త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shah Rukh Khan | లాస్ ఏంజిల్స్‌లో నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్.. ఆనందం వ్యక్తం చేసిన షారుఖ్ ఖాన్

Shah Rukh Khan | బాలీవుడ్ నటుడు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ఎన్నోఏళ్ల కల సాకారమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 'నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్' అందుబాటులోకి రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

P

Sports | Published On Jul 2, 2026, 5.22 pm IST

Shah Rukh Khan | లాస్ ఏంజిల్స్‌లో నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్.. ఆనందం వ్యక్తం చేసిన షారుఖ్ ఖాన్
Advertisement

Shah Rukh Khan | బాలీవుడ్ నటుడు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ఎన్నోఏళ్ల కల సాకారమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 'నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్' అందుబాటులోకి రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాలో క్రికెట్ అభివృద్ధి దిశగా ఇది కీలక అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. లాస్ ఏంజిల్స్ సమీపంలోని పొమోనాలో ఉన్న ఫెయిర్‌ప్లెక్స్‌లో అత్యాధునిక సదుపాయాలతో ఈ స్టేడియాన్ని నిర్మించారు. జులై 1న ఈ వేదికపై తొలి మేజర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్లు తలపడిన ఈ మ్యాచ్‌తో స్టేడియం అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. తమ స్వదేశ మార్కెట్‌కు వెలుపల అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియాన్ని నిర్మించిన తొలి గ్లోబల్ ఫ్రాంచైజీగా నైట్ రైడర్స్ గ్రూప్ ప్రత్యేక గుర్తింపు పొందింది.

స్టేడియం ప్రారంభోత్సవం సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ ఒక ఆలోచనగా మొదలైన ప్రయాణం నేడు విజయవంతంగా ఫలితాన్నిచ్చిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణ పొందుతున్న క్రీడల్లో ఒకటైన క్రికెట్‌ను లాస్ ఏంజిల్స్‌కు తీసుకురావడం ఎంతో గర్వకారణమని చెప్పారు. ఈ వేదిక కేవలం మ్యాచ్‌ల నిర్వహణకే పరిమితం కాకుండా కుటుంబాలు, అభిమానులు, స్థానిక సమాజం కలిసి ఆనందించే కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్టు విజయానికి సహకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షాతో పాటు భాగస్వాములందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

నైట్ రైడర్స్ స్పోర్ట్స్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ ఈ స్టేడియం అమెరికాలో క్రికెట్ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. సుమారు 21 మిలియన్ డాలర్ల వ్యయంతో కేవలం వంద రోజుల్లో నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఐదు వేల మంది ప్రేక్షకులు వీక్షించే సామర్థ్యం ఉన్న ఈ మైదానాన్ని, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ నాటికి 15 వేల సీట్ల సామర్థ్యానికి విస్తరించనున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్‌లో జరిగే టీ20 క్రికెట్ పోటీలకు ఈ వేదిక ఆతిథ్యం ఇవ్వనున్న అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement