త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Railway | తత్కాల్ టికెట్లకు కొత్త విధానం.. ఆగస్టు 1 నుంచి టోకెన్ వ్యవస్థ అమలు

Indian Railway | తత్కాల్ రైల్వే టికెట్ల కౌంటర్ బుకింగ్‌లో పారదర్శకత పెంచడంతో పాటు రద్దీని తగ్గించేందుకు పశ్చిమ మధ్య రైల్వే (West Central Railway) కీలక మార్పులు చేసింది. ఆగస్టు ఒక‌టి నుంచి తత్కాల్ కౌంటర్ బుకింగ్‌కు టోకెన్ విధానాన్ని అమలు చేయనుంది. అయితే, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పు లేదని, కేవలం కౌంటర్ల వద్ద ప్రయాణికులను క్యూలో అనుమతించే విధానంలోనే మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు.

P

National | Published On Jul 31, 2026, 3.30 pm IST

Indian Railway | తత్కాల్ టికెట్లకు కొత్త విధానం.. ఆగస్టు 1 నుంచి టోకెన్ వ్యవస్థ అమలు
Advertisement

Indian Railway | తత్కాల్ రైల్వే టికెట్ల కౌంటర్ బుకింగ్‌లో పారదర్శకత పెంచడంతో పాటు రద్దీని తగ్గించేందుకు పశ్చిమ మధ్య రైల్వే (West Central Railway) కీలక మార్పులు చేసింది. ఆగస్టు ఒక‌టి నుంచి తత్కాల్ కౌంటర్ బుకింగ్‌కు టోకెన్ విధానాన్ని అమలు చేయనుంది. అయితే, తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పు లేదని, కేవలం కౌంటర్ల వద్ద ప్రయాణికులను క్యూలో అనుమతించే విధానంలోనే మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ప్రయాణికులు నేరుగా కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సి వ‌చ్చేది. కొత్త విధానంలో ముందుగా టోకెన్లు జారీ చేసి, టోకెన్ సంఖ్య ఆధారంగా క్రమపద్ధతిలో కౌంటర్‌కు పిలిచి టికెట్లు బుక్ చేస్తారు. దీంతో కౌంటర్ల వద్ద తోపులాట, గందరగోళానికి అడ్డుకట్ట పడుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

టోకెన్ల జారీ సమయాలు ఇవే

కోటా డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సౌరభ్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీ తరగతి తత్కాల్ టికెట్ల కోసం ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు టోకెన్లు జారీ చేస్తారు. నాన్-ఏసీ టికెట్ల కోసం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు టోకెన్లు ఇస్తారు. ప్రతి రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఏసీ తత్కాల్‌కు ప‌ది టోకెన్లు, నాన్-ఏసీ తత్కాల్‌కు 15 టోకెన్లు మాత్రమే జారీ చేస్తారు. అయితే, టికెట్ బుకింగ్ సమయాలు యథావిధిగానే కొనసాగుతాయి. ప్రయాణానికి ఒక రోజు ముందు ఉదయం 10 గంటలకు ఏసీ, ఉదయం 11 గంటలకు నాన్-ఏసీ తత్కాల్ బుకింగ్ ప్రారంభమవుతుంది. టోకెన్ల పంపిణీలో రెండు విభాగాల‌ను ప్ర‌వేశ‌పెట్టింది రైల్వే. ఏ కేటగిరీ కింద తమ కోసం, కుటుంబ సభ్యుల కోసం టికెట్లు బుక్ చేసుకునే వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది. బీ కేట‌గిరిలో మిగతా ప్రయాణికులందరికీ కేటగిరీ ఏ బుకింగ్ పూర్త‌య్యాక తర్వాత అవకాశం కల్పిస్తారు. బీ కేటగిరీ కింద టోకెన్ పొందాలంటే ఆధార్ లేదా రైల్వే గుర్తించిన చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలి. ఏ కేటగిరీలో కుటుంబ సభ్యుల కోసం టికెట్ బుక్ చేసే వారు తమ ఫొటో ఐడీతో పాటు బంధుత్వాన్ని నిరూపించే కుటుంబ సభ్యుడి చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని కూడా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

బదిలీకి నో ఛాన్స్‌..

జారీ చేసిన టోకెన్‌ను ఇతరులకు బదిలీ చేయడం పూర్తిగా నిషేధమని అధికారులు స్పష్టం చేశారు. టోకెన్ ఎవరిపేరుతో జారీ చేస్తారో వారికి మాత్రమే టికెట్ ఇస్తారు. ప్రయాణికులు నిర్ణీత సమయంలో రిజర్వేషన్ కేంద్రానికి చేరుకుని చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డుతో రావాలని సూచించారు. కొత్త విధానం ద్వారా దళారులు, నకిలీ ఏజెంట్లు, బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. టోకెన్ పొందేందుకు ఒరిజినల్ గుర్తింపు పత్రం తప్పనిసరి చేశారు. టోకెన్‌పై ప్రయాణికుడి పేరు, వివరాలు ముద్రించబడడంతో ఇతరులు దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు. టోకెన్ పొందిన తర్వాత ప్రయాణికులు కౌంటర్ సమీపంలో వేచి ఉండవచ్చు. టోకెన్ సంఖ్య ఆధారంగానే కౌంటర్‌కు పిలుస్తారు.

ఆధార్ వెరిఫికేష‌న్..

కొత్త విధానం వల్ల రిజర్వేషన్ కేంద్రాల వద్ద పొడవైన క్యూలు తగ్గడంతో పాటు క్రమశిక్షణ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే తత్కాల్ టికెట్ పొందాలనుకునే వారు టోకెన్ల జారీ సమయాల్లోనే రిజర్వేషన్ కేంద్రాలకు చేరుకోవడం తప్పనిసరి కానుంది. పీఆర్‌ఎస్ (PRS) కౌంటర్లతో పాటు తత్కాల్ టికెట్లను ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్, యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే, ఆన్‌లైన్‌లో తత్కాల్ టికెట్ బుక్ చేసేందుకు ఆధార్ వెరిఫికేష‌న్ పూర్త‌య్యాక వినియోగ‌దారుల‌కే అవ‌కాశం ఉంటుంది.

Advertisement
Advertisement