త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sridhar Vembu Zoho | అమెరికాలో గ్రీన్ కార్డ్ పాట్లు: ‘ఆత్మగౌరవం ముఖ్యం.. మన ఇండియాకు తిరిగి వచ్చేయండి’ జొహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఎమోషనల్ అప్పీల్

అమెరికా కొత్త గ్రీన్ కార్డ్ నిబంధనలతో ఇబ్బంది పడుతున్నారా? "ఆత్మగౌరవం ముఖ్యం.. తిరిగి ఇండియాకు వచ్చేయండి" అంటూ ఎన్ఆర్ఐలకు జొహో సీఈవో శ్రీధర్ వెంబు ఎమోషనల్ అప్పీల్ చేశారు.

J

National | Published On May 23, 2026, 5.24 pm IST

Sridhar Vembu Zoho | అమెరికాలో గ్రీన్ కార్డ్ పాట్లు: ‘ఆత్మగౌరవం ముఖ్యం.. మన ఇండియాకు తిరిగి వచ్చేయండి’ జొహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఎమోషనల్ అప్పీల్
Advertisement
  • గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే సొంత దేశానికి తిరిగి వెళ్లాల్సిందేనని అమెరికా ఇటీవల కొత్త నిబంధనలు తీసుకొచ్చింది
  • ఈ నేపథ్యంలో జొహో (Zoho) ఫౌండర్ శ్రీధర్ వేంబు అమెరికాలో వీసాలపై ఉన్న భారతీయులకు ఎమోషనల్ అప్పీల్ చేశారు
  • కష్టాలు, త్యాగాలు ఎదురైనా.. ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని మాతృభూమికి తిరిగి రావాలని కోరారు
  • అందరం కలిసికట్టుగా మన దేశంలో అవకాశాలు సృష్టించుకుంటూ ఇండియాను అభివృద్ధి పథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు

Sridhar Vembu Zoho | త్రినేత్ర.న్యూస్ : అమెరికాలో స్థిరపడాలని కలలు కంటూ దశాబ్దాలుగా గ్రీన్ కార్డ్ (Green Card) కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెకీలు, నిపుణులకు జొహో (Zoho) సంస్థల ఫౌండర్, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీధర్ వెంబు కీలక పిలుపునిచ్చారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా తీసుకొచ్చిన కఠినమైన ఇమ్మిగ్రేషన్ రూల్స్ నేపథ్యంలో, హెచ్1బీ (H1B) లాంటి వర్క్ వీసాలపై అమెరికాలో ఉన్న భారతీయులంతా ఆత్మగౌరవంతో స్వదేశానికి తిరిగి రావాలని ఆయన సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

'లొసుగులకు చెక్' అంటున్న అమెరికా

ఇటీవల యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఇమ్మిగ్రేషన్ విధానాలపై సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ పొందాలనుకునే వారు కచ్చితంగా తమ సొంత దేశానికి వెళ్లి, అక్కడి నుంచే దరఖాస్తు (Consular processing) చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇకపై లొసుగులను వాడుకుంటూ, ఇమ్మిగ్రేషన్ సిస్టమ్‌ను దుర్వినియోగం చేసే రోజులు పోయాయని ఘాటుగా హెచ్చరించింది. కొత్త రూల్స్ ప్రకారం అమెరికాలో ఉంటూ చేసుకునే 'అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్' (Adjustment of Status) ను కేవలం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు.

'దయచేసి ఇంటికి రండి..'

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం టెక్, రీసెర్చ్, కార్పొరేట్ రంగాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఈ పరిణామాలపై ఐఐటీయన్ అయిన శ్రీధర్ వేంబు ఎక్స్‌లో ఎమోషనల్‌గా రెస్పాండ్ అయ్యారు. మొదటి నుంచీ స్వదేశంలో అవకాశాల కల్పనను ప్రోత్సహించే ఆయన.. మరోసారి ఎన్ఆర్ఐలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.

"అమెరికాలో వీసాలపై ఉన్న భారతీయులకు నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇంటికి రండి" అని ఆయన పోస్ట్ చేశారు.

ఆత్మగౌరవమే ముఖ్యం

ఇండియాకు తిరిగి రావడం వల్ల ఆర్థికంగా నష్టపోతామని, ప్రొఫెషనల్‌గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడొద్దని ఆయన సూచించారు. "ఇది మీకు కష్టంగా, ఒక త్యాగంగా అనిపించినా సరే.. ఆత్మగౌరవం (Self-respect) అనేది మీ ప్రయాణాన్ని నిర్దేశించాలి. మన భారత్‌ను గర్వపడేలా చేద్దాం" అని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. విదేశీ గడ్డపై కంఫర్ట్ కోసం రాజీ పడకుండా, సొంత దేశంలో అవకాశాలు సృష్టించుకోవాలని, ఇండియా గ్రోత్ స్టోరీలో భాగస్వాములు కావాలని వెంబు ఆకాంక్షించారు.

గ్రీన్ కార్డ్ నిరీక్షణతో విసిగిపోయిన ఎంతోమంది భారతీయులకు శ్రీధర్ వెంబు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement
Advertisement