త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | 30 ఏళ్ల కింద‌టే అమ‌లు చేయాల్సింది.. రిజ‌ర్వేష‌న్ల బిల్లును వ్య‌తిరేకించే పార్టీల‌ను మ‌హిళ‌లు క్ష‌మించ‌రు : ప్ర‌ధాని మోదీ

PM Modi | మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లుపై ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లోక్‌స‌భ‌లో (Lok Sabha) ప్ర‌సంగించారు. దాదాపు 25-30 ఏళ్ల క్రిత‌మే దీన్ని అమ‌లు చేసి ఉండాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

D

National | Published On Apr 16, 2026, 4.15 pm IST

PM Modi | 30 ఏళ్ల కింద‌టే అమ‌లు చేయాల్సింది.. రిజ‌ర్వేష‌న్ల బిల్లును వ్య‌తిరేకించే పార్టీల‌ను మ‌హిళ‌లు క్ష‌మించ‌రు : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లుపై ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లోక్‌స‌భ‌లో (Lok Sabha) ప్ర‌సంగించారు. దాదాపు 25-30 ఏళ్ల క్రిత‌మే దీన్ని అమ‌లు చేసి ఉండాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. అంతేకాదు, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌ను తీసుకురావ‌డంలో త‌మ ప్ర‌భుత్వానికి ఎలాంటి రాజ‌కీయ దురుద్దేశం లేద‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

"దేశ పార్ల‌మెంట‌రీ చ‌రిత్ర‌లో కొన్ని కీల‌క ఘ‌ట్టాలు ఉంటాయి. నేడు అలాంటి రోజే. పార్ల‌మెంట‌రీ చ‌రిత్ర‌లో ఈరోజును మ‌ర్చిపోలేం. 25-30 ఏళ్ల క్రితం ఆమోదించాల్సిన బిల్లు ఇప్పుడు సభ ముందుకు వచ్చింది. చరిత్ర సృష్టించడానికి ఇది పార్లమెంటుకు ఒక సువర్ణావకాశం. దేశ రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల పాత్ర కీల‌కం. మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇస్తే దేశానికి స‌రికొత్త మార్గం చూపిస్తారు. ఈ బిల్లుల‌తో దేశానికి స‌రికొత్త దశ‌, దిశ‌ను ఇస్తున్నాం. ఈ చారిత్ర‌క స‌మ‌యంలో పాలు పంచుకోవ‌డం నా అదృష్టం" అని ప్ర‌ధాని అన్నారు. విక‌సిత్ భార‌త్ అంటే మౌలిక స‌దుపాయాలు మాత్ర‌మే కాద‌ని ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. మ‌హిళ‌ల స్వావ‌లంబ‌న కూడా ఉంటేనే అది సంపూర్ణ విక‌సిత్ భార‌త్ అవుతుంద‌ని వెల్ల‌డించారు. రాజ‌కీయాల్లో త‌మ శ‌క్తిని చాటేందుకు మ‌హిళ‌లు సిద్ధంగా ఉన్నారని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.

మ‌హిళ‌లు మార్పు కోరుకుంటున్నారు..

"నేటి మ‌హిళ‌లు రాజ‌కీయం చైత‌న్య‌వంతుల‌య్యారు. పంచాయ‌తీల్లో ప‌నిచేస్తున్న మ‌హిళ‌లు మార్పు కోరుకుంటున్నారు. నిర్ణ‌యాత్మ‌క ప్ర‌క్రియ‌లో తాము కూడా భాగ‌స్వాములుగా ఉండాల‌ని ఆశిస్తున్నారు. విధాన రూప‌క‌ల్ప‌న‌లో స‌బ్ కా సాత్, స‌బ్ కా వికాస్ అనే స్ఫూర్తి ప్ర‌తిబింబించాల‌ని మేం కోరుకుంటున్నాము. దేశ జ‌నాభాలో 50 శాతం ఉన్న మ‌హిళ‌ల‌ను నిర్ణ‌యాధికార ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాముల‌ను చేయాలి. ఇది చాలా అవ‌స‌రం" అని ప్ర‌ధాని పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల బిల్లుకు అన్ని పార్టీలూ మ‌ద్ద‌తు తెల‌పాల‌ని ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు. ఈ బిల్లుకు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కూడ‌ద‌ని నొక్కి చెప్పారు.

ఆ క్రెడిట్ నాకు అవ‌స‌రం లేదు..

"దేశ అభివృద్ధి ప్రయాణంలో మా వంతు సహకారం అందించే అవకాశం మాకు లభించింది. ఇప్ప‌టికే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆల‌స్యం చేశాం. ఇంతటి ముఖ్యమైన అవకాశాన్ని చేజారిపోనివ్వొద్దు" అని ఆయన ప్ర‌తిప‌క్షాల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు విష‌యంలో త‌న‌కు క్రెడిట్ అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించారు. ఈ బిల్లు తేవ‌డం వెనుక ఎలాంటి రాజ‌కీయ దురుద్దేశం లేద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. ఏ పార్టీ ప్ర‌యోజ‌నం కోస‌మో ఈ బిల్లు తేలేద‌ని.. పార్టీల‌క‌తీతంగా అంద‌రూ ఈ బిల్లుకు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌ను వ్య‌తిరేకించే పార్టీల‌ను మ‌హిళ‌లు క్ష‌మించ‌ర‌ని ఈ సంద‌ర్భంగా విప‌క్షాల‌కు ప్ర‌ధాని చుర‌క‌లంటించారు. పంచాయతీల్లో రిజర్వేషన్లను అంగీకరించినట్లే, లోక్‌సభలోనూ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. అలాగే, మహిళా పక్షపాతంగా నిలిచే పార్టీలకే భవిష్యత్తులో రాజకీయ మనుగడ ఉంటుందని ప్రధాని చెప్పుకొచ్చారు.

ఏ రాష్ట్రానికీ అన్యాయం జ‌ర‌గ‌దు

అదేవిధంగా ఈ బిల్లుతో ఏ రాష్ట్రానికి అన్యాయం జ‌ర‌గ‌ద‌ని ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌తం అన్న తేడా త‌మ ప్ర‌భుత్వానికి లేద‌న్నారు. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కూ అన్ని ప్రాంతాలూ త‌మ‌కు స‌మాన‌మేన‌ని పేర్కొన్నారు. దేశ‌మంతా ఒక‌టే అని.. ప్రాంతీయ విబేధాల‌కు చోటు ఉండ‌కూడ‌ద‌న్నారు. ఈ బిల్లుతో ద‌క్షిణాది, చిన్న రాష్ట్రాల‌కు ఎలాంటి అన్యాయం జ‌ర‌గ‌ద‌ని చెప్పారు. ఈ బిల్లు రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాద‌ని.. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళా రిజర్వేషన్లు ఆలస్యం కాకూడదని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు.

Also Read..

డీలిమిటేష‌న్‌ను రాజ‌కీయ అస్త్రంగా వాడుకుంటున్నారు.. కేంద్రంపై గౌర‌వ్ గొగోయ్ ఫైర్‌

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి : మంత్రి శ్రీధ‌ర్ బాబు

హ‌మ్మ‌య్యా.. ప‌ని చేస్తున్న 'జ‌ల‌మండ‌లి' క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్

Advertisement
Advertisement