త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pune Man | భార్య‌కు బిజినెస్ టూర్ అని చెప్పి ప్రియురాలితో విదేశీ ట్రిప్‌.. ఎయిర్‌పోర్టులో వ్యాపారికి ఊహించిన షాక్‌

Pune Man | భార్య‌కు బిజినెస్ ట్రిప్ అని చెప్పి పూణేకి చెందిన ఓ వ్యాపారి ప్రియురాలితో విదేశాల‌కు వెళ్లాల‌ని ప్లాన్ చేసుకున్నాడు. అయితే, ఎయిర్‌పోర్టులో ఊహించ‌ని షాక్ త‌గిలింది. ప్రియురాలి పాస్‌పోర్టు వివాదం కార‌ణంగా అత‌డు త‌న భార్య‌కు అడ్డంగా దొరికిపోవాల్సి వ‌చ్చింది.

D

National | Published On Sep 19, 2026, 3.53 pm IST

Pune Man | భార్య‌కు బిజినెస్ టూర్ అని చెప్పి ప్రియురాలితో విదేశీ ట్రిప్‌.. ఎయిర్‌పోర్టులో వ్యాపారికి ఊహించిన షాక్‌
Advertisement

Pune Man | త్రినేత్ర‌.న్యూస్ : భార్య‌కు బిజినెస్ టూర్‌కు వెళ్తున్నాన‌ని చెప్పి ప్రియురాలితో విదేశాల‌కు వెళ్లాల‌ని ప్లాన్ చేసిన పూణేకి చెందిన ఓ వ్యాపారికి (Pune Man) ఊహించ‌ని షాక్ త‌గిలింది. ప్రియురాలు చేసిన ఓ పొరపాటు కార‌ణంగా అత‌డు భార్య‌కు అడ్డంగా దొరికిపోవాల్సి వ‌చ్చింది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..? పూణేకి చెందిన 45 ఏండ్ల వ్యాపారి ఓ మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో స‌ర‌దాగా కొన్ని రోజులు విదేశాల‌కు విహార‌యాత్ర‌కు వెళ్లాల‌నుకున్నాడు. ఇందులో భాగంగానే మ‌లేషియా వెళ్లాల‌ని ప్లాన్ చేశాడు. ఈ విష‌యం భార్య‌కు తెలియ‌కుండా ఉండేందుకు బిజినెస్ ప‌నిమీద బ‌య‌ట‌కు వెళ్తున్నాన‌ని చెప్పి న‌మ్మించాడు. తన మహిళా స్నేహితురాలితో కలిసి సెప్టెంబర్ 14న ముంబై ఎయిర్‌పోర్టుకు (Mumbai International Airport) చేరుకున్నాడు. మ‌రికాసేప‌ట్లో ఫ్లైట్ ఎక్కి వెళ్లిపోతామ‌ని ఇద్ద‌రూ సంబ‌ర‌ప‌డిపోయారు. అయితే, అక్క‌డే అస‌లు ట్విస్ట్ చోటు చేసుకుంది.

స‌ద‌రు మ‌హిళ తాను గ‌తంలో పోగొట్టుకున్నానని చెప్పిన పాత పాస్‌పోర్టును ఈ ప్ర‌యాణం కోసం ఉప‌యోగించింది. ఇమ్మిగ్రేష‌న్ త‌నిఖీల్లో పాస్‌పోర్టును గుర్తించిన అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఈ వ‌వ్య‌హారంపై లీగ‌ల్ చ‌ర్య‌ల‌కు ఆదేశించారు. దీంతో త‌మ గుట్టు ఎక్క‌డ భార్య‌కు తెలిసిపోతుందోన‌ని భ‌య‌ప‌డిపోయిన వ్యాపారి ఇమ్మిగ్రేష‌న్ (immigration) పేరుతో కిడ్నాప్ డ్రామా మొద‌లుపెట్టాడు. ఎయిర్‌పోర్టులోని ఓ ల్యాండ్‌లైన్ ద్వారా త‌న భార్య‌కు ఫోన్ చేశాడు. ఇమ్మిగ్రేష‌న్ సమస్యల వల్ల తన మొబైల్ ఫోన్‌ను అధికారులకు అప్పగించాల్సి వచ్చిందని క‌ట్టుకథ అల్లాడు. ఆ మ‌రుస‌టి రోజు వాట్సాప్ వీడియో కాల్ చేసి సమస్య త్వరలోనే ముగుస్తుందని చెప్పి.. ఫోన్ పూర్తిగా స్విచ్ఛాఫ్ చేసేశాడు. అనంత‌రం త‌న ప్రియురాలితో క‌లిసి ముంబైలోని ఓ హోట‌ల్‌కు వెళ్లిపోయాడు.

భ‌ర్త మాట‌ల‌ను న‌మ్మిన భార్య ఇంటి వ‌ద్ద ప్ర‌శాంతంగా ఉంది. రెండు రోజుల త‌ర్వాత కూడా అత‌డి ఫోన్ క‌ల‌వ‌క‌పోవ‌డంతో ఆమె కంగారుప‌డి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. త‌న భ‌ర్త‌ను ఎవ‌రో కిడ్నాప్ చేశార‌ని ఫిర్యాదు చేసింది. మ‌హిళ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. త‌న‌పై కిడ్నాప్ కేసు న‌మోదైంద‌ని తెలుసుకున్న వ్యాపారి.. వెంట‌నే పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు. విచార‌ణ‌లో జ‌రిగిందంతా పూస‌గుచ్చిన‌ట్లు చెప్పేశాడు. ఎలాంటి కిడ్నాప్ జరగలేదని తేలడంతో పోలీసులు ఈ కేసును పొరపాటున నమోదైన కేసు కింద క్లోజ్ చేయాలని నిర్ణయించారు. అయితే, ఈ డ్రామాతో వ్యాపారి గుట్టు భార్య ముందు పూర్తిగా రట్టయిన‌ట్లైంది.

Also Read..

ద్విభాషా విధానానికే క‌ట్టుబ‌డి ఉన్నాం.. న‌వోద‌య పాఠ‌శాల‌ల‌కు భూములిచ్చేది లేదు.. తేల్చి చెప్పిన త‌మిళ స‌ర్కార్‌

దశాబ్దం తర్వాత ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు

మా ల్యాండ్ క‌బ్జా చేశాడు.. ప్రొడ్యూసర్ సి.క‌ళ్యాణ్‌పై చ‌ర్య‌లు తీసుకోండి

Advertisement

తాజావార్తలు

Advertisement