త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | పాల‌మూరుకు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | పాల‌మూరు-రంగారెడ్డి, గౌర‌వెల్లి, సీత‌మ్మ సాగ‌ర్‌, డిండి ప్రాజెక్టుల‌కు స‌త్వ‌ర‌మే ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

S

Telangana | Published On Aug 5, 2026, 4.57 pm IST

CM Revanth Reddy | పాల‌మూరుకు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : పాల‌మూరు-రంగారెడ్డి, గౌర‌వెల్లి, సీత‌మ్మ సాగ‌ర్‌, డిండి ప్రాజెక్టుల‌కు స‌త్వ‌ర‌మే ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పార్ల‌మెంట్‌లో మంగ‌ళ‌వారం స‌మావేశ‌మ‌య్యారు.

ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో ఈ ప్రాజెక్టుల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు వెంట‌నే మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం పాల‌మూరు ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండి ఎత్తిపోత‌ల‌పై రూ.3,187 కోట్లు, సీత‌మ్మ సాగ‌ర్‌పై రూ.1,835 కోట్లు, గౌర‌వెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్ల నిధుల‌ను వ్య‌యం చేసింద‌ని కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివ‌రించారు.

అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డంతో ప‌నులు నిలిచిపోయాయ‌ని, ఫ‌లితంగా ప్రాజెక్టుల వ్య‌యం పెరుగుతోంద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. సుప్రీంకోర్టు తీర్పు సానుకూల‌త నేప‌థ్యంలో ప్రాజెక్టుల‌కు తక్ష‌ణ‌మే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

స‌మావేశంలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, వేం న‌రేంద‌ర్ రెడ్డి, రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, గ‌డ్డం వంశీకృష్ణ‌, ఎం.అనిల్ యాదవ్‌, డాక్ట‌ర్ క‌డియం కావ్య‌, ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి, నీటి పారుద‌ల శాఖ స‌ల‌హాదారు ఆదిత్య‌నాధ్ దాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement