త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | పెట్రోల్‌లో ఇథ‌నాల్ శాతాన్ని క‌చ్చితంగా వెల్ల‌డించాలి.. సుప్రీంకోర్టు కీల‌క నిర్ణ‌యం

Supreme Court | దేశ‌వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని (Ethanol Percentage) తప్పనిసరిగా వెల్లడించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) తోసిపుచ్చింది.

D

National | Published On Aug 31, 2026, 1.06 pm IST

Supreme Court | పెట్రోల్‌లో ఇథ‌నాల్ శాతాన్ని క‌చ్చితంగా వెల్ల‌డించాలి.. సుప్రీంకోర్టు కీల‌క నిర్ణ‌యం
Advertisement

Supreme Court | త్రినేత్ర‌.న్యూస్ : దేశ‌వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని (Ethanol Percentage) తప్పనిసరిగా వెల్లడించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) తోసిపుచ్చింది. ఈ పిటిష‌న్‌ను విచారించేందుకు జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం నిరాక‌రించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద (నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు) ఈ పిటిషన్‌ను స్వీకరించలేమని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ అంశంపై సంబంధిత రాష్ట్ర‌ హైకోర్టును ఆశ్ర‌యించేందుకు పిటిష‌న‌ర్‌కు వెసులుబాటు క‌ల్పించింది.

దేశ‌వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే పెట్రోల్‌లో ఇథనాల్ శాతాన్ని (Ethanol Percentage) తప్పనిసరిగా వెల్లడించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి సుప్రీంకోర్టులో ప్రజా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. పెట్రోల్ పంపుల్లోని ప్ర‌తి డిస్పెన్సింగ్ నాజిల్స్‌ (Dispensing Nozzles)పైనా పెట్రోల్‌లో క‌లిపిన ఇథ‌నాల్ క‌చ్చిత‌మైన శాతాన్ని స్ప‌ష్టంగా ప్ర‌ద‌ర్శించాల‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. అంతేకాదు, వినియోగదారులకు ఇచ్చే ప్రతి ఫ్యూయల్ ఇన్‌వాయిస్‌పై కూడా ఇథనాల్ శాతాన్ని స్పష్టంగా ముద్రించేలా కేంద్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేయాల‌ని కోరారు. తయారీదారు, మోడల్, ఇంజిన్ రకం, తయారైన సంవత్సరం ఆధారంగా ఏ వాహనానికి ఏ ఇథనాల్ మిశ్రమం సరిపోతుందో తెలిపే అధికారిక, పబ్లిక్ వెహికల్ కంప్యాటిబిలిటీ డేటాబేస్‌ను నిర్దిష్ట కాలపరిమితిలోగా రూపొందించి ప్రచురించాలని కోరారు.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఈ20 ఇథ‌నాల్ వాడ‌కంపై అనేక ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా 2023 కంటే ముందు తయారైన పాత వాహనాల ఇంజన్లపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంద‌ని, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ నేప‌థ్యంలో E20 ఇంధన వాడకం వల్ల ప్రస్తుత వాహనాలపై పడే ప్రభావం, ఇంధన సామర్థ్యం (Fuel Efficiency), నిర్వహణ ఖర్చులు, వారంటీ, ఇన్సూరెన్స్ వంటి అంశాలపై అధ్యయనం చేయడానికి ఒక స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఇథనాల్ ఉత్పత్తి వల్ల ప‌ర్యావ‌ర‌ణం, నీటి వినియోగం, ఆహార భ‌ద్ర‌త‌పై త‌లెత్తే ఆందోళ‌న‌ల‌పై ఈ క‌మిటీ నివేదిక ఇచ్చేలా ఆదేశించాల‌ని పిటిష‌న‌ర్ కోరారు.

ఈ పిటిష‌న్‌పై ఇవాళ సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం విచారించింది. విచార‌ణ‌కు కేంద్రం త‌ర‌ఫున హాజ‌రైన అటార్నీ జ‌న‌ర‌ల్ ఆర్ వెంక‌ట‌ర‌మ‌ణి ఈ పిటిష‌న్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది కేవలం ఒక ప్రాక్సీ దావా అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌భుత్వ‌ ఇథ‌నాల్ పెట్రోల్ విధానాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌ను సుప్రీంకోర్టు ఇప్ప‌టికే కొట్టివేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. అయితే, తాను ప్రభుత్వ E20 విధానాన్ని ప్రశ్నించడం లేదని.. వినియోగదారులు సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఇథనాల్ పరిమాణాన్ని వెల్లడించాలని మాత్రమే కోరుతున్నానని గోస్వామి స్పష్టం చేశారు. తాము కొనుగోలు చేస్తున్న పెట్రోల్‌లోని ఇథనాల్ శాతాన్ని తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉందని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం.. ఆర్టికల్ 32 కింద ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు నిరాక‌రించింది. ఈ అంశాన్ని నేరుగా ఇక్క‌డ కాకుండా హైకోర్టులోనే లేవనెత్తాలని పిటిషనర్‌కు సూచించింది.

Also Read..

రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ న‌మోదు

సీడ్ గణేశుడిని పూజించండి.. మీ ఇంట్లోనే మొక్కై ఆశీర్వదిస్తాడు : చిరంజీవి

ఢిల్లీలో మ‌రో నిర్భ‌య ఘ‌ట‌న‌.. క‌దిలే బ‌స్సులో బాలిక‌పై సామూహిక‌ అత్యాచారం

Advertisement
Advertisement