త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Brahmotsavam 2026 | క‌నుల పండువ‌గా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు.. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు..!

Brahmotsavam 2026 | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు క‌నుల పండువ‌గా సాగుతున్నాయి. ఉత్స‌వాల్లో ఐదో రోజైన శ‌నివారం మోహినీ అవతారంలో మలయప్పస్వామివారు భక్తులను కటాక్షించారు. శనివారం ఉదయం సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో దర్శనమిచ్చారు.

P

Devotional | Published On Sep 19, 2026, 3.52 pm IST

Brahmotsavam 2026 | క‌నుల పండువ‌గా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు.. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు..!
Advertisement

Brahmotsavam 2026 | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు క‌నుల పండువ‌గా సాగుతున్నాయి. ఉత్స‌వాల్లో ఐదో రోజైన శ‌నివారం మోహినీ అవతారంలో మలయప్పస్వామివారు భక్తులను కటాక్షించారు. శనివారం ఉదయం సర్వాలంకార భూషితుడై జగన్మోహనాకారంలో దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు ముందుండగా.. భక్తుల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ పల్లకీసేవ వైభవంగా సాగింది.

అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. మోహినీ అవతారంలో స్వామివారి దర్శనం మాయామోహాలను అధిగమించి భగవంతుడిని శరణు వేడుకోవాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. భక్తి మార్గమే మాయామోహాల నుంచి విముక్తికి దారి చూపుతుందనే భావనను ఈ అలంకారం చాటిచెబుతోంది.

గరుడసేవకు భారీ ఏర్పాట్లు

బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవంగా జరిగే గరుడవాహన సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆలయం చుట్టూ నాలుగు మాడవీధుల్లోని గ్యాలరీలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని.. రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టి నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. గ్యాలరీలు భక్తులతో నిండిపోవడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

కనువిందు చేసిన కళారూపాలు..

మోహినీ అవతార సేవ సందర్భంగా ఎనిమిది రాష్ట్రాలకు చెందిన కళాకారులు 18 కళారూపాలతో అలరించారు. మొత్తం 18 కళాబృందాలకు చెందిన 502 మంది కళాకారులు జానపద, శాస్త్రీయ కళా ప్రదర్శనలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కేరళ, పంజాబ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన కళాకారులు భరతనాట్యం, కూచిపూడి, సత్రియ, ఒడిస్సీ, భాంగ్రా, కోలాటం, పెరిణి శివతాండవం, మయూర నృత్యం తదితర ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకున్నారు. మహారాష్ట్ర గూమర్‌, జెంజ్‌ నృత్యాలు, మధ్యప్రదేశ్‌ బడాయి నృత్యం, కేరళ తిరువట్టన్‌ రూపకం, అసోం సత్రియ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

టీటీడీకి చెందిన వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, దాస సాహిత్య ప్రాజెక్టు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టుల కళాకారులు సైతం ప్రదర్శనలు ఇచ్చారు. వాహనసేవలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శాలువాతో సత్కరించారు. దాస సాహిత్య ప్రాజెక్టు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్టు బృందాలకు ఈ సత్కారం దక్కింది. మోహినీ అవతార సేవలో భాగంగా సాగిన కళా ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతోపాటు భారతీయ శాస్త్రీయ, జానపద కళల వైభవాన్ని చాటిచెప్పాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement