త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Railways land | 42 నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియాలతో సమానమైన రైల్వే భూమి మాయం.. ఐదేళ్ల‌లో భారీగా పెరిగిన ఆక్ర‌మ‌ణ‌లు..!

Railways land | ఇండియ‌న్ రైల్వేస్ (Indian Railways)కు చెందిన వేల ఎక‌రాల భూమి క‌బ్జాకు గురైంది. మొత్తం 4.99 లక్షల హెక్టార్ల భూమిలో 0.21 శాతం క‌బ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ ఆక్ర‌మ‌ణ‌లు ఏ మాత్రం త‌గ్గ‌క‌పోగా గ‌త ఐదేళ్ల‌లో విప‌రీతంగా పెరిగాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 810.31 హెక్టార్లుగా ఉన్న ఆక్రమణలు గ‌త ఐదేళ్ల‌లో (2024-25 నాటికి) 32 శాతం పెరిగి 1,068.54 హెక్టార్లకు చేరాయి.

D

National | Published On Jul 14, 2026, 10.02 am IST

Railways land | 42 నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియాలతో సమానమైన రైల్వే భూమి మాయం.. ఐదేళ్ల‌లో భారీగా పెరిగిన ఆక్ర‌మ‌ణ‌లు..!
Advertisement

Railways land | త్రినేత్ర‌.న్యూస్ : ప్రభుత్వానికి చెందిన భూములు ఆక్ర‌మ‌ణ‌లకు గుర‌వుతుండ‌టం మ‌నం చూస్తూ ఉంటాం. కొంద‌రు చెరువులు, రోడ్లు, అసైన్డ్ భూములను అక్రమంగా ఆక్రమించుకుంటుంటారు. దౌర్జన్యంగానో, మోసపూరితంగానో లేదా నకిలీ పత్రాలను సృష్టించి వాటిని సొంతం చేసుకుంటుంటారు. అయితే, తాజాగా ఇండియ‌న్ రైల్వేస్‌లో భూ ఆక్ర‌మ‌ణ‌ల స‌మ‌స్య తీవ్రంగా ఉండ‌టం షాక్‌కు గురి చేస్తోంది. రైల్వేకి చెందిన వేల ఎక‌రాల భూమి మాయ‌మ‌వ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ఇండియ‌న్ రైల్వేస్ (Indian Railways) ప్ర‌స్తుతం భారీ భూ ఆక్ర‌మ‌ణ స‌మ‌స్య‌ల‌తో కొట్టుమిట్టాడుతోంది. స‌మ‌స్య ఎంత తీవ్రంగా ఉందంటే క‌బ్జాకు గురైన భూమిలో ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియం లాంటివి (Narendra Modi cricket stadiums) ఏకంగా 42 నిర్మించవచ్చు. లేదంటే ఆ భూమిలో దాదాపు 1,496 ఫిఫా (FIFA) స్టాండర్డ్ ఫుట్‌బాల్ మైదానాలను ఏర్పాటు చేయవచ్చట. సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా ఈ విష‌యం వెల్ల‌డైంది.

దేశవ్యాప్తంగా రైల్వే యాజమాన్యంలో మొత్తం 4.99 లక్షల హెక్టార్ల భూమి ఉంది. మార్చి 2025 నాటికి 1,068.54 హెక్టార్ల (సుమారు 2,639 ఎకరాలు) రైల్వే భూమి ఆక్రమణకు గురైంది. మొత్తం భూమిలో ఆక్ర‌మ‌ణ‌కు గురైన భూమి 0.21 శాతానికి స‌మానం. మ‌రో విష‌యం ఏంటంటే.. ఈ ఆక్ర‌మ‌ణ‌లు ఏ మాత్రం త‌గ్గ‌క‌పోగా గ‌త ఐదేళ్ల‌లో విప‌రీతంగా పెరిగాయ‌ట‌. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 810.31 హెక్టార్లుగా ఉన్న ఆక్రమణలు గ‌త ఐదేళ్ల‌లో (2024-25 నాటికి) 32 శాతం పెరిగి 1,068.54 హెక్టార్లకు చేరాయి. ఈ ఐదేళ్ల కాలంలో 2021-22లో ఆక్రమణల విస్తీర్ణం 782.81 హెక్టార్లకు స్వల్పంగా తగ్గినప్పటికీ.. ఆ తర్వాతి ఏడాదే రికార్డు స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా 2023-24 నాటికి ఏకంగా 1,078.55 హెక్టార్లకు చేరింది. కేవలం ఒక్క సంవత్సరంలోనే దాదాపు 268 హెక్టార్ల భూమి అదనంగా ఆక్రమణలకు గురికావడం గమనార్హం.

అదే సమయంలో భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మాత్రం చాలా పరిమితంగానే సాగుతున్న‌ట్లు గణాంకాలు చెబుతున్నాయి. వెయ్యి హెక్టార్ల‌కు పైగా భూమి ఆక్ర‌మ‌ణ‌దారుల‌ చేతుల్లోకి వెళ్లిపోగా.. అందులో కేవ‌లం 98.02 హెక్టార్ల భూమిని మాత్ర‌మే రైల్వే బోర్డు విడిపించ‌గ‌లిగింది. స్వాధీనం చేసుకున్న భూములను మల్టీ ట్రాకింగ్ పనులు, వర్క్‌షాప్‌ల నిర్మాణం, ప్యాసింజర్ లేదా ఫ్రైట్ టెర్మినల్స్ వంటి మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం రైల్వే వినియోగిస్తోంది. మ‌రోవైపు ప్రస్తుతానికి అవసరం లేదు అని అనుకున్న ఖాళీ స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేయడానికి రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (RLDA)కి అప్పగిస్తున్నారు. కొత్తగా ఆక్రమణలు జరగకుండా నిరోధించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ శాటిలైట్ మ్యాపింగ్, డ్రోన్ సర్వేలు, భూ రికార్డుల డిజిటలైజేషన్ వంటి చర్యలు చేపడుతోంది.

Advertisement
Advertisement