త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OnePlus | ఆక్సిజన్ ఓఎస్‌కు గుడ్‌బై.. వన్‌ప్లస్ ఫోన్లలో ఇక కలర్‌ఓఎస్, ఇండియా నుంచి ఎగ్జిట్ పై కూడా క్లారిటీ..

OnePlus | వన్‌ప్లస్ తన సాఫ్ట్‌వేర్ వ్యూహంలో కీలక మార్పులను ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న ఆండ్రాయిడ్ 17 తర్వాత అర్హత ఉన్న వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లను ఆక్సిజన్‌ఓఎస్ నుంచి ఒప్పో అభివృద్ధి చేసిన కలర్‌ఓఎస్‌కు మార్చనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మార్పు వినియోగదారులకు స్వచ్ఛంద అప్‌గ్రేడ్ రూపంలో అందుబాటులోకి రానుంది.

S

Technology | Published On Jul 16, 2026, 5.21 pm IST

OnePlus | ఆక్సిజన్ ఓఎస్‌కు గుడ్‌బై.. వన్‌ప్లస్ ఫోన్లలో ఇక కలర్‌ఓఎస్, ఇండియా నుంచి ఎగ్జిట్ పై కూడా క్లారిటీ..
Advertisement

OnePlus | వన్‌ప్లస్ తన సాఫ్ట్‌వేర్ వ్యూహంలో కీలక మార్పులను ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న ఆండ్రాయిడ్ 17 తర్వాత అర్హత ఉన్న వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లను ఆక్సిజన్‌ఓఎస్ నుంచి ఒప్పో అభివృద్ధి చేసిన కలర్‌ఓఎస్‌కు మార్చనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మార్పు వినియోగదారులకు స్వచ్ఛంద అప్‌గ్రేడ్ రూపంలో అందుబాటులోకి రానుంది. మాతృ సంస్థ ఒప్పోతో సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని ఏకీకృతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని వన్‌ప్లస్ తెలిపింది. ఇదే సమయంలో కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో కార్యకలాపాలను క్రమంగా ముగించే నిర్ణయాన్ని కూడా ప్రకటించింది. వన్‌ప్లస్ ఇండియా కమ్యూనిటీ ఫోరమ్‌లో విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, అప్‌గ్రేడ్‌కు అర్హత పొందిన ప్రస్తుత డివైస్‌ల వినియోగదారులు కలర్‌ఓఎస్ 17 అధికారికంగా విడుదలైన తర్వాత తమ ఇష్టానుసారం కొత్త సాఫ్ట్‌వేర్‌కు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ మార్పుతో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల విడుదల మరింత వేగవంతం అవుతుందని, సాఫ్ట్‌వేర్ నాణ్యత మెరుగుపడుతుందని, అలాగే ఒప్పోతో ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

ఈ దేశాల్లో వ‌న్‌ప్ల‌స్ క్లోజ్‌..

ఈ మార్పుల ద్వారా వినియోగదారులకు మరింత స్థిరమైన, విశ్వసనీయమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తామ‌ని వన్‌ప్లస్ తెలిపింది. అలాగే మొత్తం మార్పు ప్రక్రియలో కూడా వేగవంతమైన, సులభమైన, వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన అనుభవాన్ని అందించడంపైనే దృష్టి కొనసాగిస్తామని స్పష్టం చేసింది. అయితే కలర్‌ఓఎస్ 17 విడుదలకు సంబంధించిన పూర్తి టైమ్‌లైన్‌ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఏయే వన్‌ప్లస్ డివైస్‌లు ఈ అప్‌డేట్‌కు అర్హత పొందుతాయి, ఎప్పుడు దశలవారీగా విడుదల చేస్తారనే వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. కాగా వన్‌ప్లస్ అమెరికా కమ్యూనిటీ ఫోరమ్‌లో మరో ప్రకటన చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వ్యాపార పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం తీసుకోవడం సులభం కాదని పేర్కొంటూ అమెరికా, కెనడా, యూరప్ మార్కెట్లలో భవిష్యత్ ఉత్పత్తుల విడుదలను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఇది సంస్థ గ్లోబల్ వ్యూహంలో భాగంగా తీసుకున్న నిర్ణయమని వివరించింది.

భార‌త్‌లో య‌థావిధిగా కార్య‌క‌లాపాలు..

అయితే ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఉన్న వన్‌ప్లస్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కంపెనీ హామీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ ప్యాచ్‌లు, వారంటీ సేవలు, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ కొనసాగుతాయని తెలిపింది. అలాగే కస్టమర్ సర్వీస్ సేవలు కూడా యథావిధిగా అందుబాటులో ఉంటాయని, ఇప్పటికే ఉన్న వినియోగదారుల హక్కులను పూర్తిగా గౌరవిస్తామని స్పష్టం చేసింది. కాగా భారత్ సహా పలు దేశాల్లో కార్యకలాపాలను నిలిపివేయవచ్చని వచ్చిన వార్తల నేపథ్యంలో వ‌న్‌ప్ల‌స్ స్పందించింది. భారత్‌లో కార్యకలాపాలు నిలిచిపోతాయన్న ప్రచారాన్ని వన్‌ప్లస్ ఖండించింది. భారతీయ వినియోగదారులకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, ఉత్పత్తి మద్దతు, వారంటీ సేవలు, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ యథావిధిగా కొనసాగుతాయని స్పష్టంగా వెల్లడించింది.

Advertisement
Advertisement