త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ఒలింపిక్స్‌లో భార‌త భాగ‌స్వామ్యం పెర‌గాలి : ప్ర‌ధాని మోదీ

PM Modi | క్రీడలంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. ఒలింపిక్స్‌లో (Olympics) భారత ప్రదర్శన మెరుగవ్వాలంటే గతంలో ప్రాతినిధ్యం వహించని క్రీడా విభాగాల్లోనూ మన భాగస్వామ్యం పెర‌గాల‌ని పేర్కొన్నారు.

D

National | Published On Aug 27, 2026, 1.59 pm IST

PM Modi | ఒలింపిక్స్‌లో భార‌త భాగ‌స్వామ్యం పెర‌గాలి : ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : ఒలింపిక్స్‌లో (Olympics) భారత ప్రదర్శన మెరుగవ్వాలంటే గతంలో ప్రాతినిధ్యం వహించని క్రీడా విభాగాల్లోనూ మన భాగస్వామ్యం పెర‌గాల‌ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్స‌వం 2026 వేడుక‌ల్లో భాగంగా 'ఖేలో ఇండియా డైలాగ్‌' కార్యక్రమంలో వందలాది మంది క్రీడాకారులు, విద్యార్థులు, వాలంటీర్లను ఉద్దేశించి ప్ర‌ధాని వర్చువల్‌గా ప్రసంగించారు.

క్రీడలంటే కేవలం పతకాలు సాధించడం మాత్రమే కాదని అన్నారు. దేశ నిర్మాణ ప్రక్రియలో క్రీడలను ఒక అంతర్భాగంగా మార్చడమే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఒలింపిక్స్‌లో ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ.. వాటిలో సగానికి పైగా పోటీల్లో భారత‌ జట్లు కనీసం పాల్గొనడం లేదని చెప్పారు. దీన్ని ఓ చేదు నిజంగా ప్ర‌ధాని అభివ‌ర్ణించారు. "ఒలింపిక్స్ పతకాల పట్టికలో సింహభాగం పోటీల్లో మనం కనీసం పోటీ కూడా ప‌డ‌టం లేదు. ద‌శాబ్దాలుగా ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంది. ప్రపంచంలోని ఇతర దేశాలు ఆ క్రీడల్లో పతకాలు సాధిస్తుంటే.. మనం మాత్రం అసలు పోటీలోనే ఉండ‌టం లేదు. మన పతకాల సంఖ్యను పెంచుకోవాలంటే ఆయా క్రీడల్లోనూ మనం పట్టు సాధించాలి" అని ప్ర‌ధాని చెప్పుకొచ్చారు. 2036 ఒలింపిక్స్ కోసం ఇప్పటి నుంచే అథ్లెట్లు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు.

ఈ సంద‌ర్భంగా 2024 పారిస్ ఒలింపిక్స్‌ను ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. ఈ క్రీడా టోర్నీలో మొత్తం 32 క్రీడ‌లు ఉంటే.. భార‌త్ కేవ‌లం 16 విభాగాల్లో మాత్ర‌మే పోటీలో నిలిచిన‌ట్లు చెప్పారు. ఒలింపిక్స్‌లో భార‌త భాగ‌స్వామ్యాన్ని మెరుగుప‌రిచే దిశ‌గా 5 నుంచి 15 ఏళ్ల వ‌య‌స్సు గ‌ల పిల్లల కోసం దేశవ్యాప్త టాలెంట్ హంట్‌ను చేపడుతున్నట్లు స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని గుర్తు చేశారు. ఎర్రకోట వేదికగా ఆగస్టు 15న దేశ క్రీడా ముఖచిత్రంపై ఒక స్పష్టమైన దృక్పథాన్ని ఆవిష్కరించిన‌ట్లు చెప్పారు. క్రీడలంటే కేవలం పతకాలకే పరిమితం కాదని.. వికసిత భారత్ నిర్మాణంలో దేశ క్రీడా శక్తిని, యువశక్తిని ఏకం చేసే ఒక మహా యజ్ఞం అని ప్ర‌ధాని వివ‌రించారు.

Also Read..

కాన్పూర్‌లో కూలిన విమానం.. ఇద్ద‌రు మృతి

ఒక్క మంచు ఫ‌ల‌కం సృష్టించిన విధ్వంసం

ఆ వివాదం నన్ను తీవ్రంగా వేధించింది.. ఎన్నో అవకాశాలను కోల్పోయా : నోరా ఫతేహి

Advertisement
Advertisement