త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Zoho layoffs | జోహోలో లేఆఫ్స్ కలకలం: ముందస్తు నోటీసులు లేకుండా 300 మంది ట్రైనీల తొలగింపు

ప్రముఖ ఐటీ కంపెనీ జోహో (Zoho) ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే సుమారు 300 మంది ట్రైనీలను (Freshers) ఉద్యోగాల నుంచి అకస్మాత్తుగా తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ 'బ్లైండ్' (Blind) యాప్‌లో ఓ బాధిత ఫ్రెషర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

J

National | Published On Apr 14, 2026, 4.46 pm IST

Zoho layoffs | జోహోలో లేఆఫ్స్ కలకలం: ముందస్తు నోటీసులు లేకుండా 300 మంది ట్రైనీల తొలగింపు
Advertisement

Zoho layoffs | త్రినేత్ర.న్యూస్ : ఐటీ రంగంలో మళ్లీ లేఆఫ్స్ (Layoffs) భయం మొదలైంది. తాజాగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ 'జోహో' (Zoho) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రాత్రికి రాత్రే దాదాపు 300 మంది ట్రైనీలను (Trainees) కంపెనీ నుంచి పంపించేసినట్లు సమాచారం. 'బ్లైండ్' (Blind) యాప్‌లో ఈ లేఆఫ్స్‌కు గురైన ఓ ఫ్రెషర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పాటు ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

ఆ పెద్ద కంపెనీలు కాదని వస్తే..

"ఎలాంటి నోటీసు లేకుండా ఇటీవల నన్ను జోహో నుంచి తొలగించారు. నాతో పాటు దాదాపు 300 మంది ట్రైనీలను ఒక్కసారిగా వెళ్లిపోమన్నారు" అని సదరు యూజర్ బ్లైండ్ యాప్‌లో పోస్ట్ చేశాడు. టీసీఎస్ (TCS), కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చినా, మంచి అవకాశం అని భావించి వాటిని వదులుకుని జోహోలో చేరానని బాధపడ్డాడు. "ఆ కంపెనీల్లో చేరి ఉంటే, కొన్నాళ్లు బెంచ్‌పై ఉన్నా కనీసం కొంత ఉద్యోగ భద్రత అయినా ఉండేది. నేను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. నా కుటుంబం ఈ ఉద్యోగం పైనే ఆధారపడి ఉంది" అని తన ఆవేదన వ్యక్తం చేశాడు.

అసలు కారణం అదేనా?

ఈ ఆకస్మిక తొలగింపుల వెనుక కంపెనీలోని అంతర్గత రాజకీయాలు (Internal Politics) ఉన్నాయని బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. "ఇటీవల కంపెనీలో ఒక ఫుల్-టైమ్ ఉద్యోగి.. 'మమ్మల్ని తీసేసి మా స్థానంలో ట్రైనీలను భర్తీ చేయాలని చూస్తున్నారా?' అని కామెంట్ చేశాడు. బహుశా సీనియర్లలో ఉన్న ఆ అభద్రతాభావమే ఈ లేఆఫ్స్‌కు కారణమై ఉండొచ్చు" అని పేర్కొన్నాడు. "మేము ఎవరి ఉద్యోగాలనూ లాక్కోవడానికి రాలేదు. నేర్చుకోవడానికి, అనుభవజ్ఞులైన వారితో కలిసి పని చేసి ఎదగడానికి వచ్చాము" అని సీనియర్లను ఉద్దేశించి రాసుకొచ్చాడు.

సీఈఓ శ్రీధర్ వేంబుకు సూటి ప్రశ్న

జోహో సీఈవో శ్రీధర్ వేంబును ఉద్దేశించి సదరు ఫ్రెషర్ సూటిగా ప్రశ్నించాడు. "గ్రామీణ ప్రాంతాల యువతను, చిన్న పట్టణాల వారిని ప్రోత్సహిస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పి.. తీరా వందలాది మంది యువతను ఎలాంటి వివరణ లేకుండా రోడ్డున పడేయడం దారుణం. ఇది మీ మాటలకు, చేతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తోంది" అని విమర్శించాడు.

మండిపడుతున్న ఐటీ ఉద్యోగులు

ఈ పోస్ట్‌పై టెక్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఉద్యోగులు స్పందిస్తున్నారు. గూగుల్ (Google) కు చెందిన ఒక ఉద్యోగి స్పందిస్తూ.. "మిడ్-లెవల్ ఇంజనీర్లు తమ పొజిషన్లను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఎమోషనల్ అవ్వకుండా, కార్పొరేట్ గేమ్ ఆడాలి" అని కామెంట్ చేశాడు. దీనికి బదులిచ్చిన బాధితుడు.. "గేమ్ ఆడటానికి, ఉద్యోగం కోసం ఊరు వదిలి వచ్చాక కనీస సమాచారం లేకుండా మోసపోవడానికి చాలా తేడా ఉంది" అని రిప్లై ఇచ్చాడు.

పలు ఇతర ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వారు సైతం ఈ ఘటనపై మండిపడ్డారు. "300 మందినా? ఫ్రెషర్లను పావులుగా వాడుకుంటారా? ధైర్యంగా ఉండు" అని ఒకరు.. "ఇది చాలా దారుణం. 300 మంది కెరీర్‌ను ఎందుకు నాశనం చేశారో కంపెనీ వివరణ ఇవ్వాలి" అని మరొకరు డిమాండ్ చేశారు. కింది స్థాయి ఉద్యోగులు ఎప్పుడూ అంతర్గత రాజకీయాలకు బలవుతూనే ఉంటారని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement