త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IPL 2026 | వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ స్లో ఓవ‌ర్ రేట్‌.. పంజాబ్ టీమ్ మొత్తానికి జ‌రిమానా..

IPL 2026 | శ్రేయాస్ అయ్య‌ర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు చెన్నై సూప‌ర్ కింగ్స్ పై చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘన కారణంగా అత‌నిపై చర్యలు తీసుకున్నారు. వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్‌రేట్ నమోదు కావడంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కఠిన చర్యలు చేపట్టింది.

S

Sports | Published On Apr 4, 2026, 9.39 am IST

IPL 2026 | వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ స్లో ఓవ‌ర్ రేట్‌.. పంజాబ్ టీమ్ మొత్తానికి జ‌రిమానా..
Advertisement

IPL 2026 | శ్రేయాస్ అయ్య‌ర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు చెన్నై సూప‌ర్ కింగ్స్ పై చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘన కారణంగా అత‌నిపై చర్యలు తీసుకున్నారు. వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్‌రేట్ నమోదు కావడంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కఠిన చర్యలు చేపట్టింది. గత మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ పై జరిగిన పోరులో కూడా ఇదే తప్పు చేసిన అయ్యర్ ఈసారి కూడా అదే తప్పు పునరావృతం చేశాడు. దీంతో అత‌నికి మరింత కఠిన శిక్ష విధించారు. ఈసారి జట్టులోని ఇతర సభ్యులు, ఇంపాక్ట్ ప్లేయర్ సహా అందరికీ జరిమానాలు విధించారు. ఈ మేర‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ నం.7లో పంజాబ్ కింగ్స్ జట్టు స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు, మొత్తం టీమ్‌కు జరిమానా విధించిన‌ట్లు తెలిపింది.

అయ్య‌ర్‌కు రూ.24 ల‌క్ష‌లు, ఇత‌ర ప్లేయ‌ర్ల‌కు రూ.6 ల‌క్ష‌లు..

ఈ సీజన్‌లో ఇది రెండో తప్పిదం కావడంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం అయ్యర్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించారు. ప్లేయింగ్ ఎలెవన్‌లోని మిగతా సభ్యులు, ఇంపాక్ట్ ప్లేయర్ సహా, ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం (వీటిలో ఏది త‌క్కువైతే అది) జరిమానాగా విధించామ‌ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పేర్కొంది.

రాణించిన ఆయుష్ మాత్రే..

ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అర్థశతకంతో రన్ ఛేజ్‌కు దిశానిర్దేశం చేశాడు. పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అయ్యర్ 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. యువ ఆటగాడు ఆయుష్ మాత్రే 43 బంతుల్లో 73 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి రెండో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. త‌రువాత వ‌చ్చిన సర్ఫరాజ్ ఖాన్ 12 బంతుల్లో 32 పరుగులతో వేగంగా ఆడగా, శివమ్ దూబే 27 బంతుల్లో అజేయంగా 45 పరుగులు చేశాడు.

పంజాబ్ వ‌రుస‌గా రెండో విజ‌యం..

అయితే 210 పరుగుల టార్గెట్‌ను పంజాబ్ కింగ్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఛేదించింది. మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో పంజాబ్ కింగ్స్ వ‌రుస‌గా త‌మ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసి పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర స్థానంలో ఉండగా, మ‌రోవైపు చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌రుస‌గా రెండో ఓట‌మిని చ‌విచూసింది. జ‌ట్టు బ్యాటింగ్ ఫ‌ర్వాలేద‌నుకున్నా బౌలింగ్ చాలా బ‌ల‌హీనంగా ఉంది. దీంతో చెన్నైకి ఈసారి కష్టాలు త‌ప్ప‌వ‌మ‌ని, మ‌రోసారి లీగ్ మ్యాచ్‌లు ముగిసే స‌రికి పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో స్థిర‌ప‌డుతుందా అని ఫ్యాన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ధోనీ గైర్హాజరి జ‌ట్టుపై ప్ర‌భావం చూపిస్తున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని అంటున్నారు.

Advertisement
Advertisement