త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Interstate drug gang arrest | స్పీడ్ పోస్ట్‌ల్లో గంజాయి దందా.. హైద‌రాబాద్‌లో చిక్కిన‌ అంతర్రాష్ట్ర ముఠా

Interstate drug gang arrest | పోస్టల్, కొరియర్ సేవల ద్వారా దేశవ్యాప్తంగా నిషేధిత గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు ప‌ట్టుకున్నారు. జార్ఖండ్‌ కేంద్రంగా ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను సాగిస్తోన్న జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడీ జిల్లా, తాంబ‌గుడియా గ్రామానికి చెందిన‌ ప్ర‌ధాన నిందితుడు స‌త్యం మిశ్రాను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

S

Hyderabad | Published On Jul 2, 2026, 5.06 pm IST

Interstate drug gang arrest | స్పీడ్ పోస్ట్‌ల్లో గంజాయి దందా.. హైద‌రాబాద్‌లో చిక్కిన‌ అంతర్రాష్ట్ర ముఠా
Advertisement
  • హైదరాబాద్‌కు చెందిన సుశాంత్‌ వ్యాస్‌, లడ్డు అరెస్ట్‌
  • జార్ఖండ్‌కు చెందిన ప్రధాన నిందితుడు స‌త్యం మిశ్రా రిమాండ్
  • మిగిల‌న‌వారి కోసం పోలీసుల విస్తృత‌ గాలింపు

Interstate drug gang arrest త్రినేత్ర‌.న్యూస్‌: పోస్టల్, కొరియర్ సేవల ద్వారా దేశవ్యాప్తంగా నిషేధిత గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు ప‌ట్టుకున్నారు. జార్ఖండ్‌ కేంద్రంగా ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను సాగిస్తోన్న జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడీ జిల్లా, తాంబ‌గుడియా గ్రామానికి చెందిన‌ ప్ర‌ధాన నిందితుడు స‌త్యం మిశ్రాను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

అన్న శుభమ్ మిశ్రాతో కలిసి డ్ర‌గ్స్‌ దందా..

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సత్యం మిశ్రా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంటర్మీడియట్ చదువును మధ్యలోనే ఆపేశాడు. మొదట్లో పెయింటర్‌గా, అనంత‌రం లారీ డ్రైవర్‌గా ప‌ని చేశాడు. లారీలలో సరుకులను చేరవేసే క్రమంలో తరచూ ముంబయికి వెళ్లేవాడు. ఈ క్ర‌మంలో గంజాయికి బానిసైన సత్యం మిశ్రాకు డ్రగ్స్ వాడేవారితో పరిచయ‌మేర్ప‌డింది. ఈజీగా డబ్బు సంపాదించాలని తన అన్న శుభమ్ మిశ్రాతో కలిసి ఈ దందాలోకి దిగాడు. త‌న బంధువు సచిన్ మిశ్రా, రాహుల్ ఝా, సంతోష్ పండిట్‌లతో కలిసి ముఠాగా ఏర్ప‌డ్డాడు.

సొంతూరిలోనే త‌యారీ.. కొరియర్ల ద్వారా డెలివరీ..

జార్ఖండ్‌లోని తమ సొంతూరిలోనే వారు గంజాయిని పండించేవారు. హైదరాబాద్, ముంబయి, చెన్నై, కేరళ, రాజస్థాన్, జార్ఖండ్, ఢిల్లీ, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా దాదాపు 21 రాష్ట్రాల్లోని ప‌లువురికి అమ్మేవారు. జార్ఖండ్‌లోని ఇస్రీ బజార్, ఫుస్రో బజార్ పోస్ట్ ఆఫీసులు ద్వారా పార్శిళ్లను పంపేవారు. పార్శిల్‌లో మెడిసిన్ ఉందంటూ పోస్టల్ అధికారులకు చెప్పేవారు. సత్యం మిశ్రా, శుభమ్ మిశ్రాలు గంజాయి పార్సెల్స్ సిద్ధం చేస్తుండ‌గా రాహుల్ ఝా వాటిని పోస్ట్ ఆఫీసుల్లో బుక్ చేసే బాధ్యతలు చూసేవాడు. వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఆర్డర్లు స్వీకరించి, డెలివరీ వివరాలు, చెల్లింపులను సమన్వయం చేసుకునేవారు.

సంవ‌త్స‌రానికి రూ.2 కోట్ల వ్యాపారం..

