త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AI | ఏఐపై ప్రపంచ నిపుణుల‌ హెచ్చరిక.. లక్షల ఉద్యోగాలకు ముప్పు..

AI | కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. ప్రముఖ టెక్ కంపెనీలు తమ కార్యకలాపాల్లో ఏఐ టెక్నాలజీలు, ఆటోమేషన్‌ను వేగంగా ఉప‌యోగిస్తుండగా, సాధారణ ప్రజలు కూడా రోజువారీ పనుల కోసం ఏఐ చాట్‌బాట్‌లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

S

Technology | Published On Jul 14, 2026, 4.51 pm IST

AI | ఏఐపై ప్రపంచ నిపుణుల‌ హెచ్చరిక.. లక్షల ఉద్యోగాలకు ముప్పు..
Advertisement

AI | కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. ప్రముఖ టెక్ కంపెనీలు తమ కార్యకలాపాల్లో ఏఐ టెక్నాలజీలు, ఆటోమేషన్‌ను వేగంగా ఉప‌యోగిస్తుండగా, సాధారణ ప్రజలు కూడా రోజువారీ పనుల కోసం ఏఐ చాట్‌బాట్‌లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఏఐ సామర్థ్యాన్ని పెంచి పనులను మరింత వేగంగా పూర్తి చేయడంలో సహాయపడుతుందని దాని మద్దతుదారులు చెబుతున్నారు. అయితే మరోవైపు, కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం, ముఖ్యంగా వైట్-కాలర్ ఉద్యోగాలు, మేనేజీరియల్ పోస్టులను తగ్గించడం ఆందోళనకు కారణమవుతోంది. ఏఐ వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, పరిశ్రమ నాయకులు కలిసి హెచ్చరికలు జారీ చేశారు. ఏఐ కారణంగా భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు.

సంత‌కాలు చేసిన 200 మంది..

వీ మస్ట్ యాక్ట్ నౌ పేరుతో విడుదల చేసిన ఓ లేఖపై 200 మందికి పైగా ఆర్థికవేత్తలు, నోబెల్ విజేతలు, పరిశ్రమ ప్రముఖులు సంతకాలు చేశారు. వచ్చే పదేళ్లలో ఏఐ ప్రస్తుతం ఉన్నదానికంటే మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను పారిశ్రామిక విప్లవం కంటే కూడా పెద్ద స్థాయిలో ప్రభావితం చేసే అవకాశముందని, అయితే ఈ మార్పు చాలా తక్కువ కాలంలోనే జరిగే అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు. ఈ వేగవంతమైన పరిణామం అనేక ప్రమాదాలకు దారితీసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని లేఖలో హెచ్చరించారు. ముఖ్యంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో, జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశాలు వంటి కొన్ని సానుకూల అంశాలు కూడా ఏఐ ద్వారా లభిస్తాయ‌ని అంగీకరించారు.

వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే..

ఈ నేపథ్యంలో ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు, టెక్నాలజీ నాయకులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో పిలుపునిచ్చారు. ఏఐ వల్ల ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని లోతుగా అధ్యయనం చేయడంతోపాటు, దాని ప్రమాదాలను నియంత్రించే రక్షణ చర్యలు రూపొందించాలని సూచించారు. అలాగే మానవులను భర్తీ చేసే విధంగా కాకుండా, మానవులకు తోడ్పడే దిశగా ఏఐ అభివృద్ధి చెందేందుకు అవసరమైన విధానాలు, ప్రోత్సాహకాలు, సంస్థాగత వ్యవస్థలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీతలు డారన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, క్రిస్టోఫర్ ఏ. పిస్సరైడ్స్ ఉన్నారు. పరిశ్రమ ప్రముఖులలో ఆంత్రోపిక్ సహ వ్యవస్థాపకుడు జాక్ క్లార్క్, ఓపెన్‌ఏఐకు చెందిన రోన్నీ ఛటర్జీ, డీన్ బాల్, గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ ష్మిట్, గూగుల్ డీప్‌మైండ్‌కు చెందిన మిషియెల్ బక్కర్ కూడా ఈ లేఖపై సంతకం చేశారు.

భారీ స్థాయిలో ఉద్యోగుల తొల‌గింపు..

కాగా ఖర్చులు తగ్గించడం, స్థూల ఆర్థిక పరిస్థితులు, సంస్థాగత పునర్వ్యవస్థీకరణ పేరుతో ఇప్పటికే అనేక కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలను ప్రకటిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో ఒరాకిల్ 491 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించగా, గతేడాదిలో మొత్తం 21 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణంపై ఆ సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతోంది. మరోవైపు మైక్రోసాఫ్ట్ కూడా తన ఉద్యోగుల్లో సుమారు 2.5 శాతం మందిని తగ్గించే ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం. అలాగే కాయిన్‌బేస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు కూడా ఏఐ వినియోగం వేగంగా పెరగడంతో పలువురు ఉద్యోగులను తొలగించాయి. ఈ పరిణామాలు ఏఐ ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చలకు మరింత ఊతమిస్తున్నాయి.

Advertisement
Advertisement