని వ‌ల్ల గ్రే మార్కెట్ పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌ని, దేశంలోకి ఇత‌ర మార్గాల ద్వారా ఉత్ప‌త్తులు ప్ర‌వేశించే అవ‌కాశాలు ఉంటాయ‌ని అంటున్నారు.

భారీ ప‌న్నులే కార‌ణం..

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా పడిపోవడం, అధిక దిగుమతి సుంకాలు, భారీ స్థానిక పన్నులు కలిసి భారత్‌లో ధరలు అత్యధికంగా పెరగడానికి ప్రధాన కారణాలయ్యాయి. ఐడీసీ ఇండియా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ భారత్ వంటి మార్కెట్ల కోసం యాపిల్ ఇప్పటివరకు కొనసాగించిన అంతర్గత కరెన్సీ బఫర్‌ను ఇప్పుడు మళ్లీ సర్దుబాటు చేయాల్సి వచ్చిందని తెలిపారు. రూపాయి బలహీనపడటంతోపాటు ఆ బఫర్‌లో చేసిన మార్పులు కలిసి భారత్‌లో ధరల పెరుగుదలను మరింత తీవ్రతరం చేశాయని వివరించారు. యాపిల్ విదేశాల్లో తయారైన ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్‌లు, స్మార్ట్ హోమ్ యాక్సెసరీలను చాలా వ‌ర‌కు భారత్‌కు దిగుమతి చేస్తోంది. వీటిపై అధిక దిగుమతి సుంకాలతోపాటు 18 శాతం జీఎస్‌టీ కూడా విధిస్తున్నారు. ఈ పన్నుల భారం కూడా తాజా ధరల పెరుగుదలకు కారణమైందని నవకేందర్ సింగ్ తెలిపారు.

గ్రే మార్కెట్ దిగుమ‌తులు పెరుగుతాయి..

కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ ఈ భారీ ధరల పెంపుతో భారత్‌లో విక్రయించే యాపిల్ ఉత్పత్తులు అమెరికా, యూరప్‌లో విక్రయించే వాటికంటే మరింత ఖరీదైనవిగా మారాయని చెప్పారు. ఈ ధరల వ్యత్యాసం కారణంగా గ్రే మార్కెట్ దిగుమతులు పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు మౌలిక సదుపాయాల విస్తరణ వేగంగా జరుగుతుండటంతో కీలక ఎలక్ట్రానిక్ భాగాల ధరలు అమాంతం పెరిగాయి. ముఖ్యంగా డీఆర్‌ఏఎమ్, నాండ్ ఫ్లాష్ మెమరీల కొరత తీవ్రంగా ఉండటంతో స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థలు ఖర్చుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో దాదాపు అన్ని బ్రాండ్లు తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి. ఇప్పటివరకు పెరిగిన తయారీ వ్యయాన్ని తన లాభాల్లోనే భరించిన యాపిల్, ఇకపై అలా కొనసాగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కంపెనీ నుంచి కొద్ది రోజుల్లో వైదొల‌గ‌నున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ టిమ్ కుక్ గత వారం మాట్లాడుతూ విడిభాగాల ధరలు భరించలేని స్థాయికి చేరుకున్నందున ధరల పెంపు తప్పదని ప్రకటించారు.

భార‌త్‌కే ఎక్కువ షాక్‌..

గ‌త గురువారం రాత్రి ప్రకటించిన కొత్త ధరలు ప్రాంతాన్ని బట్టి మారాయి. అయితే శాతం పరంగా చూస్తే భారత్‌లోనే అత్యధిక పెంపు నమోదైంది. అమెరికాలో మ్యాక్‌బుక్, ఐప్యాడ్, యాపిల్ టీవీ, హోమ్‌పాడ్ ఉత్పత్తుల ధరలు సాధారణంగా 15 శాతం నుంచి 25 శాతం వరకు పెరిగాయి. యూరప్ దేశాల్లో కూడా ధరలు 20 శాతం నుంచి 25 శాతం వరకు పెరిగాయి. అయితే భారత్‌లో మాత్రం కొన్ని మోడళ్లపై ఈ పెంపు 70 శాతం వరకు చేరడం వినియోగదారులకు భారీ షాకిచ్చింది.

Advertisement
Advertisement