దేశవ్యాప్తంగా రోజుకు సగటున 80 నుంచి 100 ఆర్డర్లకు డెలివ‌రీ అందించేవారు. ఇందులో రోజుకు 8 నుంచి 10 పార్సిళ్లను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపేవారు. 50 నుంచి 250 గ్రాముల వరకు గంజాయిని ప్యాక్ చేసి, కస్టమర్ల నుంచి ఆర్డర్ పరిమాణాన్ని బట్టి రూ. 1,500 నుంచి రూ. 8,000 వరకు వసూలు చేసేవారు. ఈ పద్ధతిలో రోజుకు సుమారు రూ. ల‌క్ష‌కు పైగా, నెలకు దాదాపు రూ. 30 నుంచి 35 లక్షలు సంపాదించేవారు. ఏడాదికి సుమారు రూ. 4 నుంచి 5 కోట్ల రూపాయల భారీ టర్నోవర్‌తో దందా చేశారు. ముంబయిలో కూడా వీరికి 1000 మందికి పైగా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. శుభమ్ మిశ్రా స్వయంగా జార్ఖండ్ నుంచి రైళ్ల ద్వారా భారీ మొత్తంలో గంజాయిని ముంబైకి తీసుకెళ్లేవాడు. అక్కడ సచిన్ మిశ్రా, సంతోష్ పండిత్ అనే సహచరుల ఇళ్లలో ఈ గంజాయిని రహస్యంగా నిల్వ చేసేవారు. వ‌చ్చిన సొమ్మును నిందితులు వారి పాత్రల ఆధారంగా పంచుకునేవారు. భారీగా బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేశారు అని పోలీసులు తెలిపారు.

ఇలా దొరికారు..

పోలీసులకు చిక్క‌కుండా వీరు 'మ్యాంగో (Mango), స్టిక్ (Stick), ఫ్లవర్ (Flower)' వంటి కోడ్ పదాలను వివిధ పరిమాణాల గంజాయిని సూచించడానికి ఉపయోగించేవారు. ముంబైలోని అనుచరులు ఆ గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి లోకల్ ట్రైన్లు, ఆటో రిక్షాల వంటి ప్రజా రవాణా వ్యవస్థల ద్వారా కస్టమర్లకు చేరవేసేవారు. ఇస్రీ బజార్ పోస్ట్ ఆఫీస్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఒకరికి ఈ ముఠా గంజాయి పార్సెల్ పంపింది. హెచ్-న్యూ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ సప్లై లింక్ బయటపడింది. అలాగే ఫుస్రో బజార్ పోస్ట్ ఆఫీస్ నుండి మరో కస్టమర్‌కు కూడా గంజాయి పార్సెల్ పంపింది. వీరిద్దరిని అదుపులోకి తీసుకోగా మిగిలిన‌ నిందితులు దొరకకుండా తమ గుర్తింపును మార్చుకుని పరారయ్యే ప్రయత్నం చేశారు అని పోలీసులు పేర్కొన్నారు.

ఈ ఘటనలపై గుడిమల్కాపూర్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో వేర్వుగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో గంజాయిని బుక్‌ చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన సుశాంత్‌ వ్యాస్‌, లడ్డు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి, వారి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు చెప్పారు. ప్ర‌ధాన నిందితుడు స‌త్యం మిశ్రాను రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న ప‌రారీలో ఉన్న‌ శుభమ్ మిశ్రా అలియాస్ శుభమ్ దాదా అలియాస్ భయ్యా, రాహుల్ ఝా అలియాస్ ఛోటే మిశ్రా (పార్శిళ్ల బుకింగ్ ఏజెంట్), సచిన్ మిశ్రా (సత్యం మిశ్రా బంధువు - ముంబయి నెట్‌వర్క్ ప్రతినిధి), సంతోష్ పండిట్ (ముంబయి నెట్‌వర్క్ ప్రతినిధి) కోసం గాలిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

న‌గ‌ర‌వ్యాప్తంగా నిఘా..

ఈ భారీ డ్ర‌గ్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డ‌డంతో హైదరాబాద్‌ నగర పోలీసు యంత్రాంగం కొరియర్ ఏజెన్సీలపై నిఘా పెంచింది. నగరవ్యాప్తంగా ఉన్న అన్ని కొరియర్ ఏజెన్సీలు తాము బుక్ చేసే, డెలివరీ చేసే ప్రతి పార్సిల్‌ను విధిగా స్కాన్ చేస్తున్నారు. ఈ మత్తు దందాపై ప్రజలు కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. తమకు ఎలాంటి సంబంధం లేని లేదా తాము ఆర్డర్ చేయని అపరిచిత పార్సిళ్లు వస్తే అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. అనుమానం వస్తే వెంటనే డయల్ 100కి, హెచ్-న్యూ నంబర్ 8712661601 ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ మ‌త్తుకు బానిస కాకుండా చూడాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు.

ఆ ఆప‌రేష‌న్‌లో హెచ్-న్యూ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వ‌ర్యంలో ఇన్స్పెక్టర్లు బాలస్వామి, నాగార్జున, ఎస్సై మనోజ్ కుమార్, ఏఎస్సైలు చక్రపాణి, సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ ఉమాశంకర్‌తో పాటు కానిస్టేబుళ్లు కీలకపాత్ర పోషించారు. వారందరినీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ప్రత్యేకంగా అభినందించారు.

 

Advertisement
Advertisement