త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vikram1 | నిప్పులు చిమ్ముతూ.. నింగిలోకి దూసుకెళ్లిన‌ విక్రమ్ -1 రాకెట్‌

Vikram1 | భారత అంత‌రిక్ష రంగంలో స‌రికొత్త అధ్యాయం మొద‌లైంది. దేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' (Vikram-1) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.

D

National | Published On Jul 18, 2026, 1.07 pm IST

Vikram1 | నిప్పులు చిమ్ముతూ.. నింగిలోకి దూసుకెళ్లిన‌ విక్రమ్ -1 రాకెట్‌
Advertisement

Vikram1 | భారత అంత‌రిక్ష రంగంలో స‌రికొత్త అధ్యాయం మొద‌లైంది. దేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' (Vikram-1) విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మ‌ధ్యాహ్నం 12:05 గంట‌ల స‌మ‌యానికి ఆంధ్ర‌ప్రదేశ్‌లోని శ్రీహ‌రికోట‌లో ఉన్న స‌తీశ్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ (SDSC-SHAR) మొద‌టి లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి వెళ్లింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:30 గంటలకు ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఇంధన ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక లోపం (Technical Hold) కారణంగా కౌంట్‌డౌన్‌ను శాస్త్ర‌వేత్త‌లు తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ త‌ర్వాత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి ముందుగా అనుకున్న స‌మ‌యాని కంటే 35 నిమిషాల ఆలస్యంగా మధ్యాహ్నం 12:05 గంటలకు రాకెట్‌ను విజయవంతంగా లాంచ్ చేశారు. ఈ రాకెట్ విజ‌య‌వంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.

చ‌రిత్ర సృష్టించిన భార‌త్‌..

ఈ ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌క‌టించారు. 350 కేజీల పెలోడ్‌ల‌ను దాదాపు 450 కిలోమీటర్ల కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన‌ట్లు చెప్పారు. ఈ ప్ర‌యోగం విజ‌యంతో భార‌త్ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. అమెరికా, చైనా త‌ర్వాత ప్రైవేట్ సంస్థ సొంతంగా ఆర్బిటల్ రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి పంపిన మూడవ దేశంగా భారత్ నిలిచింది.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' (Skyroot Aerospace) పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రాకెట్‌ను రూపొందించింది. ఈ చారిత్రాత్మక ప్రయోగానికి 'మిషన్ ఆగమన్' (Mission Aagaman) అని పేరు పెట్టారు. విక్రమ్-1 మొత్తం 6 రకాల పేలోడ్స్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఇందులో భారత్‌కు చెందిన 5 పేలోడ్స్‌తో పాటు జర్మనీకి చెందిన ఒక సాంకేతిక పేలోడ్ ఉన్నాయి. పెలోడ్ల‌తోపాటూ ప్ర‌ధాని మోదీ స్వయంగా చేతితో రాసిన 'వందే మాతరం' సందేశంతో ఉన్న పోస్టుకార్డును అంత‌రిక్ష‌లోకి మోసుకెళ్లింది. వీటితో పాటు కాస్మోస్‌ డైమండ్స్‌ సంస్థ రూపొందించిన ‘కాస్మిక్‌ బ్లూమ్‌’ ఆర్ట్‌వర్క్‌, విక్రమ్‌-1 రాకెట్‌ సూక్ష్మ ప్రతిరూపాన్ని కూడా నింగిలోకి పంపారు. దీనిపై భారతీయ అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్, సీవీ రామన్, ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ శిల్పాల‌ను చెక్కారు.

సుమారు ఏడు అంతస్తుల భవనం ఎత్తుతో విక్ర‌మ్ 1ను రూపొందించారు. ఇది పూర్తిగా కార్బన్-కాంపోజిట్ పదార్థంతో నిర్మించిన తొలి ఆర్బిటల్ రాకెట్. ఇది ఉక్కుతో పోలిస్తే ఐదు రెట్లు తేలికగా ఉంటుంది. దీంతో రాకెట్ మరింత సమర్థవంతంగా పనిచేయ‌నుంది. ఈ రాకెట్ 450 కిలోమీటర్ల ఎత్తులోని తక్కువ భూ కక్ష్య (LEO)లోకి గరిష్ఠంగా 350 కిలోగ్రాముల పేలోడ్‌ను ప్రవేశపెట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో తొలిసారిగా 3D-ప్రింటెడ్ మెటల్ రాకెట్ ఇంజిన్‌లు ఉపయోగించారు. 2022లో విక్రమ్-ఎస్ సబ్-ఆర్బిటల్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన స్కైరూట్, ఇప్పుడు విక్రమ్-1ను ప్ర‌యోగించింది. ఈ ప్రయోగం ద్వారా రాకెట్‌లోని ప్రొపల్షన్, స్టేజ్‌ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్‌ వ్యవస్థల పనితీరును అంతరిక్ష ప్రయాణంలో పరీక్షించి కీలక సమాచారం సేకరించనున్నారు.

ప్ర‌ధాని మోదీ విషెస్‌

ఈ ప్ర‌యోగం నేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) శాస్త్ర‌వేత్త‌ల బృందానికి ఆల్‌ది బెస్ట్ చెప్పారు. ఈ ప్రయోగం మన యువతలోని ప్రతిభ, పట్టుదల, పారిశ్రామిక స్ఫూర్తిని చాటిచెబుతుందని పేర్కొన్నారు. అంతేకాదు, మన అంతరిక్ష రంగ సంస్కరణలు, ఆవిష్కరణలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు.

Also Read..

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన శ‌శి థ‌రూర్‌

ఐటీఆర్ ఫైల్ చేశారా ? ఈ పని చేయకపోతే రిటర్న్ చెల్లదు..

ఆశ్ర‌మంలో గంజాయి సాగుచేస్తున్న సాధువు.. ఆధ్యాత్మిక ముసుగులో అక్ర‌మాలు..

Advertisement
Advertisement