త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

One Nation-One Election | ఏక‌కాలంలో ఎన్నిక‌లు సాధ్యం కావు

One Nation-One Election | ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ బిల్లును పార్లమెంట్‌ను ఆమోదించినా 2029లో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పీ చిదంబరం స్పష్టం చేశారు. కేంద్రం తెస్తున్న బిల్లు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు.

P

National | Published On Aug 25, 2026, 1.35 pm IST

One Nation-One Election | ఏక‌కాలంలో ఎన్నిక‌లు సాధ్యం కావు
Advertisement
  • వ‌న్ నేష‌న్‌.. వ‌న్ ఎల‌క్ష‌న్ బిల్లు ప్ర‌జాస్వామ్యానికి విరుద్ధం
  • జేపీసీ చైర్మ‌న్ వ్యాఖ్య‌ల‌కు విరుద్ధంగా బిల్లు నిబంధ‌న‌లు
  • మాజీ ఆర్థిక‌మంత్రి పీ చిదంబ‌రం

One Nation-One Election | ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ బిల్లును పార్లమెంట్‌ను ఆమోదించినా 2029లో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పీ చిదంబరం స్పష్టం చేశారు. కేంద్రం తెస్తున్న బిల్లు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఎదుట తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం లభించడంపై చిదంబరం మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. జేపీసీ ఎదుట తాను సమర్పించిన ఆధారాలను వెల్లడించే అవకాశం లేదని, తన వాదనలో ప్రధానంగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఈ బిల్లు ఉల్లంఘిస్తోందనే అంశాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు.

2029లో ఎలా సాధ్యం..

2029లోనే ఏకకాల ఎన్నికలు నిర్వహించవచ్చన్న జేపీసీ చైర్మ‌న్ వ్యాఖ్యలను చిదంబరం తప్పుబట్టారు. ఆయన అభిప్రాయం బిల్లులోని నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. బిల్లు ఆమోదం పొందినా.. అందులో పేర్కొన్న ‘నిర్దిష్ట తేదీ’ సాధారణ ఎన్నికల త‌ర్వాతనే ఉండే అవకాశం ఉందని వివరించారు. త‌ర్వాతి సాధారణ ఎన్నికలు 2029లో జరగనున్నందున అదే ఏడాది లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చిదంబరం పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందే అవకాశాలు సైతం చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ప్రచారం చేపడతాయని చిదంబరం తెలిపారు. సమాఖ్య నిర్మాణం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ ప్రతిపాదన రాజ్యాంగపరంగా తీవ్రంగా తప్పుదోవ పట్టించే విధంగా ఉందని మాజీ ఆర్థిక‌మంత్రి అభిప్రాయపడ్డారు.

స్పష్టమైన నిబంధనలు ఉండాలి

‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ బిల్లుపై పరిశీలన జరుపుతున్న జేపీసీకి ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు ప‌లువురు స‌మ‌ర్పించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాల్సిన పరిస్థితులకు స్పష్టమైన, చట్టపరంగా నిర్ధారించగల కారణాలను నిర్దేశించాలని అవి సూచించినట్లు తెలుస్తోంది. వాయిదాకు కూడా నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని పేర్కొన్నాయి. ఇదిలా ఉండ‌గా.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న లక్ష్యంతో కేంద్రం 2024లో రాజ్యాంగ (129వ సవరణ) బిల్లును తీసుకొచ్చింది. దీనికి అనుబంధంగా కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లును సైతం బీజేపీ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్లులను 2024 డిసెంబర్‌ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లుల‌ను లోతుగా పరిశీలించేందుకు జేపీసీకి పంపారు. ఈ అంశంపై జేపీసీ ఇప్పటికే పలు పర్యటనలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశాలు నిర్వహించింది. తాజాగా జూలైలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో కమిటీ అధ్యయన పర్యటన చేపట్టింది.

Advertisement
Advertisement