త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airtel | ప్ర‌యారిటీ పోస్ట్‌పెయిడ్ సేవ‌ల‌ను స‌మ‌ర్థించుకున్న ఎయిర్ టెల్‌.. నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న లేద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌..

Airtel | భారత్‌లో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భార‌తి ఎయిర్‌టెల్ తన ప్ర‌యారిటీ పోస్ట్‌పెయిడ్ సేవలపై వచ్చిన నెట్ న్యూట్రాలిటీ ఉల్లంఘన ఆరోపణలను ఖండించింది. కమ్యూనికేషన్స్ శాఖకు ఇచ్చిన వివరణలో, తమ ప్ర‌యారిటీ పోస్ట్‌పెయిడ్ సేవలు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్), ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని సంస్థ స్పష్టం చేసింది.

S

Technology | Published On Jun 8, 2026, 5.28 pm IST

Airtel | ప్ర‌యారిటీ పోస్ట్‌పెయిడ్ సేవ‌ల‌ను స‌మ‌ర్థించుకున్న ఎయిర్ టెల్‌.. నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న లేద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌..
Advertisement

Airtel | భారత్‌లో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భార‌తి ఎయిర్‌టెల్ తన ప్ర‌యారిటీ పోస్ట్‌పెయిడ్ సేవలపై వచ్చిన నెట్ న్యూట్రాలిటీ ఉల్లంఘన ఆరోపణలను ఖండించింది. కమ్యూనికేషన్స్ శాఖకు ఇచ్చిన వివరణలో, తమ ప్ర‌యారిటీ పోస్ట్‌పెయిడ్ సేవలు టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్), ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని సంస్థ స్పష్టం చేసింది. కంపెనీ తెలిపిన ప్రకారం ఈ సేవ కంటెంట్‌కు సంబంధం లేకుండా పనిచేస్తుందని, ఎలాంటి బ్లాకింగ్, థ్రాట్లింగ్, ప్రాధాన్యత ఆధారిత కంటెంట్ ట్రీట్‌మెంట్ లేదా జీరో రేటింగ్ వంటి చర్యలు ఇందులో లేవని ప్రభుత్వానికి తెలియజేసింది. సేవా నాణ్యత ప్రమాణాల విషయంలో పూర్తి బాధ్యత వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే లైవ్ నెట్‌వర్క్ డేటాను అధికారులతో పంచుకుంటామని ఎయిర్‌టెల్ పేర్కొంది.

ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లే అధికం..

ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులను ప్ర‌యారిటీ ప్లాన్‌లకు అప్‌గ్రేడ్ చేసినప్పటికీ, దేశవ్యాప్తంగా ఉన్న 36.8 కోట్ల కస్టమర్లలో అధిక భాగం అయిన ప్రీపెయిడ్ వినియోగదారుల సేవల నాణ్యతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని వాదించింది. సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రీపెయిడ్ కస్టమర్లు మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్‌లో 92 శాతం ఉండగా, కంపెనీ ఆదాయంలో 88 శాతం వాటాను అందిస్తున్నారు. అలాంటి కీలక వినియోగదారుల సేవలను తగ్గించడం కంపెనీ వ్యాపార ప్రయోజనాలకు విరుద్ధమని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. తాజా ఆర్థిక ఫలితాల ప్రకారం ఎయిర్‌టెల్‌కు 2.9 నుంచి 3 కోట్ల మధ్య పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఉన్నారు. వీరు మొబిలిటీ యూజర్ బేస్‌లో కేవలం 7-8 శాతం మాత్రమే అయినప్పటికీ, ఆదాయంలో 12-13 శాతం వరకు వాటా కలిగి ఉన్నారు. ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు వినియోగదారులు మారడం సంస్థ ఆదాయాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.

ఉల్లంఘ‌న లేదు..

కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ వివరణ కోరిన నేపథ్యంలో, ఎయిర్‌టెల్ ప్రతినిధులు టెలికాం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ తన ప్ర‌యారిటీ పోస్ట్‌పెయిడ్ సేవలు 5జీ నెట్‌వర్క్ స్లైసింగ్ సాంకేతికత ఆధారంగా పనిచేస్తున్నాయని, అయితే నెట్ న్యూట్రాలిటీ నిబంధనలను ఎక్కడా ఉల్లంఘించడం లేదని వివరించింది. 5జీ నెట్‌వర్క్ స్లైసింగ్ ప్రస్తుతం 5జీలో పెద్ద స్థాయిలో ఆదాయం ఆర్జించగలిగే నిరూపిత మోడల్ కాగా భవిష్యత్తులో 6జీ నెట్‌వర్క్‌లకు కూడా ఇది కీలక సాంకేతిక పునాది అవుతుందని సంస్థ అభిప్రాయపడింది. భారత్‌ ప్రపంచ పోటీలో నిలవాలంటే ఇలాంటి సాంకేతిక పురోగతులను స్వీకరించడం అవసరమని పేర్కొంది. మరోవైపు, రిల‌య‌న్స్ జియో కూడా కమిటీకి సమర్పించిన నివేదికలో 5జీ స్లైసింగ్‌కు మద్దతు తెలిపింది. 5జీ స్టాండలోన్ నెట్‌వర్క్‌లలో ఇది ప్రమాణీకరించిన సాంకేతిక సామర్థ్యమని, వివిధ రంగాల కనెక్టివిటీ అవసరాలను తీర్చగలదని, భారతీయ నిబంధనల ప్రకారం కూడా దీనికి అనుమతి ఉందని జియో పేర్కొంది.

ఇప్ప‌టికే అనేక దేశాల్లో అమ‌లు..

అయితే ఒకే వర్గంలోని వినియోగదారుల మధ్య ప్రాధాన్యత ఆధారిత స్లైసింగ్ కోసం వేర్వేరు ధరలు వసూలు చేయాలంటే అది పారదర్శకంగా ఉండాలని, సాంకేతికంగా సమర్థించదగిన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అవసరాల ఆధారంగా మాత్రమే చేయాలని జియో సూచించింది. అవసరమైతే నెట్‌వర్క్ స్లైసింగ్ ఆధారిత సేవల అమలు విధానం, సాంకేతిక వివరాలను అధికారులు పరిశీలించి నెట్ న్యూట్రాలిటీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో అంచనా వేయవచ్చని తెలిపింది. ఇక 5జీ నెట్‌వర్క్ స్లైసింగ్ అనేది ఒకే టెలికాం నెట్‌వర్క్‌లో ప్రత్యేక అవసరాల కోసం వేర్వేరు వర్చువల్ మార్గాలను సృష్టించే విధానం. ఉదాహరణకు తక్కువ లేటెన్సీ అవసరమైన సేవలకు ప్రత్యేక ఫాస్ట్ లేన్‌లు లేదా నిరంతర కనెక్టివిటీ అవసరమైన సేవలకు ప్రత్యేక నెట్‌వర్క్ మార్గాలు అందించవచ్చు. ఇలాంటి 5జీ స్లైసింగ్ సేవలు ప్రస్తుతం సింగ‌పూర్‌, అమెరికా, యూకే, మ‌లేషియా వంటి దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఎలా ఉన్నాయి..

ఎయిర్‌టెల్‌లో ప్రస్తుతం బిజీ అవర్స్‌లో మొత్తం 5జీ నెట్‌వర్క్ సామర్థ్య వినియోగం సుమారు 38 శాతంగా ఉంది. ఇందులో పోస్ట్‌పెయిడ్ ట్రాఫిక్ వాటా కేవలం 4 శాతం మాత్రమే. ప్ర‌యారిటీ పోస్ట్‌పెయిడ్ కోసం ప్రత్యేక వర్చువల్ టన్నెల్ లేదా స్లైస్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా అది 6 శాతానికి మాత్రమే పెరుగుతుందని కంపెనీ తెలిపింది. దీంతోపాటు ప్రీపెయిడ్, ఇతర సాధారణ ట్రాఫిక్ కోసం మొత్తం సామర్థ్యంలో దాదాపు 60 శాతం అదనపు స్థలం అందుబాటులో ఉంటుందని, కాబట్టి ప్ర‌యారిటీ పోస్ట్‌పెయిడ్ సేవల వల్ల ప్రీపెయిడ్ వినియోగదారుల అనుభవం దెబ్బతినే అవకాశం లేదని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. ఎయిర్‌టెల్ ప్ర‌యారిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఒక్క వినియోగదారునికి రూ.449 నుంచి ప్రారంభమవుతాయి. ఐదుగురు సభ్యుల కుటుంబ ప్లాన్‌కు గరిష్ఠంగా రూ.1,749 వరకు ధర ఉంది. ఈ ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్ సౌకర్యాలు లభిస్తాయి.

వ్యక్తిగత ప్లాన్‌లో ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ అందిస్తారు. అధిక ధర కలిగిన ప్లాన్‌లలో అమెజాన్ ప్రైమ్‌, జియో హాట్ స్టార్‌, యాపిల్ టీవీ ప్ల‌స్‌, యాపిల్ మ్యూజిక్ సేవలు లభిస్తాయి. అత్యధిక ధర క‌లిగిన ప్లాన్‌ల‌లో వీటితోపాటు నెట్ ఫ్లిక్స్ కూడా అందుబాటులో ఉంటుంది.

ట్యాగ్స్:

Advertisement
Advertisement