త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Aravalli Range | నా రిటైర్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా..? ఆరావళిపై హైప‌వ‌ర్ కమిటీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్

Aravalli Range | ఆరావళి పర్వత శ్రేణి (Aravalli Range) పరిధి, నిర్వచనానికి సంబంధించిన విధివిధానాల‌పై తుది నివేదిక స‌మ‌ర్పించేందుకు హైప‌వ‌ర్ క‌మిటీ కోరిన ఆరు నెల‌ల గ‌డువు పొడిగింపును సుప్రీంకోర్టు (Supreme Court) తిర‌స్క‌రించింది. రెండు నెల‌ల్లోగా తుది నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. లేనిప‌క్షంలో క‌మిటీని పూర్తిగా రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది.

D

National | Published On Sep 7, 2026, 3.13 pm IST

Aravalli Range | నా రిటైర్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా..? ఆరావళిపై హైప‌వ‌ర్ కమిటీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Advertisement

Aravalli Range | త్రినేత్ర‌.న్యూస్ : ఆరావళి పర్వత శ్రేణి (Aravalli Range) పరిధి, నిర్వచనానికి సంబంధించిన విధివిధానాల‌పై తుది నివేదిక స‌మ‌ర్పించేందుకు హైప‌వ‌ర్ క‌మిటీ కోరిన ఆరు నెల‌ల గ‌డువు పొడిగింపును సుప్రీంకోర్టు (Supreme Court) తిర‌స్క‌రించింది. న‌వంబ‌ర్ 30 నాటికి నివేదిక‌ను స‌మ‌ర్పించాల‌ని డెడ్‌లైన్ విధించింది. భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌ (Chief Justice of India Surya Kant), జ‌స్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జ‌స్టిస్ వి.మోహ‌న‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఒక‌వేళ గ‌డువులోగా తుది నివేదిక స‌మ‌ర్పించ‌డంలో విఫ‌ల‌మైతే క‌మిటీని పూర్తిగా రద్దు చేసి కొత్త కమిటీ ఏర్పాటు చేస్తామని హెచ్చరించింది.

ప్రపంచంలోనే పురాతనమైన పర్వత శ్రేణులుగా పిలిచే ఆరావళి (Aravalli Range) ప‌ర్వత శ్రేణి పరిధి, నిర్వచనంపై అస్ప‌ష్ట‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. గ‌తేడాది అక్టోబర్‌ 13న కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఆరావళి పర్వతాలకు కొత్తగా 100 మీటర్ల నిర్వచనాన్ని సుప్రీంకోర్టు వద్ద ప్రతిపాదించింది. మంత్రిత్వశాఖ అందచేసిన 100 మీటర్ల నిబంధన సిఫార్సును సుప్రీంకోర్టు గ‌త‌ నవంబర్‌ 20న ఆమోదించింది. అయితే, సుప్రీం తీర్పుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆరావళిపై తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ న్యాయవాది, పర్యావరణ కార్యకర్త సీజేఐకి లేఖ రాశారు.

అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీ..

దీంతో ఆరావ‌ళిపై నెలకొన్న అస్పష్టతలను తొలగించేందుకు సుప్రీంకోర్టు అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించింది. ఢిల్లీ నుంచి గుజరాత్‌ వరకూ విస్తరించిన ఈ పర్వత శ్రేణిని రక్షించుకునేందుకు హద్దులు నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్న పరిస్థితుల్లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఐసీఎఫ్‌ఆర్‌ఈ) డైరెక్టర్‌ జనరల్‌ కాంచన్‌ దేవి నేతృత్వంలో కమిటీని సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది జూన్‌లో ప్రకటించింది. ఈ కమిటీ ఆగస్టు 31వ తేదీకల్లా నివేదికను అందజేయాల్సిందిగా ఆదేశించింది. సుప్రీం కోర్టు విధించిన గడువు పూర్త‌వ‌డంతో.. ఆ అంశంపై సమగ్రంగా, భవిష్యత్తులో కూడా సమర్థించగలిగేలా నివేదిక సిద్ధం చేయాలంటే మరింత సమయం అవసరమని కమిటీ ఇటీవలే కోర్టును కోరింది.

