త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Private Schools | అడ్డ‌గోలుగా వ‌సూలు చేసిన అధిక ఫీజుల‌ను తిరిగి ఇచ్చేయండి.. ప్రైవేట్ పాఠ‌శాల‌ల‌కు ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

Private Schools | ప్రైవేట్ పాఠ‌శాల‌ల (Private Schools) ఫీజుల దోపిడీపై (Fee Hikes) పంజాబ్ ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. వార్షిక ఫీజుల పెంపును గ‌రిష్టంగా 5 శాతానికి ప‌రిమితం చేసింది. మూడేళ్లుగా 5 శాతానికి అద‌నంగా వ‌సూలు చేసిన ఫీజుల‌ను త‌ల్లిదండ్రుల‌కు తిరిగి చెల్లించాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు భ‌గ‌వంత్ మాన్ (CM Bhagwant Mann) ప్ర‌భుత్వం స‌రికొత్త చ‌ట్టాన్ని అమ‌ల్లోకి తెచ్చింది.

D

National | Published On Jul 14, 2026, 4.07 pm IST

Private Schools | అడ్డ‌గోలుగా వ‌సూలు చేసిన అధిక ఫీజుల‌ను తిరిగి ఇచ్చేయండి.. ప్రైవేట్ పాఠ‌శాల‌ల‌కు ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు
Advertisement

Private Schools | ప్రైవేట్ పాఠ‌శాల‌ల (Private Schools) ఫీజుల దోపిడీపై (Fee Hikes) పంజాబ్ ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపించింది. వార్షిక ఫీజుల పెంపును గ‌రిష్టంగా 5 శాతానికి ప‌రిమితం చేసింది. ఈ మేర‌కు భ‌గ‌వంత్ మాన్ ప్ర‌భుత్వం కొత్త చ‌ట్టాన్ని అమ‌ల్లోకి తెచ్చింది. ఫీజు నియంత్ర‌ణ‌కు సంబంధించి తీసుకొచ్చిన సరికొత్త చట్టం 'పంజాబ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీ ఆఫ్ అన్-ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (సవరణ) ఆర్డినెన్స్, 2026' కు పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ ఆమోదం తెలిపారు.

ఈ చ‌ట్టం నిన్న‌టి నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు సీఎం భ‌గ‌వంత్ మాన్ (CM Bhagwant Mann) తెలిపారు. గ‌త మూడేళ్లుగా 5 శాతానికి అద‌నంగా వ‌సూలు చేసిన ఫీజుల‌ను త‌ల్లిదండ్రుల‌కు తిరిగి చెల్లించాల‌ని ఆదేశించారు. అంతేకాదు, గత నాలుగేళ్లలో వసూలు చేసిన ఫీజుల వివరాలను 10 రోజుల్లోగా నిర్దేశిత ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని అన్ని ప్రైవేట్ పాఠశాలలను ఆదేశించారు. ఇటీవల అమృత్‌సర్‌లో స్కూల్ ఫీజు చెల్లించలేదనే కారణంతో పాఠశాల యాజమాన్యం చేసిన మానసిక వేధింపుల తట్టుకోలేక 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన అత్యంత దారుణ ఘటనను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ హృదయ విదారక ఘటన తర్వాత.. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల పెంపుపై తల్లిదండ్రుల నుంచి వేలాది ఫిర్యాదులు వ‌చ్చిన‌ట్లు చెప్పారు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్న‌ట్లు సీఎం వెల్ల‌డించారు.

ఒకవేళ ప్రైవేట్ యాజమాన్యాలు ఈ ఆర్డినెన్స్‌ను కోర్టులో సవాలు చేస్తే.. తాము చట్టపరంగా పోరాడతామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేద‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు, ర‌వాణా, బిల్డింగ్ ఫండ్ వంటి అదనపు పేర్లతో వసూలు చేసే మొత్తాలు ట్యూషన్ ఫీజు ప‌రిధిలోకే వస్తాయని తెలిపారు. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన పాఠ‌శాల‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు సీఎం తెలిపారు. రూ.50,000 నుంచి రూ. 1 లక్ష వరకు జరిమానా విధిస్తామ‌ని.. పదే పదే ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఈ నిర్ణ‌యం వ‌ల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 7,800 ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న 32 ల‌క్ష‌ల మందికిపైగా విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని సీఎం తెలిపారు.

Advertisement
Advertisement