త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Falta Repoll | “పుష్ప” తగ్గాడు: పోలింగ్‌కు ముందే తప్పుకున్న టీఎంసీ అభ్యర్థి

పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఫాల్టా (Falta) టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.

J

National | Published On May 19, 2026, 4.45 pm IST

Falta Repoll | “పుష్ప” తగ్గాడు: పోలింగ్‌కు ముందే తప్పుకున్న టీఎంసీ అభ్యర్థి
Advertisement

Falta Repoll | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 'నేను పుష్ప.. తగ్గేదేలే' అంటూ నిన్నటిదాకా డైలాగులు చెప్పిన ఫాల్టా (Falta) అసెంబ్లీ నియోజకవర్గ టీఎంసీ (TMC) అభ్యర్థి జహంగీర్ ఖాన్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. రీపోలింగ్‌కు సరిగ్గా రెండు రోజుల ముందు, మంగళవారం నాడు తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.

మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన జహంగీర్.. ఈ నిర్ణయం వెనుక ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీయే కారణమని చెప్పడం గమనార్హం.

ఫాల్టా అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం

"నేను ఫాల్టా ముద్దుబిడ్డను. ఇక్కడ శాంతి నెలకొల్పడం, అభివృద్ధి జరగాలన్నదే నా కోరిక. సోనార్ ఫాల్టా (Sonar Falta - బంగారు ఫాల్టా) అనేది నా కల. మా సీఎం సువేందు అధికారి ఫాల్టా అభివృద్ధి కోసం ఒక స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నారు. అందుకే నేను రీపోలింగ్ నుంచి తప్పుకుంటున్నాను" అని ప్రెస్ మీట్‌లో ఆయన స్పష్టం చేశారు. ఇది టీఎంసీ నిర్ణయమా లేక వ్యక్తిగతమా అని విలేకరులు ప్రశ్నించగా.. తాను కేవలం ఫాల్టా ప్రజల ప్రయోజనాల కోసమే పోటీ నుంచి తప్పుకున్నానని జహంగీర్ సమాధానమిచ్చారు.

సింగం vs పుష్ప.. ఇప్పుడు ఏమైంది?

ఎన్నికలకు ముందు జహంగీర్ ఖాన్.. ఎన్నికల అబ్జర్వర్, ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ పాల్ శర్మకు సవాల్ విసిరి వార్తల్లో నిలిచారు. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అయిన శర్మను సింగంతో పోలుస్తూ.. "ఆయన సింగం అయితే, నేను పుష్ప" అని జహంగీర్ డైలాగులు కొట్టారు. కానీ ఇప్పుడు వెనక్కి తగ్గడంతో సొంత పార్టీ నేత కునాల్ ఘోష్ సైతం స్పందిస్తూ.. "జహంగీర్ నిజంగా పుష్ప అయితే ఎందుకు తలొంచాడు?" అని సెటైర్లు వేశారు. సీఎం సువేందు అధికారి కూడా ప్రచారంలో "ఎక్కడున్నాడు మీ పుష్ప?" అంటూ ఎద్దేవా చేశారు.

ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే మళ్లీ ఎన్నికలు

మే 4వ తేదీన వెలువడిన ఫలితాల్లో బెంగాల్‌లో బీజేపీ ఏకంగా 207 స్థానాలు గెలుచుకుని, సువేందు అధికారి ఆధ్వర్యంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఫాల్టాలో ఈవీఎంల ట్యాంపరింగ్ (EVM tampering), బీజేపీ అభ్యర్థుల పేర్లు కనపడకుండా బటన్లపై వైట్ టేప్ వేయడంతో పాటు ఓటర్లను బెదిరించిన ఘటనలు వెలుగుచూడటంతో ఎలక్షన్ కమిషన్ (ECI) ఇక్కడ పోలింగ్‌ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తోంది. మే 21న ఇక్కడ రీపోలింగ్ జరగనుంది. కనీసం పోలింగ్ ఏజెంట్లు (Polling agents) కూడా దొరక్కపోవడంతోనే టీఎంసీ అభ్యర్థి పారిపోయాడని సీఎం సువేందు వ్యాఖ్యానించారు.

మాకు సంబంధం లేదు: టీఎంసీ

జహంగీర్ ఖాన్ నిర్ణయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. "ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయం. మే 4న ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఫాల్టాలో మా పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. 100 మందికి పైగా అరెస్టయ్యారు. పార్టీ ఆఫీసులను ధ్వంసం చేసి బలవంతంగా లాక్కుంటున్నారు. ఏజెన్సీలు, అధికారుల ఒత్తిడికి తలొగ్గి కొందరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. బెంగాల్ వ్యతిరేక బీజేపీపై మా పోరాటం కొనసాగుతుంది" అని టీఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.

మే 4 తర్వాత ఫాల్టాలో అభిషేక్ బెనర్జీ గానీ, మమతా బెనర్జీ గానీ ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయలేదు. 21 న ఉప ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఫాల్టా బైపోల్ (Falta bypoll) ఓట్ల లెక్కింపు మే 24న జరగనుంది.

Advertisement
Advertisement