త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | తప్పులు ఎన్‌టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభ‌విస్తున్నారు.. మోదీ ప్ర‌భుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్‌

Rahul Gandhi | UGC-నెట్​లో మూడు పరీక్షలను తిరిగి నిర్వహించాలన్న నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణ‌యంపై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎంతో కాలంగా క‌ష్ట‌ప‌డి చ‌దివి, దరఖాస్తులు నింపి, ఫీజులు చెల్లించి, డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టుకుని ప‌రీక్షా కేంద్రాల‌కు వెళ్లిన వేలాది మంది విద్యార్థుల స‌మయాన్ని, భ‌విష్య‌త్తును ఎన్‌టీఏ (NTA) నాశ‌నం చేస్తోంద‌ని ఆరోపించారు.

D

National | Published On Aug 17, 2026, 12.47 pm IST

Rahul Gandhi | తప్పులు ఎన్‌టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభ‌విస్తున్నారు.. మోదీ ప్ర‌భుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్‌
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర‌.న్యూస్ : UGC-నెట్​లో మూడు పరీక్షలను తిరిగి నిర్వహించాలన్న నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణ‌యంపై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తప్పులు ఎన్‌టీఏ చేస్తే.. దానికి శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవించాల్సి వస్తోందని అన్నారు. పరీక్ష జరిగి దాదాపు రెండు నెలల తర్వాత NTA ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

ఎంతో కాలంగా కష్టపడి చదివి, డబ్బులు ఖర్చు పెట్టుకుని పరీక్షా కేంద్రాలకు వెళ్లిన వేలాది మంది విద్యార్థుల సమయాన్ని, భవిష్యత్తును ఎన్‌టీఏ నాశనం చేస్తోందని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, ఎన్‌టీఏ తీరును త‌ప్పుబ‌డుతూ ఎక్స్ వేదిక‌గా రాహుల్ ట్వీట్ పెట్టారు. "మోదీ గారూ.. మీ ఎన్‌టీఏ ఇప్పుడు ఏం చేసిందో చూడండి. సోషియాలజీ, ఇంగ్లీష్, కామర్స్ సబ్జెక్టులకు సంబంధించిన యూజీసీ-నెట్ పరీక్షలు జూన్ 22 నుంచి 30 మధ్య జరిగాయి. అయితే, తప్పులతో కూడిన ప్రశ్నపత్రాలు, పాత ప్రశ్నలనే పునరావృతం చేసిందనే కారణంతో దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూడు పరీక్షలనూ రద్దు చేసింది. ఎంతో కాలంగా క‌ష్ట‌ప‌డి చ‌దివి, దరఖాస్తులు నింపి, ఫీజులు చెల్లించి, డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టుకుని ప‌రీక్షా కేంద్రాల‌కు వెళ్లిన వేలాది మంది విద్యార్థుల స‌మయాన్ని, భ‌విష్య‌త్తును ఎన్‌టీఏ నాశ‌నం చేస్తోంది. తప్పు NTA చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవించాల్సి వస్తోంది" అని రాహుల్ కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇదో దోపిడీ యంత్రం..

దేశంలోని విద్యా వ్యవస్థ ఇప్పుడు దోపిడీ యంత్రం (Extraction Machine)గా మారిపోయిందని రాహుల్‌ ఆరోపించారు. "ఇదే విష‌యాన్ని నేను కోటా, డెహ్రాడూన్‌, ప్రయాగ్‌రాజ్‌లో చెప్పాను. ఇక‌పై కూడా చెబుతూనే ఉంటాను. ఇది విద్యా వ్య‌వ‌స్థ కాదు. ఒక దోపిడీ యంత్రం. ఇది మీ డ‌బ్బును, మీ స‌మ‌యాన్ని, మీ మాన‌సిక ఆరోగ్యాన్ని, మీ ఆత్మ‌విశ్వాసాన్ని దోచుకుంటోంది. కానీ తిరిగి ఏమీ ఇవ్వ‌దు. క‌నీసం ఉద్యోగం కూడా ఇవ్వ‌దు. పరీక్షకు ముందే ఈ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయా..? అనే అసలు ప్రశ్నకు మాత్రం ఎన్‌టీఏ ఇప్పటికీ సమాధానం చెప్పడం లేదు. మోదీ ప్రభుత్వంలోని ఇతర విభాగాల మాదిరిగానే NTA కూడా ఎప్పుడూ తమదే తప్పని ఒప్పుకోదు. ఇతర పరీక్షా పత్రాల విషయంలో జరిగినట్లుగానే దీనికి కూడా జవాబుదారీత‌నం ఉండ‌ద‌ని నాకు తెలుసు.

స‌మ‌స్య విద్యార్థుల్లో లేదు..

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా మొద‌టి అడుగు మాత్ర‌మే. అంత‌టితో అంతా అయిపోలేదు. ఎన్‌టీఏ నాయ‌క‌త్వం కూడా దీనికి బాధ్య‌త వ‌హించాలి. సెప్టెంబ‌ర్‌లో ప‌రీక్ష రాసే ప్ర‌తీ విద్యార్థికి నేను చెప్పేది ఒక్క‌టే.. స‌మ‌స్య మీలో లేదు. ప‌రీక్షలను సరిగ్గా నిర్వహించలేని వ్యవస్థను మోదీ ప్రభుత్వం తయారు చేసి.. చివ‌రికి ప‌రీక్ష రాసే విద్యార్థుల‌నే నిందిస్తోంది. దీనికి ప్ర‌ధాని మోదీ స‌మాధానం చెప్పాలి. అప్ప‌టి వ‌ర‌కూ మేము మా పోరాటం ఆప‌బోము" అని రాహుల్ స్ప‌ష్టం చేశారు.

రీ ఎగ్జామ్స్‌..

జూన్ 22 నుంచి 30 మధ్య జరిగిన UGC-NET పరీక్షల్లో ఇంగ్లీష్ (English), కామర్స్ (Commerce), సోషియాలజీ (Sociology) ప్రశ్నపత్రాల్లో తీవ్రమైన తప్పులు దొర్లాయ‌ని ఫిర్యాదులు వ‌చ్చాయి. ఆయా పేపర్లలో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్‌, తప్పుడు అనువాదాలు, తప్పుడు ప్రశ్నలు ఉండటమే కాకుండా పాత పరీక్షల్లోని ప్రశ్నలనే మళ్లీ యథాతథంగా ఇచ్చారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ఎన్‌టీఏ నిపుణుల కమిటీ ప‌రీక్ష జ‌రిగిన రెండు నెల‌ల త‌ర్వాత ఆ మూడు సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేసి తిరిగి పునఃపరీక్షలు (Re-exams) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేర‌కు ప‌రీక్ష‌ల తేదీల‌ను కూడా ఎన్‌టీఏ ప్ర‌క‌టించింది.

వచ్చే నెల 9న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంగ్లీష్‌, అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు కామర్స్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. సోషియాలజీ పరీక్షను సెప్టెంబరు 10న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. అభ్యర్థుల నుంచి ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబోమని NTA స్పష్టం చేసింది.

Also Read..

ఎల‌క్ట్రిక్ ఆటోలు న‌డుప‌నున్న ఆర్టీసీ.. అది దుష్ప్ర‌చార‌మేన‌న్న మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది.. ప్రచారం కాంగ్రెస్‌ది: హ‌రీశ్ రావు

ఈ రిక్షా బ్యాట‌రీ పేలి భారీ అగ్నిప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

Advertisement
Advertisement