త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu Government | ద్విభాషా విధానానికే క‌ట్టుబ‌డి ఉన్నాం.. న‌వోద‌య పాఠ‌శాల‌ల‌కు భూములిచ్చేది లేదు.. తేల్చి చెప్పిన త‌మిళ స‌ర్కార్‌

Tamil Nadu Government | తాము ద్విభాషా విధానానికే (Two-language policy) క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. న‌వోద‌య పాఠ‌శాల‌ల‌కు (Jawahar Navodaya Vidyalayas) భూములు ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పింది.

D

National | Published On Sep 19, 2026, 3.11 pm IST

Tamil Nadu Government | ద్విభాషా విధానానికే క‌ట్టుబ‌డి ఉన్నాం.. న‌వోద‌య పాఠ‌శాల‌ల‌కు భూములిచ్చేది లేదు.. తేల్చి చెప్పిన త‌మిళ స‌ర్కార్‌
Advertisement

Tamil Nadu Government | త్రినేత్ర‌.న్యూస్ : త్రిభాషా విధానంపై త‌మిళ‌నాడు స‌ర్కార్ (Tamil Nadu Government) త‌న వైఖ‌రిని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ద్విభాషా విధానానికే (Two-language policy) క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు తెలిపింది. రాష్ట్రంలో న‌వోద‌య పాఠ‌శాల‌ల‌కు (Jawahar Navodaya Vidyalayas) భూములు ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పింది. హిందీ భాష‌పై త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం త‌న వైఖ‌రి మార్చుకోవాలంటూ సుప్రీంకోర్టు (Supreme Court) స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో టీవీకే ఈ మేర‌కు స్పందించింది.

త‌మిళ‌నాడు ఎప్ప‌టికీ త‌న ద్విభాషా విధానానికే క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని విద్యాశాఖ మంత్రి రాజ‌మోహ‌న్ ఆర్ముగం (Rajmohan Arumugam) స్ప‌ష్టం చేశారు. "రాష్ట్రంలో ద‌శాబ్దాలుగా ద్విభాషా విధాన‌మే అమ‌లవుతోంది. భ‌విష్య‌త్తులోనూ అదే కొన‌సాగుతుంది. మోడ‌ల్ స్కూళ్ల‌లో ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. సీబీఎస్ఈ పాఠ‌శాల‌ల‌కు భూములు ఇవ్వ‌డం లేదు. ద్విభాషా విధానానికే క‌ట్టుబ‌డి ఉన్నాం" అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్య‌లు తుది తీర్పు కాద‌ని, విచార‌ణ స‌మ‌యంలో న్యాయ‌మూర్తి వ్య‌క్తం చేసిన అభిప్రాయం మాత్ర‌మేన‌ని నొక్కిచెప్పారు. రాష్ట్రం హిందీకి గానీ, ఇత‌ర భాష‌ల‌కు గానీ వ్య‌తిరేకం కాద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ గ‌డ్డ‌పై త‌మిళ భాష‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు.

డీఎంకే మద్దతు..

ద్విభాషా విధానానికి కట్టుబడి ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ స్వాగతించారు. రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత నవోదయ పాఠశాలల ఏర్పాటును వ్యతిరేకిస్తూ, అవసరమైతే తమిళనాడు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

త‌మిళ‌నాడు స‌ర్కార్‌పై సుప్రీం ఆగ్ర‌హం

ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాల (Navodaya Vidyalayas) ఏర్పాటుకు భూమిని కేటాయించాలంటూ జారీ చేసిన‌ మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్న టీవీకే ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తిని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవ‌లే తోసిపుచ్చిన విష‌యం తెలిసిందే. విద్యార్థులకు లభించే నాణ్యమైన విద్యావకాశాలను దెబ్బతీస్తూ, ఈ అంశాన్ని భాషా వివాదంగా మార్చవద్దని హితవు పలికింది. స్కూళ్లలో హిందీ బోధన పట్ల తమిళనాడు ప్రభుత్వం తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని అభిప్రాయ‌ప‌డింది. తమిళనాడు గడ్డపై హిందీ బోధించకూడదనే మొండి వైఖరి పనికిరాదని స్పష్టం చేసింది.

త్రిభాషా విధానం కింద ప్రాంతీయ భాష, ఆంగ్లంతో పాటు ఏదైనా మూడో భారతీయ భాషను బోధించవచ్చని తెలిపింది. అది కచ్చితంగా హిందీ మాత్రమే అయి ఉండాల్సిన నిబంధన ఏమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సహకార సమాఖ్యస్ఫూర్తితో (cooperative federalism) భాషా వివాదంపై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం చర్చలు జరపాలని సూచించింది. ప్రతి జిల్లాలో జేఎన్‌వీల ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నెలల గడువు విధించింది. అయితే, నవోదయ విధానం రాష్ట్ర భాషా విధానానికి పూర్తి విరుద్ధంగా ఉందని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది జైదీప్ గుప్తా వాదించారు. దీని వ‌ల్ల త‌మిళ భాష‌కు ప్రాధాన్య‌త త‌గ్గుతుంద‌న్న ప్ర‌భుత్వ ఆందోళ‌న‌ను ధ‌ర్మాస‌నం ముందు ఉంచారు.

"న‌వోద‌య" లేని ఏకైక రాష్ట్రం త‌మిళ‌నాడే

ప్ర‌స్తుతం దేశంలో ఒక్క నవోదయ పాఠశాల కూడా లేని ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమే. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జవహర్‌లాల్ నెహ్రూ నవోదయ విద్యాలయాలు (JNVs) జాతీయ విద్యా విధానం ప్ర‌కారం త్రిభాషా సూత్రాన్ని (Three-Language Formula) పాటిస్తాయి. దీని ప్రకారం ఇంగ్లీష్, ప్రాంతీయ భాషతో పాటు హిందీని కూడా బోధిస్తారు. అయితే, తమిళనాడు దశాబ్దాలుగా కేవలం తమిళం, ఇంగ్లీష్ భాషలనే తన అధికారిక ద్విభాషా విధానంగా (Two-language policy) చట్టబద్ధంగా అమలు చేస్తోంది. త్రిభాషా విధానం వ‌ల్ల ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్రం హిందీ భాష‌ను బ‌ల‌వంతంగా రుద్దుతోంద‌ని త‌మిళ‌నాడు ఆరోపిస్తోంది. హిందీని త‌ప్ప‌నిస‌రి చేయ‌డం వ‌ల్ల త‌మిళ భాష ప్రాధాన్య‌త త‌గ్గుతుంద‌నే ఉద్దేశంతో ఆ రాష్ట్రంలోని రాజ‌కీయ పార్టీలు, ప్ర‌భుత్వాలు మొద‌టి నుంచి నవోదయ పాఠశాలల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వ‌స్తున్నాయి.

Also Read..

భారత్ కార్బన్ ఉద్గారాలు ప్రపంచ సగటులో సగభాగమే : ప్ర‌ధాని మోదీ

సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్‌కు ర‌ష్మిక రాంగ్ ఛాయిస్ - ట్రోల్స్‌పై నేష‌న‌ల్ క్ర‌ష్ రియాక్ష‌న్‌

'చేయూత' పెన్షన్ కోసం జియో ట్యాగింగ్ నిబంధ‌న‌లు స‌వ‌రించాలి: ఎమ్మెల్సీ ఎల్ రమణ

Advertisement
Advertisement