నా రిటైర్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా..?

అందులో భాగంగా తుది నివేదిక సమర్పించేందుకు మరో ఆరు నెలల (వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కూ) గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. క‌మిటీ విజ్ఞ‌ప్తిపై సీజేఐ తీవ్రంగా స్పందించారు. "నా రిటైర్మెంట్ కోసం వేచి చూస్తున్నారా..?" అంటూ చీఫ్ జ‌స్టిస్ తీవ్ర‌ అసహనం వ్యక్తం చేస్తూ గడువు పొడిగింపు పిటిషన్‌ను తిరస్కరించారు. అవసరమైతే రాత్రింబవళ్లు పనిచేసి గడువులోగా నివేదిక ఇవ్వాలని స్ప‌ష్టం చేశారు. రెండు నెలల్లో నివేదిక సమర్పించలేకపోతే ప్రస్తుత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని సీజేఐ జ‌స్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు.

ఆరావ‌ళిపై వివాదం..

ప్రపంచంలోనే పురాతనమైన పర్వత శ్రేణులుగా పిలిచే ఆరావళి (Aravalli Range) ప‌ర్వ‌తాలు.. గుజరాత్‌ నుంచి మొదలై రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్‌ వరకూ విస్తరించాయి. అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు, ప్రసిద్ధ కోటలు, దేవాలయాలతో పాటు జింక్‌, రాగి, క్వార్జ్‌, సీసం, పాలరాయి, రాక్‌సల్ఫేట్‌ వంటి అరుదైన ఖనిజాలకు ఈ పర్వతాలు పెట్టింది పేరు. అయితే, దేశానికి వాయవ్య ప్రాంతంలో ఉన్న ఈ పర్వత శ్రేణుల్లో గ‌డిచిన కొన్నేళ్లుగా జరుగుతున్న మైనింగ్‌ (Mining), మానవ కార్యకలాపాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మైనింగ్ కార్య‌కలాపాల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కేంద్రానికి ఎన్ని విజ్ఞ‌ప్తులు వ‌చ్చిన‌ప్ప‌టికీ అధికార యంత్రాంగం ప‌ట్టించుకోలేదు.

ఈ క్రమంలో ఆరావళి పరిధిని మారుస్తూ కేంద్రం ఆధీనంలోని పర్యావరణ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు ఓ నివేదికను ఇచ్చింది. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న పర్వతాలను ఆరావళి పరిధి నుంచి మినహాయించాలని, మైనింగ్‌కు అవకాశం ఇవ్వాలని కేంద్రం అందులో పేర్కొంది. దీనికి ఆమోదం తెలిపిన సుప్రీం.. సైంటిఫిక్‌ మ్యాపింగ్‌ పూర్తయ్యే వరకూ కొత్త లీజులు ఇవ్వొద్దని వెల్లడించింది. అయితే, సుప్రీం తీర్పుతో ఆరావళి పర్వత శ్రేణుల్లో 90 శాతం పర్వతాలు రక్షణను కోల్పోతాయని, మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగి పర్యావరణ విధ్వంసం జరుగుతుందని, థార్‌ ఎడారి ఢిల్లీ వరకు విస్తరించి భూగర్భ జలాల రీచార్జ్‌ నిలిచిపోవడంతోపాటు జీవ వైవిధ్యం దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Also Read..

మంత్రి స‌మ‌క్షంలోనే.. మ‌రాఠీ మాట్లాడేందుకు నిరాక‌రించిన బాలీవుడ్ స్టార్

కొత్త శిఖరాలకు భార‌త్‌-ఫ్రాన్స్ సంబంధాలు : ప్ర‌ధాని మోదీ

పెట్రోల్‌ను దాటిన ప్రత్యామ్నాయ ఇంధనాలు.. ఆగస్టులో రికార్డు స్థాయికి ఆటో మార్కెట్..

Advertisement
Advertisement