త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ధం కావాలి

PM Modi | 2036 ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు భారత క్రీడాకారులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించి, వారికి అవసరమైన శిక్షణ, సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు పిల్లల్లో ఏ క్రీడకు ఎవరు సరిపోతారో గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.

P

National | Published On Aug 27, 2026, 2.03 pm IST

PM Modi | 2036 ఒలింపిక్స్‌కు ఇప్ప‌టి నుంచే స‌న్న‌ద్ధం కావాలి
Advertisement
  • పిల్ల‌ల‌ను గుర్తించి ప్రోత్స‌హించాలి
  • ప్రతీక్రీడ‌లో ప‌త‌కాలు సాధించే స్థాయికి ఎద‌గాలి
  • ఖేలో ఇండియా డైలాగ్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

PM Modi | 2036 ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు భారత క్రీడాకారులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించి, వారికి అవసరమైన శిక్షణ, సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు పిల్లల్లో ఏ క్రీడకు ఎవరు సరిపోతారో గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. దేశంలో ప్రతి క్రీడలో పతకాలు సాధించే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన ‘ఖేలో ఇండియా డైలాగ్‌–స్పోర్ట్స్‌ టాక్‌ విత్‌ పీఎం మోదీ’ కార్యక్రమంలో యువ క్రీడాకారులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 1,500కుపైగా విద్యా సంస్థలు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌, ప్రముఖ వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి.

ప్రతిభను గుర్తించేందుకు ‘టాలెంట్‌ హబ్‌’

2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ‘టాలెంట్‌ హబ్‌’ కార్యక్రమాన్ని నిర్వహించి క్రీడా ప్రతిభను వెలికితీయాలని మోదీ పిలుపునిచ్చారు. ఒలింపిక్స్‌లో భారత్‌ పాల్గొనే విభాగాల సంఖ్యను గణనీయంగా పెంచుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో ఉన్న సగానికి పైగా క్రీడాంశాల్లో భారత్‌ పాల్గొనలేకపోయిందని పేర్కొన్నారు. ‘‘పతకాల సంఖ్య పెరగాలంటే ప్రతి క్రీడలోనూ మనం రాణించాలి. ఇందుకోసం క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. శిక్షణ కూడా అందిస్తుంది’’ అని ప్రధాని తెలిపారు. క్రీడల పట్ల సమాజంలో గతంతో పోలిస్తే ఎంతో మార్పు వచ్చిందని చెప్పారు. మంచి క్రీడాకారుడిగా ఎదగాలంటే మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. దేశ యువతపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. చిన్నారుల్లోని ప్రతిభను సరైన సమయంలో గుర్తించి.. వారికి అనువైన క్రీడలో శిక్షణ ఇచ్చేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అన్నారు. క్రీడా రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, పోటీ అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మాదకద్రవ్యాల నియంత్రణలో క్రీడలదీ కీలక పాత్ర

మాదకద్రవ్యాల సమస్యను ఎదుర్కోవడంలో క్రీడలు కీలక పాత్ర పోషించగలవని ప్రధాని అన్నారు. కేవలం పతకాలు సాధించడమే క్రీడల ఉద్దేశం కాదని పేర్కొన్నారు. పారా క్రీడాకారులు తమ జీవితాలను క్రీడల ద్వారా ఎలా మార్చుకున్నారో చూపిస్తున్నారని.. వారి ప్రస్థానం తనకు స్ఫూర్తినిస్తోందన్నారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలోనే ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు దేశవ్యాప్త టాలెంట్‌ సెర్చ్‌ కార్యక్రమాన్ని ప్రధాని ప్రకటించారు. అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణంలో దేశ క్రీడా శక్తిని, యువశక్తిని కలిపి ముందుకు తీసుకెళ్లడమే కార్యక్రమం లక్ష్యమని అప్పట్లో పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆడేవారే అభివృద్ధి చెందుతారు’’ అని యువ క్రీడాకారులను ఉద్దేశించి పేర్కొన్నారు. క్రీడాకారుల పేర్లు వారి రాష్ట్రాలు, నగరాలకు గుర్తింపుగా నిలుస్తాయన్నారు.

Advertisement
Advertisement