త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | ప్ర‌జ‌లు అధికారం ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్న‌రు.. మ‌నం కూడా సిద్ధం కావాలే

Ramchandar Rao | తెలంగాణ‌లో ప్ర‌జ‌లు బీజేపీకి అధికారం ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని, అందుకు మ‌నం కూడా సిద్ధం కావాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. ‘స‌ర్‌’ వల్లే ఓడిపోయామ‌ని దేశంలో ఉన్న విప‌క్షాలు అంటున్నాయ‌ని.. మ‌రి మీరు కొన్ని రాష్ట్రాల్లో గెలిచారు కదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Jun 11, 2026, 1.58 pm IST

Ramchandar Rao | ప్ర‌జ‌లు అధికారం ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్న‌రు.. మ‌నం కూడా సిద్ధం కావాలే
Advertisement
  • పోరాట‌మే మ‌న‌కు మార్గం
  • ఎస్‌ఐఆర్ అనేది బీజేపీ కార్యక్రమం కాదు
  • బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌కు అవ‌కాశం ఇచ్చినా తెలంగాణ బాగుప‌డ‌లే
  • రేవంత్‌ను కేసీఆర్ కాపాడితే, కేసీఆర్‌ను రేవంత్ ర‌క్షిస్తుండు
  • రేపు రాబోయే ప్ర‌భుత్వం బీజేపీయేన‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్న‌రు
  • జాబ్ క్యాలెండ‌ర్ కోసం చూస్తున్న‌రు
  • సిద్దిపేట‌లో అనేక స‌మ‌స్య‌లు ఉన్న‌య్‌
  • దీన్ ద‌యాళ్ ప్ర‌శిక్ష‌ణ వ‌ర్గ్ కార్య‌క్ర‌మంలో బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు వ్యాఖ్య‌లు

త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌లో ప్ర‌జ‌లు బీజేపీకి అధికారం ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని, అందుకు మ‌నం కూడా సిద్ధం కావాల‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. గురువారం సిద్దిపేట బీజేపీ కార్యకర్తల దీన్ దయాళ్ ప్రశిక్షణ వర్గ్ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ‘స‌ర్‌’ వల్లే ఓడిపోయామ‌ని దేశంలో ఉన్న విప‌క్షాలు అంటున్నాయ‌ని.. మ‌రి మీరు కొన్ని రాష్ట్రాల్లో గెలిచారు కదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. దొంగ ఓట్లు, చ‌నిపోయిన‌వారికి తొల‌గించి అస‌లైన ఓట్లు ఉండేలా చూడాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌జ్లిస్‌లో క‌లిశాయ‌ని ఆరోపించారు.

ఎస్‌ఐఆర్ అనేది బీజేపీ కార్యక్రమం కాదు..

గత 12 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం “నాగరిక్ దేవో భవ” అనే స్ఫూర్తితో పరిపాలనను ముందుకు తీసుకెళ్తోంది. మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విజయాలు, పరివర్తనాత్మక కార్యక్రమాలను తెలంగాణలోని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి. ఎస్‌ఐఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్‌, ఎంఐఎం పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఎస్‌ఐఆర్ అనేది బీజేపీ కార్యక్రమం కాదు. ఓటర్ల జాబితాను శుద్ధి చేసి, అప్‌డేట్ చేసి, మరింత బలోపేతం చేయడానికి భారత ఎన్నికల సంఘం చేపట్టే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని రాంచంద‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు.

తెలంగాణకు పూర్తి మ‌ద్ద‌తు తెలిపాం. ఏ ఆశ‌యాల‌తో ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చిందో వాటిపై బీఆర్ఎస్‌, కాంగ్రెస్ నాయ‌కులు నీళ్లు పోశారు. నీతి పేరు మీద రాజ‌కీయాలు చేస్తున్న‌రు. ప్రాజెక్టుల‌ను ఏటీఎం కింద‌కు మార్చుకున్న‌రు. మా ఎంపీలు చేసే ప‌ని చేస్తూనే ఉన్న‌రు. తెలంగాణ‌కు రావాల్సిన వాటా తెస్తున్న‌రు. కానీ మీరు చేస్తున్న‌ది ఏంది? కేంద్ర మంత్రుల ద‌గ్గ‌ర అపాయింట్‌మెంట్ మేము ఇప్పించాలా? అని ఆయ‌న రేవంత్‌రెడ్డిని నిల‌దీశారు.

ఎక్క‌డా స‌రైన బోధ‌న లేదు..

రేవంత్‌రెడ్డి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌రు. 13 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు కేంద్రం ఇచ్చింది. రేవంత్‌కు క‌ళ్లు క‌నిపిస్త‌లేవా. ఎందుకు అబ‌ద్దాలు చెబుతున్న‌రు. ఉద్యోగాలు వ‌స్తాయ‌ని కొట్లాడిన యువ‌త నిరుత్సాహంలో ఉన్నారు. జాబ్ క్యాలెండ‌ర్ కోసం యువ‌త ఎదురుచూస్తున్న‌రు. ఎక్క‌డా కూడా స‌రైన బోధ‌న జ‌ర‌గ‌డం లేదు. దాదాపు రూ.10 వేల కోట్ల‌ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు ఉన్నాయి. త‌ల్లిదండ్రులు త‌మ‌ మంగ‌ళసూత్రాలు తాక‌ట్టు పెట్టి పిల్ల‌ల‌ను చ‌దివించుకుంటున్న‌రు అని బీజేపీ చీఫ్ ఆవేద‌న చెందారు.

అందుకే కొత్త పార్టీ పెట్టింది..

పంప‌కాల విష‌యంలో గొడ‌వ‌లు వ‌చ్చి క‌విత కొత్త పార్టీ పెట్టుకుంది. అప్పుడు కుటుంబం దోచుకుంటే ఇప్పుడు న‌లుగురైదుగురు క‌లిసి దోచుకుంటున్న‌రు. ప్ర‌జ‌లు చూస్తున్న‌రు. రెండు పార్టీల‌కు అవ‌కాశం ఇచ్చినా తెలంగాణ బాగుప‌డ‌లే. మ‌హిళ‌ల‌కు, యువ‌త‌కు ఇప్పుడు బీజేపీయే క‌నిపిస్తోంది. రేపు రాబోయే ప్ర‌భుత్వం బీజేపీయేన‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్న‌రు అని రాంచంద‌ర్‌రావు వ్యాఖ్యానించారు.

ఇటీవ‌లే గ‌జ్వేల్ మార్కెట్‌కు వ‌చ్చాం..

8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 800 మంది స‌ర్పంచులు, 350 కౌన్సిల‌ర్లు, నాలుగు మున్సిప‌ల్ చైర్మ‌న్లు ఉన్న‌రు. సిద్దిపేట జిల్లాలో అనేక స‌మ‌స్య‌లు ఉన్న‌య్‌. గ‌తంలో సీఎం, ఇరిగేష‌న్ మంత్రి ఇక్క‌డే ఉండే. మాజీ ముఖ్య‌మంత్రి ఫామ్‌హౌజ్‌లో ఉంటే స‌రిపోదు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ బాధితుల‌కు ఇప్ప‌టికీ పూర్తిగా ప‌రిహారం రాలేదు. ఈ ప్ర‌భుత్వం ధాన్యం కొన‌డం లేదు. ఇటీవ‌ల వ‌చ్చి చూసిన‌ప్పుడు గ‌జ్వేల్ మార్కెట్‌లో ఎక్క‌డి ధాన్యం అక్క‌డే ఉంది అని ఆయ‌న పేర్కొన్నారు.

మ‌రి మీరు ఎట్ల గెలిచారు?

‘స‌ర్‌’ వ‌ల్ల కొన్ని ఓట్లు తీసేశార‌ని చెప్తున్నారు. ఈ ప్ర‌క్రియ‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ సిబ్బందే ఉంటారు. కేంద్రం ఏ త‌ప్పు చేయ‌లేదు. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల నాయ‌కులు అబ‌ద్దాలు చెబుతున్నారు. ఇండియాలో ఉన్న విప‌క్షాలు ఓట‌మిని ఒప్పుకోవు. గ‌తంలో ఓడిన‌ప్పుడు ఈవీఎంల వ‌ల్ల, ఇప్పుడు బెంగాల్‌లో ఓడిపోతే స‌ర్ వ‌ల్లే ఓడిపోయామ‌ని చెప్తున్న‌రు. ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని తిర‌స్క‌రించారు. మ‌రి మీరు కూడా కొన్నిచోట్ల గెలిచారు క‌దా? అక్క‌డ కూడా ఈవీఎంలే వాడారు క‌దా? మ‌రి మీరు ఎట్ల గెలిచారు? ఏం మాట్లాడుతారో ఆలోచించి మాట్లాడండి. స‌ర్‌పై కాంగ్రెస్ పార్టీ త‌ప్పుడు స‌మాచారం ఇస్తోంది అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు విమ‌ర్శించారు.

డీలిమిటేష‌న్‌ను వ్య‌తిరేకించారు..

అస‌లైన ఓట్లు పోకుండా, చ‌నిపోయిన‌వారి ఓట్లు తొల‌గించేలా చూడాలి. దొంగ ఓట్ల‌ను కూడా తొల‌గించాలి. రేపు ఓడిపోయే వాటికి కూడా ఈవీఎంలు, ‘స‌ర్‌’ కార‌ణం అని అంట‌రు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మ‌జ్లీస్‌లో క‌లిసింది. ఈ పార్టీల‌ను క‌లుపుకున్న‌ది ఎంఐఎంయే. స్టాలిన్ సీఎంగా ఉన్న‌ప్పుడు డీలిమిటేషన్ మీటింగ్‌కు కేసీఆర్‌, కేటీఆర్ ఒకే విమానంలో వెళ్లారు. ఇద్ద‌రూ డీలిమిటేషన్‌ను వ్య‌తిరేకించారు. మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్లను రెండు పార్టీలు వ‌ద్ద‌న్నాయి. ఈ పార్టీలు ఒక‌టి కాదా? బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు త‌మ అవినీతిని ర‌క్షించుకుంటున్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని కేసీఆర్ ర‌క్షించారు. ఈరోజు కాళేశ్వ‌రం కేసులో కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి ర‌క్షిస్తుండు అని రాంచంద‌ర్‌రావు ఆరోపించారు.

రేవంత్‌రెడ్డిని అడుగుతున్నా.. కాళేశ్వ‌రం కేసులో బీఆర్ఎస్ నేత‌ను అరెస్టు చేయండి. మీకు ద‌మ్ముంటే అరెస్టు చేయండి. ఎందుకు చేయ‌ట్లేదు. మీరు కుమ్మ‌క్క‌య్యారు కాబ‌ట్టే చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. 12 ఏండ్ల మోదీ పాల‌న‌లో ఒక్క అవినీతి జ‌ర‌గ‌లేదు. కానీ రెండున్న‌రేళ్ల‌లో మీ అవినీతిని బ‌య‌ట‌పెట్టుకున్నారు. మీరు చేసింది ఏం లేదు. ఐదు సంవ‌త్స‌రాలు ప్ర‌జ‌ల మీద దృష్టి పెట్టండి అని ఆయ‌న రేవంత్‌కు సూచించారు.

మూడుసార్లు అధికారంలోకి వ‌చ్చాం...

దేశంలో వ‌రుస‌గా మూడుసార్లు అధికారంలోకి వ‌చ్చాం. దీని వెన‌క కార్య‌క‌ర్త‌ల త్యాగాలు ఉన్న‌య్‌. 1951లో మూడు సీట్లే గెలిచాం. వాజ్‌పేయి, మోదీ పాల‌న‌లోనే స‌ర్పంచుల‌కు మంచి పేరు వచ్చింది. మోదీ హ‌యాంలో ఆర్థిక వ్య‌వ‌స్థ వేగంగా ముందుకు వెళ్తోంది. విక‌లాంగుల‌కు పెన్ష‌న్ వ‌స్త‌లేదు. స‌రైన తేదీకి జీతాలు రావ‌డం లేదు. బీజేపీ పార్టీకి పోరాట‌మే మ‌న‌కు మార్గం. కాంగ్రెస్‌ను గ‌ద్దె దింపుదాం. ప్ర‌జ‌లు బీజేపీకి అధికారం ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నారు. మ‌నం కూడా సిద్ధం కావాలే. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను దృష్టిలో పెట్టుకొని పార్టీని అధికారంలోకి తెచ్చేలా ప్ర‌తి కార్య‌క‌ర్త కృషి చేయాలి అని బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు విజ్ఞ‌ప్తి చేశారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement