త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airtel | రూటు మార్చిన ఎయిర్‌టెల్‌.. ప్ర‌యారిటీ పోస్ట్‌పెయిడ్ ను ఫాస్ట్ లేన్‌గా మార్పు..

Airtel | భారతి ఎయిర్‌టెల్ తన ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ సేవను అధికారికంగా ఫాస్ట్ లేన్ గా రీబ్రాండ్ చేసింది. కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు మొబైల్ నెట్‌వర్క్ సూచికల్లో కూడా కొత్త పేరును అమలు చేసింది. 5జీ నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీ ఆధారంగా ప్రీమియం వినియోగదారులకు అధిక వేగ కనెక్టివిటీ అందించే ఈ సేవ ఇటీవల భారతదేశంలో నెట్ న్యూట్రాలిటీ సూత్రాలపై పెద్ద చర్చకు దారితీసింది.

S

Technology | Published On Jun 11, 2026, 12.46 pm IST

Airtel | రూటు మార్చిన ఎయిర్‌టెల్‌.. ప్ర‌యారిటీ పోస్ట్‌పెయిడ్ ను ఫాస్ట్ లేన్‌గా మార్పు..
Advertisement

Airtel | భారతి ఎయిర్‌టెల్ తన ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ సేవను అధికారికంగా ఫాస్ట్ లేన్ గా రీబ్రాండ్ చేసింది. కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు మొబైల్ నెట్‌వర్క్ సూచికల్లో కూడా కొత్త పేరును అమలు చేసింది. 5జీ నెట్‌వర్క్ స్లైసింగ్ టెక్నాలజీ ఆధారంగా ప్రీమియం వినియోగదారులకు అధిక వేగ కనెక్టివిటీ అందించే ఈ సేవ ఇటీవల భారతదేశంలో నెట్ న్యూట్రాలిటీ సూత్రాలపై పెద్ద చర్చకు దారితీసింది. గత నెలలో ఎయిర్‌టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో లేదా పీక్ ట్రాఫిక్ సమయాల్లో కూడా పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు స్థిరమైన డేటా వేగాలు అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఈ సేవలో నెట్‌వర్క్‌లోని ఒక భాగాన్ని డైనమిక్‌గా వేరు చేసి, పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా కేటాయించే విధానం అమలులో ఉంది.

నెట్ న్యూట్రాలిటీకి విరుద్ధ‌మా..

అయితే ఎక్కువ చెల్లించే వినియోగదారులకు ప్రత్యేక నెట్‌వర్క్ లేన్లు కల్పించడం నెట్ న్యూట్రాలిటీకి విరుద్ధమా అనే ప్రశ్నలు తలెత్తాయి. నెట్ న్యూట్రాలిటీ సూత్రం ప్రకారం, తక్కువ చెల్లించే లేదా ప్రీపెయిడ్ వినియోగదారులు సహా అందరికీ సమానమైన ఇంటర్నెట్ ప్రాప్యత ఉండాలి. ఈ అంశం పార్లమెంటరీ స్థాయిలో కూడా చర్చకు వచ్చింది. బీజేపీ నేత నిశికాంత్ దూబే అధ్యక్షతన పనిచేస్తున్న కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, టెలికాం సంస్థల ప్రాధాన్య ప్లాన్లు కోట్లాది ప్రీపెయిడ్ వినియోగదారుల నెట్‌వర్క్ అనుభవాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో కమిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్స్ (డీఓటీ), టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)లను 5జీ నెట్‌వర్క్ స్లైసింగ్ ప్రభావాన్ని సమీక్షించాలని ఆదేశించింది. ముఖ్యంగా సింగ‌పూర్‌, యూకే తదితర దేశాల్లో అమలులో ఉన్న సమాన నమూనాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని సూచించింది. తదుపరి సమావేశానికి ముందు 25 రోజుల్లో నివేదిక అందించాలని గడువు విధించింది.

త‌న సేవ‌ల‌ను స‌మ‌ర్థించుకున్న కంపెనీ..

పార్లమెంటరీ కమిటీ ముందు ఎయిర్‌టెల్ తన సేవను సమర్థించింది. 5జీ స్లైసింగ్ టెక్నాలజీ నెట్ న్యూట్రాలిటీ నిబంధనలను ఉల్లంఘించదని, అలాగే ప్రీపెయిడ్ వినియోగదారుల సేవా నాణ్యతను ఏమాత్రం తగ్గించదని కంపెనీ స్పష్టం చేసింది. అన్ని వర్గాల వినియోగదారుల పనితీరు స్థిరంగానే ఉందని చూపించే డేటాను ట్రాయ్‌కు పారదర్శకంగా అందించినట్లు తెలిపింది. తమ స్టాండ్అలోన్ 5జీ నెట్‌వర్క్ సామర్థ్యం పెరగడం వల్ల మొత్తం వినియోగదారుల అనుభవం మెరుగుపడిందని పేర్కొంది. వివాదం తర్వాత కంపెనీ ఈ సేవను ఉపసంహరించుకుందా అనే ప్రశ్నకు ఎయిర్‌టెల్ ప్రతినిధి ఖండించారు. ఇది వెనక్కి తగ్గడం కాదని, ప్రారంభ ప్రచార కార్యక్రమం ముగిసిన తర్వాత సేవకు కొత్త వివరణాత్మక పేరును తీసుకురావాలనే ముందస్తు ప్రణాళికలో భాగమేనని వివరించారు.

పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్ల‌కు ప్ర‌త్యేక స‌దుపాయాలు..

ఎయిర్‌టెల్ ప్రతినిధి తెలిపిన‌ ప్రకారం కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ఉపసంహరించుకునే ప్రశ్నే లేదన్నారు. 5జీ స్లైసింగ్ టెక్నాలజీ ఆధారంగా తీసుకొచ్చిన ఈ ప్లాన్‌కు మంచి స్పందన లభించిందని తెలిపారు. ప్రచార కార్యక్రమం ముగిసినందున ఫాస్ట్ లేన్ అనే కొత్త పేరును ఉపయోగిస్తున్నామని చెప్పారు. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఇప్పటికీ ప్రత్యేక నెట్‌వర్క్ స్లైస్‌పైనే కొనసాగుతున్నారని వెల్లడించారు. 5జీ సపోర్ట్ ఉన్న డివైస్‌ను ఉపయోగించే ప్రతి పోస్ట్‌పెయిడ్ వినియోగదారుడు వేగవంతమైన స్పీడ్లు, అన్‌లిమిటెడ్ డేటా, మెరుగైన సేవలను పొందుతున్నారని కంపెనీ పేర్కొంది. కొత్త స్టాండ్అలోన్ నెట్‌వర్క్ అమలు వల్ల మొత్తం నెట్‌వర్క్ సామర్థ్యం పెరిగి అందరికీ ప్రయోజనం కలిగిందని తెలిపింది. అలాగే స్లైసింగ్ టెక్నాలజీ ద్వారా పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అధిక వేగం అందిస్తున్నప్పటికీ, ప్రీపెయిడ్ వినియోగదారులు కూడా ఈ టెక్నాలజీ ప్రారంభానికి ముందు పొందిన అదే స్థాయి అనుభవాన్ని కొనసాగిస్తున్నారని నిరూపించే సమగ్ర డేటా తమ వద్ద ఉందని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement